10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!  

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు

13, జనవరి 2021, బుధవారం

దొరకునా ఇటువంటి సేవ - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి కృతులలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా రాముని సేవా భాగ్యం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించే ఉన్నతస్థాయి కృతులను ఎన్నో రచించారు. రాముని రూప లావణ్యాలను, ముక్కోటి దేవతలు, భాగవతోత్తములు శ్రీరాముని అనేక ఉపచారముల ద్వారా కొలిచే రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణించి, మనసులు ఉప్పొంగి రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా అంతర్భాగం కావాలన్న సంకల్పం కలిగేలా చేశారు. ఆయన నిరంతర రామ సేవా భాగ్యంలో తరిస్తూ రచించిన ఈ కృతులు అమృతధారలై నిలిచాయి. అటువంటి ఒక కృతి దొరకునా ఇటువంటి సేవ. వివరాలు:

సాహిత్యం
========

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా అల్ప తపమొనరించిన భూసురవరులకైన సురలకైన 

తుంబురు నారదాదులు సుగుణ కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీషముఖ్యులు నామము సేయగ జాజుల పై జల్లగ
బింబాధరలగు సురవార యలివేణులు నాట్యము లాడగ
అంబుజ భవ పాకారులిరుగడలనన్వయ బిరుదావళినిపొగడగ
అంబరవాస సతులు కర కంకణంబులు ఘల్లని విసరగ మణి హా
రంబులు కదలగ నూచే ఫణి తల్పంబున నెలకొన్న హరిని కనుగొన

మరకత మణి సన్నిభ దేహంబున మెరుగు కనక చేలము శోభిల్ల
చరణ యుగ నఖావళి కాంతులు చందురు పిల్లలను గేర
వర నూపురము వెలుగు కర యుగమున వజ్రపు భూషణములు మెరయ
ఉరమున ముక్తాహారములు మరియు ఉచితమైన మకర కుండలంబులు
చిరు నవ్వులు గల వదనంబున ముంగురులద్దంపు కపోలము ముద్దు
గురియు దివ్యఫాలంభున దిలకము మెరసే భువిని లావణ్యనిధిని గన

తామస గుణ రహిత మునులకు బొగడ దరము గాకనే భ్రమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్ల పైని చెలువందగ కొలువుండగ
కామిత ఫలదాయకియౌ సీత కాంతుని గని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాబాడుచు నూచగ
రాముని జగదోద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణధాముని కనులార మదిని కనుగొన

భావం
=====

సూక్ష్మమైన తపము చేసిన బ్రాహ్మణులకైనా, దేవతలకైనా ఇటువంటి రామ సేవాభాగ్యము దొరకునా? తుంబురు నారదులు సుగుణములను పొగడే కీర్తనలను ఆలాపన చేయగా, అంబరీషుడు వంటి భక్తాగ్రగణ్యులు నామమును నుతించగా, జాజులను చల్లుతూ ఎర్రని పెదవులు కలిగిన దేవ కన్యలు నాట్యము చేయగా, బ్రహ్మేంద్రాదులు ఇరుపక్కల అనేక బిరుదులతో పొగడగా, ఆకాశములో నివసించే సతులు చేతుల కంకణములు ఘల్లనిపించగా, మణిహారములు ఊగగా నూచే శేషతల్పశాయియైన హరిని చూచే సేవాభాగ్యము దొరకునా? పచ్చలకాంతి వంటి ప్రకాశము కలిగిన దేహముపై మెరిసే బంగారు వస్త్రము శోభిల్లగా, పాదములగోళ్ల కాంతులు చంద్రకాంతులను పోలగా, మంచి మంజీరములు పాదములపై వెలుగొందగా, చేతులయందు వజ్రాల ఆభరణాలు మెరయగా, కంఠమున ముత్యాల హారములు, చెవులకుచితమైన మకర కుండలములు, చిరునవ్వులు కలిగిన ముఖమున ముంగురులు, అద్దము వంటి చెక్కిళ్లు ముద్దులు కురిపించగా, దివ్యమైన నుదుట మెరిసే తిలకము కలిగిన ఈ భూమిపై సౌందర్యమునకు నిధియైన రాముని చూచే సేవాభాగ్యము దొరకునా? తామస గుణరహితులైన మునులకు పొగడ శక్యము గాక చకితులై నిలువగా, కనకపు ఊయలపై అందముగా కొలువుండిన, కోరిన వరములొసగే సీతమ్మ పతిదేవుని చూచి ఉప్పొంగగా, కాకర్ల రామబ్రహ్మం తనయుడైన త్యాగరాజు తాను పాడుచు ఊపగా, జగదోద్ధారకుడు, రాక్షసుల పాలిట అరివీరభయంకరుడు, త్రిగుణాతీతుడు, పూర్ణకాముడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములకు నెలవైన రాముని కనులార మనసులో కనుగొనే సేవాభాగ్యము దొరకునా? 

శ్రవణం
=======

బిలహరి రాగంలో ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు పాడగా వినండి

10, జనవరి 2021, ఆదివారం

ఎదుటనున్నాడు వీడే - అన్నమాచార్యుల కృతి


పరబ్రహ్మమైన శ్రీహరి దేవకి కడుపున అసాధారణమైన పరిస్థితులలో అవతారం దాల్చి, అటువంటి అసాధారణ పరిస్థితులలోనే దేవకి చెంతకు చేరి ఆ తల్లితో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాండమును బాలుని నోట జూచినా, వైష్ణవమాయలో ఆ తల్లి పరమాత్మను బిడ్డగానే భావించి అవ్యాజమైన ప్రేమను పంచింది. ఇక పెరుగుతున్న కొద్దీ ఆ బాలుని లీలలు అన్నా ఇన్నా? వెన్నముద్దలు దొంగిలించాడు, పశువులను గాచాడు, రాక్షసులను సంహరించాడు, శాపగ్రస్తులకు మోక్షాన్ని కలిగించాడు, కాళీయుని పొగరణచాడు, రాసలీలలో పాల్గొన్నాడు.... అడుగడుగునా వైనమంత వల్లించలేని లీలలు, నమ్మశక్యం గాని చేష్టలు. వీటిని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలెన్నిటో అద్భుతంగా ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి ఎదుటనున్నాడు వీడే. వివరాలు:

సాహిత్యం
========

ఎదుటనున్నాడు వీడే! ఈ బాలుడు!
మది తెలియమమ్మ ఏమరులో గాని!!

పరమపురుషుడట పశుల గాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూలమీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిపి శ్రీవేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణో గాని

భావం
=====

ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా! ఇతడే పరమపురుషుడట, మరి పశువులను గాస్తున్నాడుట, ఈ తీరులను లెక్కించిన అర్థమయ్యే సంగతులు కావు. ఇతడే శ్రీహరియట, అందరికీ మురిపాలు అందిస్తున్నడట, ఇవేమి మాటలో గానీ స్థిరమై నిలిచాయి. ఇతడు వేదాలకు ప్రభువట, మరి వెన్నలు దొంగిలించిన వాడు కూడా ఇతడేయట, శ్రద్ధగా విన్న వారికైనా ఇది నమ్మదగినదేనా? అన్నిటికీ మూలము ఇతడేనట, ఇతడివి కొంటె చేష్టలట, ఇవి కథలే తప్ప మంచి మాటలు కావు. ఇతడు బ్రహ్మకు తండ్రియట, మరి యశోదకు బిడ్డ కూడా అట, మనపై ఎంత కరుణో ఉందో, అందుకే తన మహిమలను తెలిపేందుకు శ్రీవేంకటాద్రిపై దేవుడై నిలిచినాడట, ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా!

శ్రవణం
=======

భుజంగిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

2, జనవరి 2021, శనివారం

బ్రహ్మాండ వలయే మాయే - మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కృతి


ఈ భారతదేశంలో సంగీతం కలకాలం నిలిచింది అంటే దానికి ఆనాటి పాలకుల ఇచ్చిన ఆదరణ కూడా ఒక ముఖ్యమైన కారణం. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు రాజాశ్రయాన్ని పూర్తిగా త్యజించారు, అది ఆనాటి పరిస్థితులకు సముచితంగా వారు ఎంచుకున్న మార్గం. రాజాశ్రయంలో ఉన్న లోటుపాట్లను ఎరిగే, నరస్తుతులకు, వారిచ్చే కానుకలకు దూరంగా నిలిచి పూర్తిగా రాముని సేవలోనే గడిపారు. కర్నాటక సంగీతంలో ఉన్న మహత్తును, ఆధ్యాత్మిక సంపదను గ్రహించి ఆ తరువాతి కాలంలో ఎందరో జమీందార్లు, పాలకుకు స్వయంగా సంగీతాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించి, దానిని ఉపాసనా మార్గంలో వినియోగించుకుని, అద్భుతమైన అనుభూతులను పొందుతూ, తమ తమ ఆస్థానలలో సంగీత సాహిత్య నాట్య సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి కళాకారులను, గురువులను ఆదరించి, ప్రోత్సహించారు. అటువంటి వారిలో మైసూరు సంస్థానం చివరి మహారాజా జయచామరాజ వడయార్ గారు ప్రముఖులు. వారు శ్రీవిద్యోపాసకులే కాకుండా కర్నాటక శాస్త్రెయ సంగీత ప్రావీణ్యం కలవారు, ఎన్నో కృతులను కూడా రచించారు. మైసూరు సామ్రాజ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని నుతిస్తొ ఆయన రచించిన ఒక కృతి. వడయార్ గారి ముద్ర శ్రీవిద్య. అలాగే, ఈ కృతిని ఆయన మాండ్ రాగంలో స్వరపరచారు. తగ్గట్టుగానే పల్లవిలోనే రాగముద్రను పొందు పరచారు. వారి సంస్థానంలో నిత్యం ఈ కృతిని విద్వాంసులు ఉదయం అమ్మవారి సేవలో ఆలపించేవారట. అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ కృతిని పరిశీలిస్తే వడయార్ గారి సంస్కృత భాషా పాండిత్యం, ఉపాసనా బలం గోచరిస్తాయి. శివజాయే, బ్రహ్మరంధ్రనిలయే, అహినిభవేణి, అంతరహిత కైవల్య విహారిణి, గతినిర్జితకరిణి మొదలైన పదసమూహాలు వడయార్ గారి ప్రతిభలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. వివరాలు:

సాహిత్యం
========

బ్రహ్మాండ వలయే మాయే బ్రహ్మాది వందిత శివజాయే

బ్రహ్మవిద్యానందిత హృదయే బ్రహ్మర్షాద్యుపాసిత శ్రీవిద్యా బ్రహ్మరంధ్రనిలయే

గౌతమార్చిత గాయత్రి గౌరీ గిరిరాజేంద్ర పుత్రి
కాంత రాగిణి నారాయణి కారుణ్య లలితే మంజులవాణి
అంతర్ముఖ జ్యోతిర్మయ కల్యాణి అహినిభవేణి పురాణి
అంతరహిత కైవల్య విహారిణి గతినిర్జితకరిణి గీర్వాణి

భావం
=====

పరమశివుని పత్నివైన ఓ పార్వతీదేవీ! నీవు బ్రహ్మాండమును చుట్టి యున్న మాయవు, బ్రహ్మాదులచే పూజించబడుచున్నావు. నీవు బ్రహ్మవిద్యచే ఆనందము పొందే హృదయము కలిగియున్నావు, బ్రహ్మర్షులచే ఉపాసించే శ్రీవిద్యవు, సహస్రార చక్రమునందు నివసించియున్నావు. నీవు గౌతమ మునిచే అర్చించబడిన గాయత్రివి, పర్వతరాజేంద్రుడైన హిమవంతుని పుత్రివి, పతియైన పరమశివునిపై అనురాగముతో నిండియున్నావు, నారాయణుని సోదరివి, కరుణామూర్తివి, లలితవు, మృదువైన పలుకులు కలిగియున్నావు, ఎల్లప్పుడూ అంతర్ముఖవై ప్రకాశించెదవు, ఎల్లప్పుడూ శుభములు కలిగించెదవు, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగియున్నావు, సనాతనమైనదానవు, అంతములేని మోక్షములో విహరించెదవు, ఏనుగును మించిన నడక కలిగి, వాక్కే అస్త్రముగా గల పరదేవతవు.

శ్రవణం
======

మాండు రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని విదుషీమణి ఎమ్మెస్ షీలా గారు ఆలపించారు


1, జనవరి 2021, శుక్రవారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం - వేటూరి గీతం



శ్రీహరి చరణకమలాల మహత్తును, రహస్యాన్ని ఎందరో ఋషులు, వాగ్గేయకారులు, కవులు వేనోళ్ల పొగిడారు, తమ అంతర్దృష్టితో పొందిన అనుభూతులను మనోజ్ఞంగా అక్షరరూపంలో ఆవిష్కరించారు. అపౌరుషేయమైన వేదములలో కూడా పరమపురుషుని పదాల గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. పురుష సూక్తంలో పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోऽస్యేహాऽऽభవాత్పునః అని చెప్పబడింది, అనగా పరమాత్మ పాదమే విశ్వముగా ఆవిర్భవించింది, ఆ స్వామి మూడు పాదములు అమృతత్వం కలిగిన లోకాలపై నిలిచి ఉంటాయి, అవి అత్యున్నతమైన మోక్షాన్ని సూచించే విధంగా ఊర్ధ్వదిశగా ఉంటాయి, ఆ పరమపురుషుని ఒక పాదమే మరల మరల సృష్టి క్రమమవుతున్నది అని. ఈ సత్యాన్నే అనేక అవతారములలో మనం గమనిస్తాం కూడా. వాటిని వాగ్గేయకారులు తమ సాహిత్యంలో అద్భుతంగా ప్రస్తావించారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కృతిలో దశావతారములలో పరమపురుషుని పదవైశిష్ట్యాన్ని ఆవిష్కరించగా, కృష్ణశాస్త్రి గారు పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు అన్నారు, అలాగే రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం అని అటువంటి భావాన్నే తనదైన శైలిలో పలికించారు. ఆ తరువాత ఈ హరిపాద వైభవాన్ని అంతే మనోజ్ఞంగా, లోతుగా పలికించారు వేటూరి వారు. మయూరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కూర్చగా వేటూరి చేసిన శ్రీహరి పదార్చన వివరాలు.


సాహిత్యం
=======

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంథం 

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోని ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీహస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పథమై
తుంబుర వర నారద మునులు  జనులు కొలిచే ఈ పాదం


భావం
====

శ్రీహరి పాదమే కదా ఈ భూమిపై నాట్యానికి వేదమైంది, ఈ పాదం పరమశివునికి ఆనందం కలిగించేది, ఈ పాదం కాలగమనంలోని మార్పులకు సాక్ష్యం. ఈ శ్రీహరి పాదమే కాళింగుని తలలపై అందంగా నాట్యం చేసింది, ఈ పాదమే ఆనాడు బలిని పాతాళానికి తొక్కివేసింది, ఈ పాదం నుండే సురగంగ జన్మించింది, ఈ పాదం తాకగానే అహల్య శాపవిముక్తి పొంది తిరిగి చైతన్యవంతమైంది, ప్రతి గీతంలోనూ ఈ పాదం ఒక చరణమైంది, ప్రతి కావ్యగీతికలోనూ ఈ శ్రీహరి చరణమే ఒక పాదమైంది, గానామృతమే తన ప్రాణం చేసుకుని లయబద్ధంగా హొయలు చిందించేది ఈ శ్రీహరి పాదమే. ఈ శ్రీహరి పాదమే ఏడుకొండలకు శిఖరమైంది, ఈ పాదమే లక్ష్మీ దేవి చేతిలో ఉన్న కమలముపై తుమ్మెదలా వ్రాలి ఉంది, ఈ పాదమే వాగ్గేయకారుల సాహిత్య సంగీత రూపమైంది, ఈ పాదమే త్యాగయ్య చిత్తానికి శ్రీచందనమైంది, ఈ పాదమే అన్నమయ్య పదకవితగా జాలువారింది, ఈ పాదమే క్షేత్రయ్యకు నాట్యసోపానమైంది, తుంబురుడు, నారదుడు, మునిశ్రేష్ఠులు, మానవులు కొలిచేది ఈ శ్రీహరి పాదమునే. 

శ్రవణం
======

వేటూరి సుందరరామమూర్తి గారి గీతాన్ని ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరచగా, ఎస్పీ శైలజ గారు ఆలపించారు

31, డిసెంబర్ 2020, గురువారం

రాజగోపాలం భజేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో మన్నార్‌గూడి శ్రీవిద్యా రాజగోపాలస్వామి వారిపై రచించిన కృతి ఇది. ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు రాజగోపాలస్వామిగా వెలశాడు.  ఇక్కడి ప్రధాన దేవత రూపాలు మూలమూర్తి వాసుదేవ పెరుమాళ్, ఉత్సవమూర్తి రాజగోపాలస్వామి. ఇక్కడ అమ్మవారు హేమభుజవల్లి (సెంగమల తాయారు). దేవకీవసుదేవులకు దర్శనమిచ్చి వారికి పుత్రునిగా జన్మించినది మొదలు గోపాలకునిగా 32 లీలలు ఆ శ్రీహరివి. వాటికి ప్రతీకగానే ఇక్కడి నిత్యసేవలు. రాజగోపాలుని రూపంలో ఒకచేతి మీద కొరడా, చేత వెన్నముద్ద, తలపాగా, చేతులకు గాజులు, నడుముకు ఆభరణములు,పంచెకట్టు, మరొక చేత ఏనుగు దంతము, చుట్టూ గోవులు ఉంటాయి. కంసుడు బలరాముని చంపటానికి కువలయపీఠమనే ఏనుగును పంపగా కృష్ణుడు దానిని చంపి దంతాలను విరుస్తాడు. దానికి ప్రతీకగానే ఇక్కడి స్వామి చేత దంతము. అలాగే గోపస్త్రీల వస్త్రములు, ఆభరణములు దొంగిలించిన దానికి ప్రతీకగా ఒకచెవికి గోపస్త్రీ కుండలము ఉంటుంది. ఇక్కడ స్వామికి పాలను నివేదన చేస్తారు. వివాహ సంతానాది దోషాల నివారణకు, పశు సంవృద్ధికి, సుఖసంతోషాలకు ఈ స్వామిని పూజిస్తే ఫలితం వెంటనే ఉంటుందని నమ్మకం. ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించగా, 16వ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులు పునరుద్ధరించారు. ఇక్కడి హరిద్రానది పుష్కరిణి భారతదేశంలోనే అత్యంత విశాలమైన తీర్థంగా ఒకటిగా పేరొందింది. ఇది 23 ఎకరాల మేర ఉంది. ఉత్సవమూర్తి అయిన రాజగోపాలస్వామి రుక్మిణీ సత్యభామల సహితుడై కొలువబడతాడు. ఈ క్షేత్ర వృక్షం పారిజాత వృక్షం. ఈ వివరాలలో కొన్నిటిని దీక్షితులవారు ఈ కృతిలో ప్రస్తావించారు. 

సాహిత్యం
=======

రాజగోపాలం భజేऽహం రమాలీలం

తేజోమయ మోహనకరం దివ్యాంబరాది ధరం
గజరాజ పూజిత పదం గుణిజన నత గోవిందం

నారదాది కృత భజనం నాదలయయుత సదనం
హరిద్రానదీ తీరం హత్యాది పాప హరం
పారిజాత తరుమూలం పంకజ నయన విశాలం
గురుగుహనుత వనమాలం గోపీజనమాలోలం

భావం
=====

లక్ష్మీదేవితో లీలలను చేసే రాజగోపాలస్వామిని నేను భజిస్తున్నాను. తేజోమయ రూపముతో మోహింపజేసేవాడు, దివ్యమైన వస్త్రములు, ఆభరణములు ధరించేవాడు, గజేంద్రునిచే పూజించబడిన పదములు కలవాడు, శ్రేష్ఠులచే నుతించబడిన గోవిందుడు, రాజగోపాలుని నేను భజిస్తున్నాను. నారదాది మునులచే భజించబడేవాడు, నాదలయయుతమైన సంగీతంలో నివసించేవాడు, హరిద్రానదీ తీర్థ సమీపంలో వెలసినవాడు, హత్య మొదలైన పాపములను హరించేవాడు, పారిజాతవృక్ష మూలమున నివసించేవాడు, కలువల వంటి విశాలమైన నేత్రములు కలవాడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడిన వాడు, వనమాల ధరించేవాడు, గోపస్త్రీలను మైమరపింపజేసేవాడు అయిన రాజగోపాలుని భజిస్తున్నాను. 

శ్రవణం
======

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

30, డిసెంబర్ 2020, బుధవారం

క్షితిజారమణం చింతయే - దీక్షితుల వారి కృతి


దీక్షితుల వారు అద్వైత సిద్ధాంతంపై గల విశ్వాసాన్ని తమ కృతులలో పూర్తిగా ప్రతిబింబించారు. షణ్మతములలోని దేవతలను అంతే భక్తితో, తాదాత్మ్యతతో ఆరాధించారు, ఆ భావనలు ఆయన కృతులలో సుస్పష్టంగా తెలుస్తాయి. శైవ శాక్తేయ షణ్ముఖ సాంప్రదాయాలలోని దేవాలయాలలోని దేవతామూర్తులపై ఆయన ఉపాసనా పూర్వకంగా ఎలా కృతులు రచించారో అదే పద్ధతిలో ఆయన వైష్ణవ సాంప్రదాయంలోని అనేక దేవాలయాలను సందర్శించి అత్యద్భుతమైన కృతులను రచించారు. ఈ ధనుర్మాసంలో వారు రచించిన కొన్ని శ్రీరంగనాథుని కృతులను ప్రస్తావించాను. అలాగే, శ్రీరామచంద్రునిపై ఆయన మనోజ్ఞమైన ప్రాకృత భాషలో దివ్యమైన కృతులను రచించారు. వాటిలో ఒక కృతి వివరాలు:

సాహిత్యం
========

క్షితిజారమణం చింతయే శ్రీరామం భవతరణం

క్షితిపతి నత చరణం సేవిత విభీషణం
క్షితి భరణం శ్రితచింతామణిం అఘహరణం

సకలసుర మహిత సరసిజ పదయుగళం శాంతం అతికుశలం
వికసిత వదన కమలమతులితమమలం వీరనుత భుజబలం
శుకశౌనక ముని ముదిత గురుగుహ విదితం శోభన గుణ సహితం
ప్రకటిత సరోజ నయనం పాలిత భక్తం భవపాశహరణనిపుణం

భావం
=====

భవసాగరాన్ని దాటించేవాడు, భూమి నుండి జన్మించిన సీతాదేవి పతి అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. మహారాజులచే నుతించబడిన చరణములు కలవాడు, విభీషణునిచే సేవించబడిన వాడు, వరాహావతారంలో భూమిని రక్షించినవాడు, ఆశ్రితులకు చింతామణివలె కామ్యములను తీర్చేవాడు, పాపములను హరించేవాడు అయిన శ్రీరాముని ధ్యానిస్తున్నాను. సమస్త దేవతల చేత పూజించబడిన పదకమలములు కలవాడు, శాంతమూర్తి, అత్యంత నైపుణ్యము కలవాడు, వికసించిన కమలము వంటి ముఖము కలవాడు, సాటిలేని వాడు, నిర్మలుడు, వీరులచే నుతించబడిన భుజబలము కలవాడు, శుకశౌనకాది మునులకు ఆనందం కలిగించినవాడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు, సద్గుణములు కలిగి ప్రకాశించేవాడు, వికసించిన కలువల వంటి కన్నులు కలవాడు, భక్తులను పాలించేవాడు, జనన మరణ బంధముల నుండి ముక్తి కలిగించుటలో నిపుణుడైన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
======

దేవగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని జొన్నలగడ్డ శ్రీరాం ఆలపించారు

29, డిసెంబర్ 2020, మంగళవారం

పరిమళ రంగనాథం భజేऽహం - దీక్షితుల వారి క్షేత్ర కృతి

దీక్షితుల వారి క్షేత్ర కృతులలో ఒకటి తమిళనాడు తిరువిందళూరులోని పుండరీకవల్లీ సమేత పరిమళరంగనాథునిపై రచించినది. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. శ్రీమహావిష్ణువు మత్స్యావతారుడై వేదాలను రక్షించి తిరువిళందూరులోని వనంలో తపస్సు చేసి ఆ వేదాలను వల్లించి వాటికి, తనకు కూడా శాశ్వతమైన పరిమళాన్ని ఆపాదించుకున్నాడు. అంతే కాదు, ఆ వనం కూడా పరిమళ వనంగా మారింది. ఇక్కడి విమానం పేరు వేదామోద విమానం. చంద్రుడు శాపవిముక్తికై ఈ క్షేత్రంలోనే తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహం పొందాడు. ఈ క్షేత్రంలో అందుకే చంద్రుడు, అంబరీషుల మూర్తులు ఉంటాయి. ఈ విషయాలన్నీ దీక్షితుల వారు తన కృతిలో ప్రస్తావించారు. వివరాలు:

సాహిత్యం
========

పరిమళ రంగనాథం భజేऽహం వీరనుతం
పరిపాలిత భక్తం పుండరీకవల్లీనాథం

హరిం అంబరీష శీతాంశు వేదాది పూజితం
మురహరం భయహరం నరహరిం ధృత గిరిం
సురనర మునిజన ముదితం
పురహర గురుగుహ విదితం

సుగంధ విపినాంతరంగ శయనం రవిశశి నయనం
శుకశౌనకాది హృద్సదనం సరసిజ వదనం
ఖగరాజ తురంగం కమనీయ శుభాంగం
కనకాంబర కౌస్తుభమణి ధరం కంబు కంధరం
గగన సదృశమాబ్జకరం గజరాజ క్షేమ కరం
నగపతి సుతా సోదరం నర వరద దామోదరం

భావం
=====

వీరులచే నుతించబడేవాడు, భక్తులను పరిపాలించేవాడు, పుండరీకవల్లికి నాథుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. అంబరీషుడు, చంద్రుడు వేదములచే పూజించబడేవాడు, మురాసురుని సంహరించినవాడు, భయమును హరించేవాడు, నరసింహుడు, మందర పర్వతమును ధరించినవాడు, దేవతలు, మానవులు, మునిజనులకు ఆనందం కలిగించినవాడు, పరమశివుడు, సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడిన వాడు అయిన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. సుగంధవనము మధ్యలో శయనించేవాడు, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడు, శుకశౌనకాది మునుల హృదయములో నివసించేవాడు, కమలము వంటి ముఖము కలవాడు, గరుత్మంతుడు వాహనముగా కలవాడు, అందమైన, శుభకరమైన శరీరవయవములు కలవాడు, బంగారు వస్త్రములు, కౌస్తుభమణి ధరించే వాడు, శంఖము వంటి కంఠము కలవాడు, ఆకాశమును పోలినవాడు, గజేంద్రునికి క్షేమము కలిగించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతికి సోదరుడైనవాడు, మానవులకు వరదుడు, దామొదరుడైన పరిమళ రంగనాథుని నేను భజిస్తున్నాను. 

శ్రవణం
=======

హమీర్ కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని చారులత మణి గారు ఆలపించారు

28, డిసెంబర్ 2020, సోమవారం

రంగనాయకం భావయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సాహిత్య సంపదలో, ఆధ్యాత్మిక వైభవంలో, సంస్కృత భాషా విశేషణాలలో, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది అగ్రస్థానం. వారి ఉపాసనా బలమంతా ఈ మూడు కోణాల ద్వారా ఆయన రచనలలో అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి ఒక కృతి వారు శ్రీరంగంలోని రంగనాథునిపై రచించినది. వివరాలు:

సాహిత్యం
========

రంగనాయకం భావయేऽహం శ్రీరంగనాయకీ సమేతం శ్రీ

అంగజ తాతమనంతమతీతం అజేంద్రాద్యమరనుతం సతతం
ఉత్తుంగ విహంగ తురంగం కృపాపాంగం రమాంతరంగం శ్రీ

ప్రణవాకార దివ్య విమానం ప్రహ్లాదాది భక్తాభిమానం
గణపతి సమాన విష్వక్సేనం గజ తురగ పదాది సేనం
దినమణికులభవ రాఘవారాధనం మామక విదేహ ముక్తి సాధనం
మణిమయ శశివదనం ఫణిపతి శయనం పద్మనయనం
అగణితసుగుణగణ నతవిభీషణం ఘనతర కౌస్తుభమణి విభూషణం
గుణిజన కృత వేదపారాయణం గురుగుహ ముదిత నారాయణం శ్రీ

భావం
=====

రంగనాయకీ సమేతుడైన శ్రీరంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. మన్మథునికి తండ్రి, అనంతుడు, అన్నిటికీ అతీతుడు, బ్రహ్మేంద్రాది దేవతలచే ఎల్లప్పుడూ నుతించబడేవాడు, గరుత్మంతుని వాహనంగా ఆకాశంలో విహరించేవాడు, కృపావీక్షణములు కలవాడు, లక్ష్మీదేవి హృదయములో ఉండేవాడు అయిన శ్రీరంగనాయకుని ధ్యానిస్తున్నాను. ఓంకారమనే దివ్యవిమానంలో విహరించేవాడు, ప్రహ్లాదాది భాగవతోత్తములను ప్రీతితో అనుగ్రహించేవాడు, గణపతితో సమానమైన విష్వక్సేనునిచే పూజించబడేవాడు, గజములు, అశ్వములు, సైనికులతో కూడిన సైన్యము కలవాడు, సూర్యవంశములో జన్మంచి రాఘవునిగా కొలువబడినవాడు, దేహముక్తి పొందేందుకు నాకు సాధనమైనవాడు, మణులతో ప్రకాశించేవాడు, చంద్రుని వంటి ముఖము కలవాడు, విభీషణునిచే నుతించబడినవాడు, శ్రేష్టమైన కౌస్తుభ మణిని వక్షస్థలమున ఆభరణముగా కలవాడు, ఉత్తములైన పండితులచే వేద పారాయణ ద్వారా నుతించబడిన వాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించేవాడు, శ్రీమన్నారాయణుడైన రంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
=======

ఖరహరప్రియ జన్యమైన నాయకి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

25, డిసెంబర్ 2020, శుక్రవారం

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి

త్యాగరాజస్వామి వారు రచించిన శ్రీరంగ పంచరత్న కీర్తనలలో మరొకటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా. శ్రీరంగంలో స్వామి వైభోగాన్ని అనేక సేవలలో చూసి ఆనందించి రచించిన కృతి ఇది. 

సాహిత్యం
========

కరుణ జూడవయ్య మాయయ్య కావేటి రంగయ్య

పరమ పురుష విను మాపాలి పెన్నిధానమా
వరద నలుగురిలో వరమొసగి కరమిడి

చారడేసి కన్నులచే చెలంగు ఉభయ నా
చ్చారులతోను మరి సద్భక్తులతో యా
ళ్వారులతో నీవు వర నైవేద్యముల
నారగించు వేళల హరి త్యాగరాజుని పై

భావం
=====

మా తండ్రివైన ఓ కావేటి రంగయ్యా! నాపై కరుణతో చూడవయ్యా! మా పాలిట పెన్నిధివైన ఓ పరమ పురుషా నా మటలు ఆలకించు! ఓ వరదా! నలుగురిలో వరములు, అభయమునిచ్చి కరుణతో చూడవయ్యా! ఓ శ్రీహరీ! చారెడు కన్నులు కలిగిన శ్రీదేవి భూదేవిలతో, సద్భక్తులతో, ఆళ్వారులతో నీవు శ్రేష్టమైన నైవేద్యములు ఆరగించు వేళ త్యాగరాజునిపై కరుణతో చూడవయ్యా!

శ్రవణం
======

సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

23, డిసెంబర్ 2020, బుధవారం

ఓ రంగశాయీ యని బిలచితే - త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి శ్రీరంగ పంచరత్న కృతులలో బాగా పేరొందిన కృతి ఓ రంగశాయీ. శ్రీరంగం తీర్థయాత్ర వెళ్లి రంగనాథుని ప్రార్థించనప్పుడు ఆయన అనుగ్రహం వెంటనే కలుగనప్పుడు ప్రశ్నిస్తూ ఈ కృతిని రచించారు. వివరాలు:

సాహిత్యం
========

ఓ రంగశాయీ యని బిలచితే ఓ యని రారాదా

సారంగధరుడు జూచి కైలాసాధిపుడు గాలేదా

భూలోక వైకుంఠమిదియని నీలోనె నీవే యుప్పొంగి
శ్రీలోలుడై యుంటే మా చింత దీరే దెన్నడో
మేలోర్వ లేని జనులలో నే మిగుల నొగిలి దివ్య రూపమును ముత్యాలసరుల యురమున గన వచ్చితి త్యాగరాజ హృద్భూషణ

భావం
=====

స్వామీ! ఓ రంగశాయీ యని నిన్ను మనసారా పిలచితే ఓ యని రావచ్చు కదా! కరిచర్మం ధరించే పరమశివుడు నీ అనుగ్రహము పొందిన తరువాత కైలాసాధిపతి అయినాడు కదా! ఈ క్షేత్రము భూలోక వైకుంఠమని నీలో నీవే ఉప్పొంగి ఎల్లప్పుడూ లక్ష్మీదేవిపైనే ధ్యాస కలిగియుంటే మా చింతలు ఎప్పుడు తీరేను? నా శ్రేయస్సును ఓర్వలేని జనుల మధ్య నేను ఎంతొ నలిగి నీ దివ్యరూపమును, ముత్యాల దండలను నీ వక్షస్థలములో చూచి ఆనందించుటకు వచ్చాను. త్యాగరాజుని హృదయమునకు ఆభరణమైన స్వామీ! ఓ రంగశాయీ అని నిన్ను మనసారా పిలచితే ఓ అని రావచ్చు కదా! 

శ్రవణం
=======

కాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం అద్భుతంగా ఆలపించారు

22, డిసెంబర్ 2020, మంగళవారం

రంగ రాజు వెడలె జూతాము రారే - త్యాగరాజస్వామి వారి శ్రీరంగ పంచరత్న కృతి


త్యాగరాజస్వామి వారు శ్రీరంగ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు రంగనాథునిపై ఐదు కృతులను రచించారు. వాటిని శ్రీరంగ పంచరత్న కృతులు అంటారు. శ్రీరంగంలో జరిగే తిరునాళ్లలో స్వామిని రాజుగా అలంకరించి అశ్వంపై ఊరేగించే వైభోగాన్ని ఆయన ఒక కృతిలో వివరించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో శ్రీరంగంలో 21 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వాటిలో ఎనిమిదవ రోజున స్వామిని బంగారు అశ్వ వాహనంపై విహరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని వేడుపరి అంటారు. దీని వెనుక ఒక గాథ ఉంది మంగైమన్నన్ అనే రాజు కుముదవల్లి అనే వైష్ణవకన్యపై మనసు పడి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అతనికి విష్ణుభక్తి కలిగించాలన్న సంకల్పంతో కుముదవల్లి కొన్ని షరతులతో వివాహానికి ఒప్పుకుంటుంది. వాటిలో ముఖ్యమైనది ప్రతిరోజూ 1008 వైష్ణవులకు భోజనం పెట్టడం. ఆ షరతును నెరవేర్చటానికి మంగై మన్నన్ అనేక కష్టాలు పడతాడు. చివరకు తన వద్ద ఉన్న ధనమంతా కోల్పోయి ఒకరోజు దొంగతనానికి పాల్పడతాడు. తిరువీధులలో వధూవరుల వేషంలో వస్తున్న స్వామి, అమృతవల్లీ తాయారులను నిలువరించి వారి నగలను దోచుకుంటాడు. కానీ ఆ నగల మూటను భూమి మీద నుండి ఎత్తలేకపోతాడు. అప్పుడు స్వామి అతనిని అనుగ్రహించి తన నిజరూప దర్శనమిచ్చి అతనికి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. అప్పటి నుండి తిరుమంగై మన్నన్ తిరుమంగై ఆళ్వారుగా పిలువబడ్డాడు. ఈతనే ఆఖరి ఆళ్వారు. ఈ ఘట్టాన్ని ప్రతి ఏడు జరిగే వేడుపరి ఉత్సవాలలో ఆవిష్కరిస్తారు. స్వామిని బంగారు అశ్వంపై చిత్రవీధిలో వేగంగా అశ్వధాటి రీతి ఊపుతారు. శ్రీరంగనాథుడు ఈ ఉత్సవాలలో రంగరాజుగా కొలువబడతాడు. దీనినే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా ఆవిష్కరించారు. వివరాలు:

సాహిత్యం
=======

రాజు వెడలె జూతాము రారే కస్తురి రంగ 

తేజినెక్కి సామంతరాజులూడిగము సేయ
తేజరిల్లు నవరత్నపు దివ్య భూషణములిడి రంగ

కావేరీ తీరమునను పావనమగు రంగపురిని
శ్రీ వెలయు చిత్ర వీధిలో వేడ్కగ రాగ
సేవను గని సురలు విరులచే ప్రేమను పూజించగ
భావించి త్యాగరాజు పాడగ వైభోగ రంగ

భావం
=====

రాజైన కస్తూరి రంగడు శ్రీరంగపుర వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. మేలుజాతి అశ్వమునెక్కి, సామంతరాజులు సేవలు చేయుచుండగా నవరత్నాలతో పొదిగిన దివ్యమైన ఆభరణములు ధరించి ప్రకాశిస్తున్న రంగనాథుడు శ్రీరంగ వీధులలో విహరిస్తున్నాడు చూద్దాము రండి. కావేరీ తీరములో పావనమైన శ్రీరంగ క్షేత్రంలో సిరులొలికే చిత్ర వీధులలో స్వామి వేడుకగా రాగా, ఆ సేవను కనులారా జూచి దేవతలు పుష్పములతో భక్తితో పూజించగా, ఆ అద్భుతమైన దృశ్యమును చూచి త్యాగరాజు వైభోగ రంగ అని పాడుచున్నాడు, స్వామిని చూద్దాము రండి. 

శ్రవణం
======

దేశిక తోడి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు

18, డిసెంబర్ 2020, శుక్రవారం

సింగరామూరితివి చిత్తజు గురుడవు - అన్నమాచార్యుల వారి కృతి

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునికి తిరుమలలో నిత్యకల్యాణముతో పాటు అనేక అద్భుతమైన సేవలు. వాటిలో కొన్ని ఏడాదికి ఒకమారు నిర్వహిస్తారు. అటువంటి సేవ ఒకటి తెప్పోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సమయంలో ఐదు రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా స్వామి పుష్కరిణిలో నిర్వహిస్తారు. మొదటిరోజు సీతారామలక్ష్మణులు, రెండవరోజు రుక్మిణీకృష్ణులు, మిగిలిన మూడు రోజులు శ్రీదేవి-భూదేవి సమేతుడైన మలయప్ప మూర్తులను పుష్కరిణిలో విహరింపజేస్తారు. అన్నమాచార్యుల వారు తమ కృతులలో స్వామికి జరిగే అనేక సేవలను, ఉత్సవాలను ప్రస్తావించటమే కాదు మనోజ్ఞంగా వర్ణించారు. ఈ వార్షిక తెప్పోత్సవంపై కూడా సద్గురువులు అద్భుతమైన కృతిని రచించారు. వివరాలు: 

సాహిత్యం
========

సింగారమూరితివి చిత్తజు గురుడవు సంగతి జూచేరు మిము సాసముఖ

పూవుల తెప్పలమీద పొలతులు నీవునెక్కి పూవులు ఆకసము మోప పూచిచల్లుచు
దేవదుందుభులు మ్రోయ దేవతలు కొలువగా సావధానమగు నీకు సాసముఖ

అంగరంగవైభవాల అమరకామినులాడ నింగినుండి దేవతలు నినుజూడగా
సంగీత తాళవాద్య చతురతలు మెరయ సంగడిదేలేటి నీకు సాసముఖ

పరగ కోనేటిలోన పసిడి మేడనుండి అరిది యిందిరయు నీవు ఆరగించి
గరిమ శ్రీవేంకటేశ కన్నుల పండువకాగ సరవి నోలాడు సాసముఖ

భావం
=====

ఓ వేంకటేశా! నీవు శృంగారమూర్తివి, మన్మథుని తండ్రివి! మీ సన్నిధిలో అందరూ మిమ్ములను చక్కగా చూచుచున్నారు. పూవులతో అలంకరించబడిన తెప్పల మీద నీవు శ్రీదేవి భూదేవిలతో కూడి యుండగా, పూవులు ఆకాశములో మొలచాయా అన్నట్లుగా మీపైన చల్లబడుతున్నాయి, దేవదుందుభులు మ్రోగుచుండగా దేవతలు మిమ్ములను కొలుచుచుండగా మీ సన్నిధినయున్నవారికి సావధానముగా నున్నది! అంగరంగవైభవముగా దేవకాంతలు నృత్యము చేయుచుండగా దేవతలు మిమ్ము చూచుచుండగా, సంగీత తాళవాద్యములు నైపుణ్యముగా మెరయుచుండగా తెప్పలలో విహరించుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి కన్నులపండువగానున్నది. ఆరగింపులను సేవించి ఎంతో ఒప్పుగా పుష్కరిణియందు బంగారు తెప్పలో శ్రేష్ఠులైన మీరు, అపురూపమైన లక్ష్మీదేవి ఓలలాడుచున్న దృశ్యము మీ సన్నిధినయున్నవారికి ఎంతో కన్నులపండువగా నున్నది. 

శ్రవణం
======

ఖమాస్ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు ఆలపించారు.

14, డిసెంబర్ 2020, సోమవారం

పార్వతీపతిం ప్రణౌమి సతతం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

హంసధ్వని రాగాన్ని సృష్టించింది ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి అయిన రామస్వామి దీక్షితుల వారు. వీరు 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజులు అమరసింహ భోసలే, తులజాజీ భోసలలే కొలువులలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు. వీరు 108 రాగాలతో చేసిన రాగమాలిక అత్యంత ఎక్కువ నిడివి కలిగిన రాగమాలికగా ఇప్పటికీ ప్రసిద్ధం. తండ్రిపై గౌరవంతో దీక్షితులవారు వాతాపి గణపతిం భజేऽహం అనే కృతిని ఈ రాగంలో స్వరపరచారు. ఆయన ఈ రాగంలో స్వరపరచిన మరొక కృతి పార్వతీపతిం ప్రణౌమి సతతం. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీపతిం ప్రణౌమి సతతం ఆశ్రితజన మందారం శశిధరం

పర్వత రాజ నుత పదాంబుజం భద్ర ప్రద కైలాస విరాజం
గర్విత త్రిపురాది హర చతురం గురుగుహ వందిత శివ శంకరం

భావం
=====

ఆశ్రితజనులకు కల్పవృక్షము వంటి వాడు, చంద్రుని ధరించినవాడు, పార్వతీదేవికి పతియైన పరమశివునికి నేను ఎల్లప్పుడు నమస్కరించుచున్నాను. పర్వతరాజైన హిమవంతునిచే నుతించబడిన పదకమలములు కలవాడు, శుభఫలములను ప్రసాదిస్తూ కైలాస పర్వతముపై విరాజిల్లేవాడు, గర్వితులైన త్రిపురాసురులు మొదలైన రాక్షసులను సంహరించిన నిపుణుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడిన శివునికి, శంకరునికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను. 

శ్రవణం
======

ప్రఖ్యాత కర్నాటక శాస్త్రీయ సంగీత విద్వాంసులు సంగీత కళానిధి, పద్మభూషణ్ గుర్తింపులను పొందిన శ్రీ త్రిచూర్ రామచంద్రన్ గారు ఈ క్ర్తిని ఆలపించారు

13, డిసెంబర్ 2020, ఆదివారం

ఇక్ష్వాకుకులతిలక ఇకనైన పలుకవే - రామదాసు కృతి


తానీషా సైనికులు రామదాసును ఎంతటి శారీరిక హింసకు గురి చేయకపోతే ఆ వాగ్గేయకారుడు శ్రీరామచంద్రుని నిందించే భావనలను వ్యక్తపరస్తాడు? భక్తిమార్గంలో ఎంతటి అచంచల విశ్వాసమున్నా, భగవంతుడు పెట్టే పరీక్షలు తట్టుకోవటం చాలా కష్టం. అందులోనూ కారాగార వాసంలో శిక్ష తట్టుకోవటం మరింత కష్టం. పరమ భక్తాగ్రేసరుడైన రామదాసు కూడా ఆ సైనికుల దెబ్బలను తట్టుకోలేకపోయాడు, అందుకే ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే అని విలపిస్తూ, నిందిస్తూ, రాముని వేడుకున్నాడు. సీతారామ భరతలక్ష్మణ శత్రుఘ్నులకు ఆభరణాలు, భద్రాద్రి దేవాలయ ప్రాకారానికి, గోపురానికి, మంటపాలకు ఖర్చులు ప్రస్తావిస్తూ అవన్నీ స్వామికే కదా? అవేమైనా దశరథుడు, జనకుడు చేయించారా అని నిష్ఠూరంగా పలుకుతాడు రామదాసు.  ఎవరబ్బ సొమ్మనికి కులుకుతూ తిరుగుతున్నావు అని నిందిస్తాడు. అంతలో తన తప్పు గ్రహించి నిందించినందుకు ఆగ్రహించవద్దు, దెబ్బలకు ఓర్వలేక తిట్టానని చెప్పుకుంటాడు. భక్తులనందరినీ కాపాడే శ్రీరాముని తనను కూడా కాపాడమని చివరకు వేడుకుంటాడు. ఇప్పటికీ గోల్కోండ కోటకు వెళితే రామదాసును బందీ చేసిన జైలును చూస్తే ఆయన ఎంతటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడవచ్చు. తరువాత రామలక్ష్మణుల అనుగ్రహము, రామదాసు ముక్తి మనకు తెలిసిందే. ప్రతి వాగ్గేయకారుని జీవితంలో కూడా పరమాత్మ అనుగ్రహాన్ని చాటే ఇటువంటి ఘటనలు, అద్భుతాలు ఎన్నో. 

ఇక్కడ కొన్ని సాంకేతిక వివరాలు: మొహరీ అంటే ఒక తులము ఎత్తు బంగారము (30 చిన్నములు అనగా నాలుగు గురిగింజల ఎత్తు). వరహా అనగా 3.4 గ్రాముల బంగారము. 

ఆధ్యాత్మిక సందేశంగా ఈ కృతిని తీసుకుంటే జనన మరణాల మధ్య జీవాత్మ పడే నరకయాతనలన్నీ కూడా పరమాత్మ సృష్టి స్థితి లయములలో భాగమే. ఆ పరమాత్మను చేరుకోవటం కోసమే ఇవన్నీ కూడా. కర్మలు, వాటి ఫలాల నుండి రక్షించి తనకు ముక్తిని ప్రసాదించమని జీవాత్మ చేసే అనేక భావనలతో కూడిన ప్రార్థనగా దీన్ని భావించవచ్చు. సమస్తమూ పరమాత్మకు సమర్పించినపుడు ఆ పరంజ్యోతిలో ఏకమయ్యే దారి కనిపించక జీవాత్మ పడే యాతనకు ఈ కృతి ప్రతిబింబం. 

సాహిత్యం
========

ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర

చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్ర
నను క్రొత్తగ చూడక ఇద్దరి బ్రోవుము రామచంద్ర

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర

నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహారాజు పంపెనా రామచంద్ర

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

భావం
=====

ఇక్ష్వాకువంశ తిలకుడవైన శ్రీరామచంద్రా! ఇకనైన పలుకుము. నన్ను నువు రక్షించకుంటే వేరెవరు రక్షించెదరు? ఈ దేవాలయము చుట్టూ ప్రాకారము ఎంతో అందంగా కట్టించాను, ఆ ప్రాకారానికి పదివేల వరహాలు పట్టాయి. ఇకనైన పలికి నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! దేవాలయానికి గోపురము, మంటపాలు స్థిరముగా కట్టించాను, ఇవన్నీ నీకు తెలియవా? నన్ను క్రొత్తగా చూడకుండా ఈ చెరసాలలో ఉన్న నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ ప్రియసోదరుడైన భరతునికి పచ్చల పతకము చేయించాను, దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీ కనిష్ఠ సోదరుడైన శత్రుఘ్నునికి బంగారు మొలత్రాడు చేయించాను, దానికి పదివేల మొహరీలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! లక్ష్మణునికి ముత్యాల పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! సీతమ్మకు చింతాకు పతకము చేయించాను. దానికి పదివేల వరహాలు పట్టాయి. మరి ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నీకోసం అందమైన శిరోభూషణము చేయించాను. ఎవడబ్బ సొమ్మని వాటిని పెట్టుకుని కులుకుతూ తిరుగుతున్నావు! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. ఈ ఆభరణాలు మీ నాన్న గారు దశరథ మహారాజు చేయించారా లేక మామగారు జనకమహారాజు కానుకగా పంపించారా! ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. శ్రీరామచంద్రా! నేను ఈ విధంగా దూషిస్తున్నానని కోపగించుకోవద్దు. ఈ తానీష సైనికులు కొట్టే దెబ్బలను భరించలేక అలా చేస్తున్నాను. ఈ శిక్ష నాకు ఎందుకు! నన్ను రక్షించుము. భక్తులను పరిపాలించే ఓ శ్రీరామచంద్రా! నువ్వు శుభముగా నన్ను రక్షించుము. 

శ్రవణం
======

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, డిసెంబర్ 2020, శనివారం

శర శర సమరైక శూర - త్యాగరాజస్వామి కృతి


రాముని శౌర్యాన్ని, ధీరత్వాన్ని వర్ణించే త్యాగరాజస్వామి కృతులు ఎన్నో. రామాయణంలో విశ్వామిత్ర యాగరక్షణ మొదలు రావణ సంహారం వరకు ఎన్నో ఘట్టలను త్యాగరాజస్వామి తన కృతులలో సవివరంగా రాగయుక్తంగా పలికారు. సీతమ్మ కోసం రాముడు కడలిని దాటే సమయంలో సముద్రుని నిలువరించిన ఘట్టం ప్రస్తావన కూడా అనేక కృతులలో చేశారు. నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా రామా అని క్షీర సాగర శయన అనే కృతిలో అద్భుతంగా వర్ణించారు. నిజంగా రాముని శౌర్యం తెలుసుకోవాలంటే అరణ్యకాండలోని ఖరదూషణ వధ ఘట్టం, యుద్ధకాండలో రావణాదులపై చేసిన ప్రహార వివరాలు శ్రీమద్వాల్మీకి రామాయణం పఠించాలి. వాటి సారాంశాన్ని త్యాగరాజస్వామి అనేక కృతుల ద్వారా ఆవిష్కరించారు. రాముని శౌర్యం వెనుక ఉన్న మర్మం కూడా తెలిపారు. అటువంటి ప్రస్తావనే ఈ శర శర సమరైక శూర అన్న కృతిలో కూడా చేశారు. వివరాలు:

సాహిత్యం
=======

శర శర సమరైక శూర శరధి మద విదార!

సురరిపు మూల బలమనుతూల గిరులకనల సమమౌ శ్రీరామ

తొలిజేసిన పాపవనకుఠారమా కలనైనను సేయగలేని బలు
విలును విరచి వెలసిన శ్రీరఘుకులవర బ్రోవుము త్యాగరాజనుత!

భావం
====

ఒక్కొక్క బాణముచేత సాటిలేని యుద్ధ శౌర్యమును చూపిన, సముద్రుని గర్వమణచిన శ్రీరామా! దూది పర్వతముల వంటి రావణుని మూలబలమునకు అగ్నితుల్యమైన శ్రీరామా! అనేక జన్మముల పాపములనే అరణ్యములకు గొడ్డలిపెట్టువంటి శ్రీరామా! రాజాధిరాజులు కలలో కూడా ఊహించని రీతి శివధనుస్సును విరిచిన రఘుకులతిలకుడైన శ్రీరామా! పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నన్ను బ్రోవుము. 

శ్రవణం
=====

కుంతలవరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

11, డిసెంబర్ 2020, శుక్రవారం

ప్యారే దర్శన్ దీజో ఆయ్ - ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన మీరా భజన


మీరా భజనలు అనగానే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు గుర్తుకు వస్తారు. కారణం, ఆవిడ భక్తిలోని ఔన్నత్యం,  ఆవిడ ఆలపించిన ప్రతి భజనలోనూ అది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మీరాలో ఉన్న మధురభక్తిని తన గాత్రంలో రంగరించి సుబ్బులక్ష్మి గారు ఈ భజనలు పాడారు. అటువంటి భజన ఒకటి ప్యారే దర్శన్ దీజో ఆయ్. మధురభక్తిలో మీరాకు సర్వసం శ్రీకృష్ణుడే. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కూడా ముమ్మాటికీ మీరా వంటి భక్తురాలే. ఆ భావన ఆమె నడవడికలో, గాత్రధర్మంలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అందుకే ఎమ్మెస్ నటించిన మీరా (1945) చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధించింది. 

సాహిత్యం
=======

ప్యారే దర్శన్ దీజో ఆయ్
తుమ్ బిన్ రహ్యయో న జాయ్
జల బిన కమల చంద్ర బిన రజనీ ఐసే తుం దేఖ్యా బిన సజనీ
ఆకుల వ్యాకుల ఫిరూ రైన దిన బిరహ కలేజా ఖాయ్
దివస న భూక్ నీంద్ నహి రైనా ముఖ కే కథన్ న ఆవే బైనా
కహా కరూ కుచ్ కహత్ న ఆవై మిల్ కర్ తపత్ బుఝాయ్
క్యో తరసావో అంతర్యామీ ఆన్ మిలో కృపా కరో స్వామీ
మీరా దాసీ జనమ్ జనమ్ కీ పడీ తుమ్హారీ పాయ్

భావం
=====

ప్రియ కృష్ణా! నీవు లేకుండా నేను జీవించలేను, దర్శనమీయ వేగంగా రా స్వామీ! నీటిని వీడి కమలము, చంద్రుని విడచి రాత్రి ఉండలేనట్లు నిన్ను చూడకుండా ఈ సఖి ఉండలేదు. నీ దర్శనము కోసం విరహముతో పగలు రాత్రి మనసు చెదరి, కలతతో తిరుగుతున్నాను, ఆ విరహము నా హృదయాన్ని తొలచివేస్తున్నది. పగలు ఆకలి లేదు, రాత్రి నిద్ర రావటం లేదు, మాటలు మాట్లాడదామన్నా నోరు పెగలటం లేదు. నువ్వు అంతర్యామివి కదా! నన్ను ఎందుకు తపింపజేస్తున్నావు. వేగంగా వచ్చి నాపై కరుణించు. జన్మజన్మల నుండి ఈ మీరా నీ దాసి, నీ చరణాలపై వ్రాలి ప్రార్థిస్తోంది, దర్శనమీయ వేగంగా రా స్వామీ!

దృశ్య శ్రవణం
===========

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించిన ఈ భజనను వీడియోలో వీక్షించండి