30, సెప్టెంబర్ 2010, గురువారం

ప్రాతః స్మరణం

ఆది శంకరుల మరొక రచన ప్రాతః స్మరణ స్తోత్రం.  ఇందులో ఆయన అద్వైతామృత సారాన్ని పంచారు.

ప్రాతః స్మరణం

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్
యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం
తత్ బ్రహ్మ నిష్కల మహం న చ భూత సఙ్ఘః

తాత్పర్యము: సచ్చిదానంద స్వరూపమగు, పరమహంసలకు కూడా ఆశ్రయమైనట్టి, తురీయము (జాగ్రత్, స్వప్న సుషుప్తావస్తలు కాని నాలుగవ స్థితి) అయినట్టి, హృదయములో ప్రకాశించే ఆత్మ తత్వమును ప్రాతః కాలమున స్మరించుచున్నాను. ఈ మూడు అవస్థలను ఎరుగనిది, నిత్యము, నిష్కలము (లక్షణాలు లేనిది) అయిన బ్రహ్మను నేను. పంచ భూతములతో నిర్మితమైన శరీరమును నేను గాను.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ
యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచం
స్తం దేవ దేవ మజమచ్యుతమాహురగ్ర్యమ్

తాత్పర్యము: మనస్సు, వాక్కులకు కనిపించుచు, వాటిని ప్రకాశింపచేయుచు, వేదములచే "నేతి" "నేతి" (ఇది కాదు ఇది కాదు) అని వర్ణింపబడుచు, పర దేవతయై, "అజ" (జన్మము లేని) , "అచ్యుత" (నాశనము లేని), "ఆదిపురుష" (అత్యున్నతమైన)  శబ్దములచే వర్ణింపబడు పరబ్రహ్మమును ప్రాతః కాలమున భజించుచున్నాను.

ప్రాతర్నమామి తమసః పరమర్క వర్ణం
పూర్ణం సనాతనవదం పురుషోత్తమాఖ్యమ్
యస్మిన్నిదమ్ జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజఙ్గమ ఇవ ప్రతిభాసితం వై


తాత్పర్యము: అజ్ఞానానికి అతీతమైంది, సూర్యుని తేజస్సుకు సమానమైనది, పూర్ణము, సనాతనమైన పురుషోత్తముడైన పరబ్రహమును ప్రాతః కాలమున నమస్కరించుచున్నాను. సర్వ మూర్తి స్వరూపుడగు ఈ అశేష మూర్తి యందె జగత్తంతయు రజ్జువున (తాడున) సర్పము వలె ప్రకాశించుచున్నది.

ఫలశ్రుతి:

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్ యస్తు స గచ్ఛేత్ పరమం పదమ్ 

తాత్పర్యము: మూడులోకాలకు అలంకారమగు ఈ మూడు శ్లోకాలను పఠించే వారికి ముక్తి కలుగును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి