20, జులై 2010, మంగళవారం

అంతర్వేది


ఎక్కడ, ఎలా?

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం.  లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది.  హైదరాబాద్ నుంచి నరసాపురంకి ప్రతిరోజూ రైలు ఉంది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ లో ఎక్కి ఉదయం 9 గంటలకు నరసాపురంలో దిగ వచ్చు.

విశేషాలు: 



వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ స్థానంలో ఈ నారసింహ క్షేత్రం ఉంది. ఈ  సాగర సంగమం లో నది, సముద్రము నీటి మధ్య తేడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అన్నా చెల్లెళ్ళ గట్టు అని అంటారు. సాగర కెరటాలు, నదిలో వరదలు లేనప్పుడు ఇక్కడ సంగమ స్నానం చేస్తే చాలా పుణ్యం. క్షీర సాగర మథనం, కూర్మావతారం, దేవ దానవుల మధ్య అమృతం కోసం పోరాటం ఈ ప్రాంతాల్లో జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న క్షేత్రంలో నరసింహస్వామి రాజ్యలక్ష్మీ సమేతుడై ఉన్నాడు.



అంతర్వేది చాలా చిన్న ఊరు. మొత్తం కలిపి వంద ఇళ్ళు కూడా ఉండవు. ఊరిలో ప్రవేశించగానే ఒక పురాతన శిథిలావస్థలో ఉన్న మంటపం కనిపిస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళితే దేవస్థానం విశాలమైన ప్రాంగణంలో ఉంది. పచ్చని చెట్లు, గాలి గోపురం, శిలా శాసనం కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఈశాన్య దిశలో క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వరుడి ఆలయం ఉంది. సాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని కంఠంలో నిలిపిన ఈశ్వరుడికోసం నిర్మించిన దేవస్థానం. నరసింహస్వామి దేవస్థానానికి తూర్పు ఆగ్నేయ దిశలో రేవు ఉంది. ఇక్కడ గోదావరి నదీ స్నానం చెయ్యవచ్చు. నౌక విహారం చెయ్యటానికి చిన్న, పెద్ద పడవలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతర్వేదిలో గుడికి 2 కిలోమీటర్ల దూరంలో బీచ్, లైట్ హౌస్, ఓ. ఎన్. జీ. సి వారి డ్రిల్లింగ్ స్టేషన్ ఉన్నాయి.

పూజలు, సేవలు, వసతులు:

దేవస్థానం కార్యాలయంలో అర్చన, అభిషేకం కోసం టికెట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. వచ్చే అక్టోబర్ నుంచి నిత్యం సుదర్శన హోమం జరిపే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఆలయ అధికారులు. పురాతన ప్రాకారాలు, స్థంభాలు, విశాలమైన ప్రాంగణం ఈ క్షేత్రం యొక్క విశిష్టత.  మొగల్తూరు రాజాలు, జమీందార్లు చక్కగా నిర్వహించినట్లుగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆగమ సాంప్రదాయంలో స్వామి వారికి సేవలు, పూజలు జరుగుతాయి.

గర్భగుడిలో మనోహరమైన లక్ష్మీ నరసింహుడి దివ్య మంగళ విగ్రహము శోభాయమానంగా ఉంటుంది. అభిషేకం సమయంలో స్వామి వారి నిజరూప సందర్సనం చేసుకోవచు. మూల విరాట్టే కాక ఉత్సవ విగ్రహ రూపంలో లక్ష్మి, నృసింహులు,  సుదర్శనుడు గర్భగుడిలో కనిపిస్తారు. తులసి, రకరకాల సుగంధ పుష్పాలతో ఇక్కడ స్వామి వారికి అలంకారం.  స్థల పురాణం, క్షేత్ర మహిమ తెలిపే పుస్తకాలు దేవస్థానం వాళ్లు విక్రయిస్తున్నారు.  ఇక్కడ నిత్యాన్నదాన పథకం ఉంది. శుభ్రమైన పరిసరాల్లో శుచి, రుచి కలిగిన ఆహారాన్ని గర్భగుడి వెనకగల భోజన శాలలో 12 నుంచి 2 గంటల వరకు ఉచిత భోజన వసతిని దేవస్థానం వాళ్లు భక్తి, శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నారు. దర్శన సమయంలో భోజనానికి టికెట్ తీసుకొని హాయిగా స్వామి వారి ప్రసాదంగా భోజనం చెయ్య వచ్చు.

అన్నాచెల్లెలు గట్టు:

వశిష్ఠ  గోదావరి బంగాళాఖాతంలో కలిసే స్థానాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం  అంటారు. ఇది అన్నాచెల్లెలు గట్టుగా  పేరొందింది. ఇక్కడి నీరు తీయగా ఉండటం విశేషం.

ఇతర ఆకర్షణలు:



దేవస్థానానికి తూర్పు దిక్కుగా ఒక రాజు గారు ఈ మధ్య వశిష్ఠ మహర్షి పేరిట దేవాలయం కట్టారు. ఈ ఆలయం చాలా బాగుంది. ఆ ఆలయం వృత్తాకారంలో ఉంది. ఆలయం చుట్టూ ఒక నీటి వలయం ఉంది. ఆలయంలో పై అంతస్తులో సప్తర్షుల విగ్రహాలు ప్రతిష్ఠించారు రాజు గారు. ఈ ఆలయ ప్రాంతంలో వశిష్ఠ, వ్యాస మహా మునులు తిరిగినట్లుగా రాజు గారికి నిదర్శనం కలిగి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అక్కడ రాసి ఉంది. కింది అంతస్తులో కూర్మ (తాబేలు) ప్రతిష్ఠ ఉంది. చుట్టూ దశావతారాలు కూడా ఉన్నాయి. చుట్టూ పచ్చగా చెట్లు, ఒక పక్క గోదావరి, మరొక పక్క దూరంగా సముద్రము - ఈ ఆలయానికి చాలా శోభను ఇస్తున్నాయి. ఈ ఆలయానికి ముందే ఒక పెద్ద గోశాల రాజుగారు నడుపుతున్నారు. గోపూజ, వాటికి జీవనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రాజు గారు చాలా బాగా చేశారు. ఇక్కడ గోవులు, ఎద్దులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి.  అంతర్వేదికి ఈ వశిష్ఠ ఆలయం, గోశాల ఒక పెద్ద ఆకర్షణ.

సంప్రదించటం ఎలా?

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు బుచ్చి బాబు గారు (ఆయన పేరు శేషాచార్యులు). వారిని ముందుగా సంప్రదించి స్వామి వారికి కళ్యాణం చేయించుకోవచ్చు. అంతర్వేదిలో నివాసానికి ఆలయానికి దగ్గరలోనే (నీలకంఠేశ్వరుడి ఆలయం సమీపంలో) తిరుమల తిరుపతి దేవస్థానం వారి రెండంతస్తుల వసతి సముదాయం ఉంది. అక్కడ రూం బుక్ చేసుకొని ఉండవచ్చు. ఇది కాక అక్కడ వేరే హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అంతర్వేదిలోనే ఉండాలి అనుకుంటే తితిదే వాళ్ల భవనం ఒక్కటే మనకున్న ఆమ్నాయం. ఈ భవనంలో గదులు, శౌచాలయాలు అంత పరిశుభ్రంగా లేవు. కొన్ని మౌలిక వసతులు, సుఖాలు కావాలి అనుకునే వాళ్లకు దిండి రిసార్ట్స్ (దిండి గ్రామంలో గోదావరి నది ఒడ్డున రిసార్ట్ కట్టారు) కానీ, నరసాపురం/రాజోలు లో కానీ ఉండవచ్చు.

ఇక్కడ శాశ్వత నిత్యాన్నదాన పథకం ఉంది. దాతలు రూ. 1,116 /- మొదలుకొని ఆపైన ఎంతైనా ఈ అన్నదాన పథకానికి విరాళం ఇవ్వవచ్చు. భోజనశాలలో ఈ విరాళం ఇచ్చి రసీదు పొందండి. చెక్, డీడీ కూడా పంపవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఆంధ్ర బ్యాంకు, కేశవదాసుపాలెం, ట్రస్ట్ ఎకౌంటు నెంబర్ 100310011008148 ద్వారా కూడా చెల్లించవచ్చు.

దేవస్థానం చిరునామా:

కార్య నిర్వహణాధికారి,
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
అంతర్వేది, సఖినేటిపల్లి మండలం,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
పిన్ కోడ్: 533252 .

ఫోన్ నంబర్లు:

  • ఎక్జిక్యూటివ్ ఆఫీసర్:  9440219241
  • దేవస్థానం మెయిన్ నెంబర్: 08862 -259313 (వసతికి, సేవలకు ఈ నెంబర్ కు చెయ్యండి).
  • ప్రధాన అర్చకులు వి.బి. వి.కే. ఎస్. శేషాచార్యులు (బుచ్చిబాబు) - 08862 -259333 , 9010126977 .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి