26, మే 2010, బుధవారం

సమాజంలో ఎందుకు సంక్షోభం?

ఈ వ్యాసం ఎవ్వరిని ఉద్దేశించింది కాదు. అన్యథా భావించక నా అభిప్రాయంగా మాత్రమే చదవండి.

  • మేము పెంచినప్పుడు ఇంత కష్టం పడలేదమ్మా, ఏదో ఇంత చద్ది అన్నం, ఆవకాయ ముక్క, కాస్త నెయ్యో, నూనో కంచంలో పడేస్తే పిల్లలు అమృతంలా తినే వాళ్ళు. ఒక్క రోజు కూడా  ఇలా అడిగింది వండి, బతిమిలాడి గంటలు గంటలు పెట్టలేదండి. ఇలా అయితే మేము ఏమి పెంచే వాళ్లం పిల్లల్ని?.....
  • ఇదెక్కడి కాలమో, ఇంటికి తాళం పెట్టి వెళ్లేటట్టు లేదు. దోచుకు పోతున్నారు...మన సొమ్మే మనకు ప్రాణసంకటంగా అయ్యింది.....
  • మా చిన్నప్పుడు హైదరాబాద్ లో 24 గంటలు పంపు నీళ్ళు, ఇప్పుడు వారానికి ఒక్కసారి......
  • ఏమి ఎండలు బాబోయ్ ఇంత ఎండలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు..... 
  • ఇదెక్కడి వరదలు, శ్రీశైలం ఆనకట్ట మీదినుంచి కృష్ణమ్మ ఉగ్ర రూపం. .....
  • మా వాడికి రక్తపోటు, చక్కర ఉన్నాయి. ౩౦ ఏళ్లకే ఏంటి ఈ నరకం?........
  • పాపం విజయవాడలో వైష్ణవి అనే పాపని ఎంత దారుణంగా చంపాడండి మేనమామ. ఎంత అన్యాయం?......

ఇలా ఎన్నో సంభాషణలు ఈ సమాజం లో ఈరోజు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరి తప్పు ఉంది?. ఎవరి యుగ ధర్మం, కాల ధర్మం ప్రకారం, ఎవరి అవసరం, శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేస్తున్నారు.ఇక్కడ అవసరం అనేది చాల బలమైన కారణం అన్ని అనర్థాలకి. అవసరాన్ని ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో పొందటం ఇప్పటి యుగ లక్షణం. కానీ, మనం చేయ్యాల్సింది కూడా ఉంది కదా?.  కారణాలు వెతికితే ఇవి కనిపించాయి నాకు:

1 . పూర్వ కాలంలో వనరులు, వసతులు, ఆలోచనా పరిధి అన్ని తక్కువగా ఉండేవి. ప్రచార మాధ్యమాలు, పోలికలు, ఆశలు,  ఆశయాలు తక్కువ ఉండేవి పెంచే తల్లికి, పిల్లకు. ఇప్పుడు పుట్టకముందు నుంచే ప్రణాళిక, పొదుపు, మనం అందరికన్నా బాగుందాలన్న దురాశ ఎక్కువయ్యాయి. అప్పుడూ ఉన్నారు కాని ఇప్పటి అంత కాదు. నాలుగేళ్ల వయసులో నాకు ఇప్పుడు నా  కొడుకుకి ఉన్నన్ని ప్రశ్నలు, ఆలోచనలు, ఏడుపులు, పెడబొబ్బలు లేవు అని మా అమ్మ చెప్తుంది. కొంత కన్నప్రేమ తీసేసినా, చాల నిజం ఉంది అందులో. ఆలోచనా పరిధి మనం ఇచ్చే అవకాశాలు, మాధ్యమాలు బట్టి ఉంటుంది.

2 . ఆ కాలంలో ఉన్నది పంచుకునే మనస్తత్వాలు, వ్యవస్థ ఉండేవి.  మనం ఇస్తే మనకు వస్తుంది అన్న ఆలోచనా పధ్ధతి ఉండేది. ఇప్పుడు మనది మనకే, ఇంకొకళ్ళకి వివరం, విలువ తెలియ కూడదు, మనకు ఉన్నది అర్బుదాలు నిర్బుదాలుగా పెరగాలి. పక్కవాడి గురించి మనకు అనవసరం. మా అమ్మాయికి ప్రతి సంవత్సరం చాల డాబుగా పుట్టినరోజు పండగ కావాలి. అది మేము అలవాటు చేసిందేగా?.

3. వాతావరణం, ఆహారం, జీవిత నియమాలు పూర్తిగా కల్తి అయిపోయ్యాయి. పసుపు, మంచి నీళ్ళ దగ్గరనుంచి ప్రాణాల్ని కాపాడే మందుల దాక అన్నీ కల్తీయే. వీటి వల్ల మనుషుల ఆలోచనలు, శారీరిక బాధలు, రోగాలు, మానసిక బాధలు పెరిగాయి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వలన మానవుడి ఆయుష్షు అయితే పెరిగింది కాని సుగుణ జీవనం కనిపించటం లేదు. కార్బైడ్ వేసి పండించని మామిడి పండు ఎంత ఖరీదో, ఎంత అరుదో మీ అందరికి తెలుసు. ఎంత మంది పొట్టకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో మీకు తెలుసు. వాళ్ళు అందరు యుక్తవయస్కులే...

4 . చాలామటుకు మన పూర్వికులు అనుసరించిన పద్ధతులు, సంప్రదాయం, ఆధ్యాత్మిక మార్గం వదిలేసి కొత్త వృత్తులు, కొత్త నగరాలూ, కొత్త ఆచారాలు, కొత్త వ్యవహారాలు నిర్మించి ఆచరిస్తున్నాము. ఏమి చెయ్యక్కర్లేదండి, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మీరు ఏమి చేస్తున్నారో ఆలోచించండి - అదే పధ్ధతి, సంప్రదాయం.

ఇక్కడ ఏది తప్పు, ఏది ఒప్పు అని తీర్పు చెప్పటం సరియైనది కాదు, లక్ష్యం కూడా కాదు. ఏమి చేస్తే మనకు ఒక మంచి ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుంది అనేది ముఖ్యం. ఇంకొంచెం శోధిస్తే, ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. వాటి సారాంశమే ఈ క్రింది సమాధానాలు.

1 . ప్రకృతికి విరుద్ధంగా ఏది చేసినా దాని వల్ల కొన్ని తరాల పాటు మనకి శిక్ష తప్పదు. ఆ శిక్షే మనము అనుభవిస్తున్న బాధలు - అకాల వర్షాలు, విపరీతమైన ఎండలు, సునామీలు, భూకంపాలు., క్షామము. కొన్ని దశాబ్దాలు పారిశ్రామిక విప్లవం పేరిట వృక్ష సంపదను నాశనం చేసుకున్నాం మనం. వనరులను దుర్వినియోగం చేశాం. వనాలు, అడవులు, సెలయేళ్ళు, నదీ నాదాలు అంతరించి లేదా పూర్తిగా విషపూరితమైపోయే స్థితికి తీసుకొచ్చింది మనమే. దీన్ని మార్చటం చాల తేలిక. ఇది చాల ముఖ్యమైనది ఎందుకంటే ఎక్కడైతే ప్రాకృతిక వనరులు పుష్కలంగా ఉంటాయో అక్కడ మానవజాతి వికాసం చెందుతుంది. మీరు ఏమి చెయ్యాలో కూడా మీకు తెలుసు. కాబట్టి వెంటనే మీ వంతు మీరు చెయ్యండి. ప్రకృతికి ఒక సమతుల్యం ఉంది. దాన్ని కదిలించి, మార్చి, మసి పూసే హక్కు మనకు లేదు.

2 . మన స్వధర్మాన్ని కాలానుగుణంగా మార్చుకోవటం తప్పు కాదు కాని పూర్తిగా స్వధర్మాన్నే మర్చిపోవటం వల్ల మన పీఠం కదిలి ఆలోచనలు, శరీరంలో, సమాజంలో ఊహించలేని మార్పులు వస్తాయి. అదే ఇప్పుడు జరుగుతున్నది - రోగాలు, వ్యక్తిగత, సామాజిక అంతర్యుద్ధాలు, కలహాలు, హత్యలు, మానభంగాలు....అందుకని మీ స్వధర్మమేదో తెలుసుకొని దాన్ని కొంత వరకైనా ఆచరించండి.

3 . ఇవ్వండి-పొందండి: ఈ మూలసిద్దాంతాన్ని మళ్లీ మీ ఆలోచనలలోకి రానివ్వండి; ఆ ఆలోచనను పెంపొందించండి, నలుగురికి చెప్పండి. మీరు ఇస్తే, మీకు పదింతలు వస్తుంది. అదే రూపంలో కాక పోవచ్చు, ఇంకొక రూపంలో, మీకు తెలియకుండా. దీన్ని నమ్మి ఆచరించకపోతే ఇంకా విపత్కర పరిణామాలకు సిద్ధంకండి.

4  సులువైన, నిరాడంబరమైన జీవితానికి మార్గం మీకు తెలుసు, దాన్ని మీ మనసాక్షిగా ఎంచుకుని, కష్టమైనా దానికి కట్టుబడి జీవించండి. మీరు అనుకున్న ఆనందం, తృప్తి, సామాజిక సంతులన తప్పకుండ కనిపిస్తాయి.

మార్పు అనేది మానవ జీవితానికి అతి సహజం మరియు కావాలి కూడా. లేకపోతే అందులో పస ఉండదు. అందుకని తప్పు/ఒప్పుల్ని ఎంచకుండా కొంత మీ పూర్వీకుల మార్గాన్ని మీ ప్రస్తుత జీవనశైలికి ఆపాదించుకుంటే మంచిది. ఎందుకు పూర్వీకుల మార్గం అంటున్నాను అంటే  - అది కాలచక్రంలో ఎన్నో ఆటుపోటులకు నిలిచి ఎందరో మహానుభావులనోట మనకు గేయ, కావ్య, గ్రంథ రూపాలలో చెప్పబడింది. దానిని మనం కొత్తగా నిరుపించాల్సిన అవసరం లేదు, ఆగత్యం లేదు. మనం ఏది కొత్తగా కనిపెట్టిన అది కొన్ని తరాల పాటు పరిశోధించబడి, విమర్శించబడి, రూపాంతరం చెందితే తప్ప ఒక ప్రామాణికం కాదు. అంత అవసరం ఉందా అని ఒక్క సారి ఆలోచించండి.

"అవసరం" అనేదానికి అంతులేదు.  అవసరం మనచేత ఎంతటి దుర్మార్గమైన చేయిస్తుంది. అందుకని అవసరాలని ఎలా నియంత్రించాలో ఆలోచించండి.

నేను ఈ వ్యాసంలో ఎక్కడ డబ్బు గురించి కాని, విదేశీ/స్వదేశీ నివాసం గురించి కాని, మూఢ ఆచారాల గురించి కాని ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మాట్లాడలేదు, అది నా ఉద్దేశం కూడా కాదు. మీకు ఏది కావాలో అది మీ చేతుల్లో ఉంది అనేదే నా ఏక వాక్య తీర్మానం.

1 కామెంట్‌: