30, జూన్ 2010, బుధవారం

పంచ భూత లింగాలు

పంచభూతలింగాలు - (పృథివిః + ఆపః + తేజః + వాయుః + ఆకాశః ) పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్మకాలైన ఐదు లింగాలు దక్షినాదిన తమిళాంధ్ర సీమల్లో వెలసియున్నాయి:

౧. పృథివీలింగం - కంచిలో కామాక్షితో కొలువైయున్న ఏకామ్రేశ్వరుడు. (ఈ కాంచీపురంలో ఇంకా చూడవలసినవి ఎన్నో - వైష్ణవ క్షేత్రమైన వరదరాజ పెరుమాళ్ ఆలయము, కంచిపీఠం మొదలైనవి).  ఏకామ్రేశ్వరుని హృదయేశ్వరియై మూక కావిని అనుగ్రహించి అతనిచే మూక పంచశతి కావ్యాన్ని రచింపజేసిన ఆ శక్తి పీఠ వాసిని కామాక్షమ్మ తల్లి. కంజదళాయతాక్షి కామాక్షి కమలామనోహరి త్రిపురసుందరి అని ముత్తుస్వామి దీక్షితులు స్తుతించిన ఆ తల్లి ఈ క్షేత్రంలో విరాజిల్లుతోంది.
౨. జలలింగం - జంబుకేశ్వరంలో (తిరుచిరాపల్లి) అఖిలాండేశ్వరితో అలరారుతున్న జంబుకేశ్వరుడు. (విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన శ్రీరంగం ఇక్కడికి చాలా దగ్గర).
౩. తేజోలింగం - అరుణాచలంలో (తిరువణ్ణామలై) ఉణ్ణమలైదేవితో కలిసి ఊయలలూగే అరుణాచలేశ్వరుడు. (ఇక్కడ గిరి పరిక్రమణ, భగవాన్ రమణమహర్షి ఆశ్రమం - చాలా సమయం గడపొచ్చు).
౪. వాయులింగం - శ్రీకాళహస్తిలో ఙ్ఞానప్రసూనాంబతో వేంచేసియున్న శ్రీకాళహస్తీశ్వరుడు. (మన ఏడుకొండలవాడికి కేక వేసేంత దూరంలో ఉన్నాడీ పరమశివుడు).
౫. ఆకాశలింగం - చిదంబరంలో శివకామసుందరితో నాట్యం చేస్తున్న నటరాజస్వామి. (చిదంబరం, వైదీశ్వరన్ కోయిల్, కుంభకోణం, తంజావూరు - ఇవన్నీ ఒక ౭౦-౮౦ కిలోమీటర్ల పరివృతంలో కొన్ని వందల పురాతాన దివ్య శైవ, వైష్ణవ, నవగ్రహ, సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి).

ఈ ఐదు క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి. అత్యద్భుత శిల్పకళాసౌందర్యంతో విశాలమైన గోపురాలు, ప్రాంగణాలు - అబ్బో చెప్పనలవి కాని చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక పుణ్యధామాలు. మీకు సమయమున్నప్పుడు తప్పకుండా చూడవలసిన దివ్య క్షేత్రాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి