22, జులై 2010, గురువారం

బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - రెండో అంకం

మొత్తానికి మరాఠీ ఖాఖీల చేత లాఠీ దెబ్బలు తిని, నాలుగు రోజులు అక్కడ మగ్గి, నాటకీయంగా చంద్రన్న, బృందం హైదరాబాద్ వచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు చంద్రన్నా మన పెద్దలు. కానీ తమరు ఇంట్లో ఏమి చెయ్యలేక మహారాష్ట్రలోకి వెళ్లి నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నాకు గౌరవం ఇవ్వాలి, మంచి బస్సు ఇవ్వాలి, బస ఇవ్వాలి అంటే ఎలా సార్. ఢిల్లీలో మేడంకి మీ మీద బానే గుర్రు ఉంది సార్. అది గుర్తుపెట్టుకొని, మీరు తొమ్మిదేళ్ళలో బాబ్లీ గురించి ఏమి చేశారో ఒక సారి రివైండ్ చేసుకోండి. కాబట్టి, మీకు మర్యాదలు చేయాల్సినంత సీన్ లేదు.

ఇకపోతే, ఎమ్మెల్యేలను కొట్టి, మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరచి, కనీస వసతులు ఇవ్వకపోవటం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు. అలాగే, బాబుని ఈ సమయంలో విమర్శించి కే.సి.ఆర్ హాయిగా తమ చేతిలో ఉన్న తెలంగాణా ప్రాంతపు జనాల వోటును కొంత పళ్లెంలో పెట్టి చంద్రన్నకి ఇచ్చినట్టే. బాబు రాజకీయ చాణక్యం, కుతంత్రం మనకు బాగా తెలిసి ఆయనకు అవకాశం ఎందుకు ఇవ్వటం?. నిజంగా తెలంగాణా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తే చాలు. దానికి చంద్రన్న ఆశీర్వాదం అక్కర్లేదు. ఇంతే కాదు, తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, ఆ ప్రాంతంలో చంద్రన్న పట్టు, ప్రభావం ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి, ఆయనకు ఎందుకు మనం అవకాశాలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి.

బాబ్లీ అంశం తెలంగాణలో ఉప ఎన్నికల్ని ఏ మాత్రం ప్రభావితం చెయ్యదు అని కాంగ్రెస్, కే.సి.ఆర్ అనుకుంటే, ఆ విషయం గురించి పట్టించుకోకూడదు, మాట్లాడ కూడదు. కానీ, వారిలో ఈ విషయంలో భయం కనిపిస్తోంది. రాజకీయాల్లో, ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి కానీ చేతులు కాలాక ఆకులు రాసుకోవటం ఎందుకు?. బాబు 9 ఏళ్లలో ఏమి చేసాడు అనే నినాదం ఇంక ఎక్కువ రోజులు పని చేయ్యదండి. ఎందుకంటే, మీరు అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు దాటింది. మీరు ఏమి చేస్తున్నారు తెలంగాణా, బాబ్లీ విషయంలో ఈ ఆరేళ్లలో?. అంతమాత్రం వోటు వేసే ప్రజలు ఆలోచించరా?.

ఏమి చేసినా, చెయ్యకపోయినా - సీమాంధ్ర ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి కావాలన్న జగన్ యాత్ర బానే సాగుతోంది. నేను ఇటీవలే ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలకు వెళ్ళాను. ప్రజలకు అక్కడ వై.ఎస్.ఆర్ దేవుడు. వాళ్లు తప్పకుండా జగన్ వెంటే ఉన్నారు అన్నది స్పష్టంగా కనిపించింది. అభిమానం ఉన్నంత మాత్రాన వోట్లు రావాలని కూడా లేదు. అందుకనే, జగన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు రోశయ్యను దింపి తాను రావాలని. ఈ నేపథ్యంలో చంద్రన్న బాబ్లీ విషయంలో ఒక అడుగు ముందు వేసి - రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నాకన్నా ఎవ్వరికీ తెలీవు, పట్టవు అని బ్రహ్మాస్త్రం వదిలాడు. అది బలహీనంగా ఉన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు దెబ్బే. అలానే, జగన్ మీది నుంచి దృష్టిని కొంత మళ్ళించ వచ్చు. ఉప ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా, టీ.డీ.పీ ఆ ప్రాంతంలో పాతుకు పోవాలని ఈ యత్నం అంతా. దానికి మన టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు.

ఇవన్ని చూస్తుంటే, ఆంధ్ర రాజకీయ చిత్ర పఠం ఒక వైకుంఠ పాళీలా ఉంది.  ఎప్పుడు ఎవరు ఎలా పైకి వెళ్తారు, ఎలా అకస్మాత్తుగా కింద పడతారు అనేది చెప్పటం కష్టంగానే ఉంది. వై.ఎస్.ఆర్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా?. లేక కాంగ్రెస్ వాళ్లు జాగ్రత్త పడతారా? బాబు ఈ దూకుడును ఎన్నాళ్ళు చూపిస్తూ, ఎంత రాజకీయ లబ్ది పొంద గలరు?. వేచి చూడాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి