7, జనవరి 2011, శుక్రవారం

శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము, తాత్పర్యము

 శ్రీమన్నారాయణీయం - పంచమ స్కంధము


ఇరువదియవ దశకము - ఋషభుని చరితము

ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతాదాగ్నీధ్రరాజాదుదితో హి నాభిః |
త్వాం దృష్టవానిష్టదమిష్టమధ్యే తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మా || ౨౦-౧

మనువు యొక్క తనయులలో రెండవవాడు ప్రియవ్రతుడు. అతని పుత్రుడు అగ్నీధ్రుడు. అతని యొక్క కుమారుడు నాభి. అతడు నీ అనుగ్రహముకై అనేక యజ్ఞ యాగములు చేసెను. అప్పుడు నీవు సంతోషించి యజ్ఞము చేయు చున్నప్పుడే ప్రత్యక్షమైతివి.

అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః |
స్వయం జనిష్యేఽహమితి బ్రువాణస్తిరోదధా బర్హిషి విశ్వమూర్తే || ౨౦-౨

ఓ నారాయణా! అప్పుడు మునీశ్వరులందరూ నిన్ను స్తుతించిరి. అట్లే నాభి మహారాజుకు నీవంటి పుత్రుడు కలుగవలయునని ఋత్విక్కులు ప్రార్థించగా నీవు స్వయముగా "పుత్రుడనై జన్మింతును" అని వరమిచ్చి అదృశ్యమైతివి.

నాభిప్రియాయామథ మేరుదేవ్యాం త్వమంశతోఽభూరృషభాభిధానః |
అలోకసామాన్యగుణప్రభావప్రభావితాశేషజనప్రమోదః  || ౨౦-౩||

నాభి యొక్క పట్టపురాణి అయిన మేరుదేవికి  నీ అంశతో ఋషభుడను పేర నీవు జన్మించితివి. అలౌకికములు, అసామాన్యములు అయిన నీ గుణగణములను చూచినా జనులందరూ అంతులేని సంతోషమును పొందిరి.

త్వయి త్రిలోకీభృతి రాజ్యభారం నిధాయ నాభిః సహ మేరుదేవ్యా |
తపోవనం ప్రాప్య భవన్నిషేవీ గతః కిలానందపదం పదం తే || ౨౦-౪

ముల్లోకములను అవలీలగా ఋషభునిపై నాభి రాజ్యభారం మోపి తన భార్య ఐన మేరుదేవితో కలసి వానప్రస్థమునకు వెళ్ళెను. అక్కడ నిన్ను ధ్యానించుచు ముక్తిని పొందెను.

ఇంద్రస్త్వదుత్కర్షకృతాదమర్షాద్వవర్ష నాస్మిన్నజనాభవర్షే |
యదా తదా త్వం నిజయోగశక్త్యా స్వవర్షమేనద్వ్యదధాః సువర్షమ్ || ౨౦-౫

నీ గొప్పతనము విని సహించలేని ఇంద్రుడు అసూయపడి అజనాభ వర్షమను పేరు గల ఈ భారత దేశంలో వర్షములు కురిపించలేదు. అప్పుడు ఋషభుడను పేరు గల నీవు నీయొక్క యోగశక్తిచే మంచి వానలు కురిసేలా చేసితివి.

జితేంద్రదత్తాం కమనీం జయంతీమథోద్వహన్నాత్మరతాశయోఽపి |
అజీజనత్తత్ర శతం తనూజాన్యేషాం క్షితీశో భరతోఽగ్రజన్మా || ౨౦-౬

స్వామీ! ఋషభుడు యోగ సాధన వలన ఆత్మానందమున మునిగి యున్నప్పటికీ ఇంద్రుడు ఇచ్చిన జయంతి అను అందమైన కన్యను వివాహమాడి ఆమె ద్వారా వంద మంది పుత్రులకు జన్మ ఇచ్చెను. వారిలో భరతుడు అందరికన్నా పెద్దవాడు.

నవాభవన్యోగివరా నవాన్యే త్వపాలయన్భారతవర్షఖండాన్ |
సైకా త్వశీతిస్తవ శేషపుత్రాస్తపోబలాద్భూసురభూయమీయుః || ౨౦-౭

ఈ వందమంది పుత్రులలో తొమ్మిది మంది యోగీశ్వరులు. భరతుడు కాక ఇంకా తొమ్మిది మంది భారతవర్షములో ఆయా ఖండములను పరిపాలించారు. మిగిలిన ఎనభై ఒక్క మంది పుత్రులు తపస్సు చేసి బ్రాహ్మణులు అయ్యారు. భరతుడు భారత దేశమునకు చక్రవర్తి అయ్యెను.

ఉక్త్వా సుతేభ్యోఽథ మునీంద్రమధ్యే విరక్తిభక్త్యన్వితముక్తిమార్గమ్ |
స్వయం గతః పారమహంస్యవృత్తిమధా జడోన్మత్తపిశాచచర్యామ్ || ౨౦-౮

ఋషభుడు మునీన్ద్రులున్న సభలో తన పుత్రులందరికి విరక్తి, భక్తి కలిసిన ముక్తి మార్గమును బోధించెను. తరువాత జడుని వలె, ఉన్మత్తుని వలె, పిశాచమువలె ప్రవర్తిన్చుచు సన్యాసము స్వీకరించెను.

పరాత్మభూతోఽపి పరోపదేశం కుర్వన్భవన్సర్వనిరస్యమానః |
వికారహీనో విచచార కృత్స్నాం మహీమహీనాత్మరసాభిలీనః || ౨౦-౯||

స్వామీ! ఋషభుని అవతారమున నీవు సన్యాసము స్వీకరించి నప్పటికీ, ఇతరులకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుచుంటివి. అట్లే, అందరిచే తిరస్కరిన్చబడుచును రాగా ద్వేషములు లేక ఆత్మానంద రసములో మునిగిపోయి భూమి యంతా తిరుగుచుంటివి.

శయువ్రతం గోమృగకాకచర్యాం చిరం చరన్నాప్య పరం స్వరూపమ్ |
దవాహృతాంగః కుటకాచలే త్వం తాపాన్మమాపాకురు వాతనాథ || ౨౦-౧౦

స్వామీ! నీవు ఋషభుడి అవతారములో అజగర వ్రతమును పూని, గోవు, లేడి, కాకి మొదలగు వాటివలె అన్నపానముల విషయమున విధినిషేధములు, శుద్ధి, ఆశుద్ధి అనే వాటిని పట్టించుకొనక ఎక్కడ కూడా ఆశ్రమమును ఏర్పరచుకొనక తిరుగుచు కుటకాచలమున దావాగ్నికి గురియై పరబ్రహ్మ భావమును పొందితివి. అట్టి గురువాయుపురాధీశ! నా బాధలనన్నిటినీ దూరము చేయుము.

ఇరువదియొకటవ దశకము - జంబూద్వీపాదులయందు భగవదుపాసనము


మధ్యోద్భవే భువ ఇళావృతనామ్ని వర్షే
గౌరీప్రధానవనితాజనమాత్రభాజి |
శర్వేణ మంత్రనుతిభిః సుముపాస్యమానం
సంకర్షణాత్మకమధీశ్వర సంశ్రయే త్వామ్ || ౨౧-౧||

ఓ జగన్నాథా! భూమికి మధ్య భాగమున గౌరి మొదలైన స్త్రీలు మాత్రమే ఉండు ఇళావృత వర్షమున్నది. అక్కడ శంకరుడు వేదమంత్రములచే సంకర్షణ రూపమున ఉన్న నిన్న సదా స్తుతించుచుండును. అట్టి నిన్ను ఆశ్రయింతును.

భద్రాశ్వనామక ఇళావృతపూర్వవర్షే
భద్రశ్రవోభిరృషిభిః పరిణూయమానమ్ |
కల్పాంతగూఢనిగమోద్ధరణప్రవీణం
ధ్యాయామి దేవ హయశీర్షతనుం భవంతమ్ || ౨౧-౨||


దేవా! ఇళావృత దేశమునకు తూర్పు దిక్కున భద్రాశ్వము అను ప్రదేశము కలదు. కల్పాంతమున అపహరించబడిన వేదములను హయగ్రీవ రూపమున ఉద్ధరించిన నీవు అచట విలసిల్లు చుందువు. అచట భద్రశ్రవులు అను మహర్షులు నిన్ను స్తుతించుచుందురు. అట్టి నిన్ను నేను సర్వదా ధ్యానిన్చుదును.


ధ్యాయామి దక్షిణగతే హరివర్షవర్షే
ప్రాహ్లాదముఖ్యపురుషైః పరిషేవ్యమాణమ్ |
ఉత్తుంగశాంతధవలాకృతిమేకశుద్ధ-
జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతమ్ || ౨౧-౩||

భగవాన్! ఇళావృత వర్షమునకు దక్షిణ దిక్కున హరివర్శ దేశము అను ప్రదేశము కలదు. అక్కడ నృసింహ స్వామి రూపమున పరమ శాంత రూపుడవై తెల్లని ఆకారములో నీవు విరాజిల్లు చుందువు. పరిశుద్ధమైన జ్ఞానము నొసగు నిన్ను ప్రహ్లాదుడు మొదలైన భక్తులు సదా స్తుతించు చుందురు. అట్టి నిన్ను నేను నిరంతరమూ ధ్యానింతును.

వర్షే ప్రతీచి లలితాత్మని కేతుమాలే
లీలావిశేషలలితస్మితశోభనాంగమ్ |
లక్ష్మ్యా ప్రజాపతిసుతైశ్చ నిషేవ్యమాణం
తస్యాః ప్రియాయ ధృతకామతనుం భజే త్వామ్ || ౨౧-౪||

ఇళావృతమునకు పశ్చిమ భాగమున అందమైన కేతుమాలమను ప్రదేశమున్నది. అక్కడ లక్ష్మీదేవికి ప్రియము కలిగించుటకై నీవు అందమైన చిరునవ్వుతో మన్మథుని రూపమున ఉన్నావు. అట్టి నిన్ను అక్కడ లక్ష్మీదేవి మరియు ప్రజాపతి యొక్క పుత్రులు ఎల్లప్పుడూ సేవించు చుందురు. అట్టి నిన్ను సదా నేను ధ్యానింతును.

రమ్యేహ్యుదీచి ఖలు రమ్యకనామ్ని వర్షే
తద్వర్షనాథమనువర్యసపర్యమాణమ్ |
భక్తైకవత్సలమమత్సరహృత్సు భాంతం
మత్స్యాకృతిం భువననాథ భజే భవంతమ్ || ౨౧-౫||

జగన్నాథా! శ్రీ కృష్ణా! ఇళావృత వర్షమునకు ఉత్తరభాగమున అందమైన రమ్యకమను ప్రదేశామున్నది. దానికి అధిపతియైన వైవస్వత మనువు మత్స్యావతార రూపుడవైన నిన్ను సదా ధ్యానించు చుండును. నీవు భక్త జనమును విశేషముగా ఆదరింతువు. మాత్సర్యములేని వారి హృదయములందు నీవు సదా భాసిల్లు చుందువు. అట్టి దివ్య రూపుడవైన నిన్ను నేను ఎల్లప్పుడూ భజింతును.

వర్షం హిరణ్మయసమాహ్వయమౌత్తరాహ-
మాసీనమద్రిధృతికర్మఠకామఠాంగమ్ |
సంసేవతే పితృగణప్రవరోఽర్యమాయం
తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్ || ౨౧-౬||

పరమానంద స్వరూపా! శ్రీ కృష్ణా! రమ్యక వర్శమునకు ఉత్తర దిక్కున హిరణ్మయమను ప్రదేశము కలదు. అచ్చట పితృ గానమందు ఉత్తముడైన ఆర్యముడు మందరాచలమును ఎత్తిన కూర్మ రూపుడవైన నిన్ను సేవించు చుండును. అట్టి నిన్ను ఎల్లపుడు నేను ధ్యానింతును.

కిం చోత్తరేషు కురుషు ప్రియయా ధరణ్యా
సంసేవితో మహితమంత్రనుతిప్రభేదైః |
దంష్ట్రాగ్రఘృష్టఘనపృష్ఠగరిష్ఠవర్ష్మా
త్వం పాహి విజ్ఞనుతయజ్ఞవరాహమూర్తే || ౨౧-౭||

జ్ఞానులైన రుషులచేత స్తుతించబడిన యజ్ఞ వరాహమూర్తీ! ఉత్తర కురు దేశముల యందు నీకు ప్రియమైన భూదేవి అనేక విధములైన స్తోత్రములచే నిన్ను నుతించు చుండును. వరాహమూర్తివైన నీ యొక్క కోరల చివరలు మేఘములను తాకునంత ఎత్తుగా ఉన్నవి. అట్టి ఉన్నత రూపుడవైన నీవు అనను రక్షించుము.

యామ్యాం దిశం భజతి కింపురుషాఖ్యవర్షే
సంసేవితో హనుమతా దృఢభక్తిభాజా |
సీతాభిరామపరమాద్భుతరూపశాలీ
రామాత్మకః పరిలసన్పరిపాహి విష్ణో || ౨౧-౮||

ఇళావృత దేశమునకు దక్షిణముననున్న కింపురుషమను ప్రదేశమునందు హనుమంతుడు మిగుల అద్భుతమైన అందచందములతో విరాజిల్లేది సీతా రామచంద్రమూర్తిని సేవించు చుండును. అట్టి శ్రీరాముడవైన శ్రీ మహావిష్ణూ! నీవు నన్ను దయతో రక్షించుము.

శ్రీనారదేన సహ భారతఖండముఖ్యైస్
త్వం సాంఖ్యయోగనుతిభిః సముపాస్యమానః |
ఆకల్పకాలమిహ సాధుజనాభిరక్షీ
నారాయణో నరసఖః పరిపాహి భూమన్ || ౨౧-౯||

స్వామీ! భారత ఖండమున నీవు నరనారాయణుల రూపమున వెలసి ఎల్లప్పుడును సజ్జనులను రక్షించు చుందువు. ప్రముఖులైన నారదాది మహర్షులు సాంఖ్య యోగ స్తుతులచే నిన్ను స్తుతించు చుందురు. అట్టి పరమాత్ముడ వైన నీవు నన్ను రక్షించుము.

ప్లాక్షేఽర్కరూపమయి శాల్మల ఇందురూపం
ద్వీయే భజంతి కుశనామని వహ్నిరూపమ్ |
క్రౌంచేఽంబురూపమథ వాయుమయం చ శాకే
త్వాం బ్రహ్మరూపమయి పుష్కరనామ్ని లోకాః || ౨౧-౧౦||

ప్రభూ! నీవు ప్లక్ష ద్వీపమునందు సూర్య రూపమునను, శాల్మల ద్వీపమునందు చంద్ర రూపమునను, కుశ ద్వీపమున అగ్నిరూపమునను, క్రౌంచ ద్వీపమున జలాధిదేవత రూపమునను, శాక ద్వీపమున వాయుదేవతా రూపమునను, పుష్కర ద్వీపమున బ్రహ్మ రూపమునను విరాజిల్లు చున్నావు. ఈ విధముగా సర్వ దేవతా రూపుడవైన నిన్ను మానవులందరూ సేవించు చున్నారు.

సర్వైర్ధ్రువీదిభిరుడుప్రకరైర్గ్రహైశ్చ
పుచ్ఛాదికేష్వవయవేష్వభికల్ప్యమానైః |
త్వం శింశుమారవపుషా మహతాముపాస్యః
సంధ్యాసు రుంధి నరకం మమ సింధుశాయిన్ || ౨౧-౧౧||


క్షీర సాగరమున శయనించు చున్న నారాయణా! శింశుమార రూపమున నున్న నీ యొక్క పుచ్చము మొదలైన అవయవాములందు ద్రువాడి నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు మొదలైన గ్రహములున్నట్లు కల్పిన్చ బడుచున్నవి.  ఆ శింశుమార రూపమున నున్న నిన్ను మహాత్ములు మూడు సంధ్యా సమయములందు ఉపాసించు చున్నారు. అట్టి శింశుమార రూపా! పాపములను దూర మొనర్చి నాకు నరకము కలుగ కుండునట్లు అనుగ్రహించుము.


పాతాళమూలభువి శేషతనుం భవంతం
లోకైకకుండలవిరాజిసహస్రశీర్షమ్ |
నీలాంబరం ధృతహలం భుజగాంగనాభిః
జుష్టం భజే హర గదాన్గురుగేహనాథ || ౨౧-౧౨||

దేవా! పాతాళమున నీవు ఆదిశేషుని రూపమున ఉన్నావు. అక్కడ నీవు విలాసముగా కదలుతున్న కుండలములు గల వేయి శీర్శములతో రాజిల్లు చుందువు. ఎల్లప్పుడూ నీవు నీల వస్త్రమును ధరించి యుందువు. చేతిలో నాగలి ఉందును. నాగాన్గనలు ఎల్లపుడు నిన్ను కొలుచు చుందురు. అట్టి ఆదిశేషుని రూపముననున్న గురువాయురప్ప! నిన్ను నేను ఎల్లప్పుడును సేవింతును. కావున నా రోగములనన్నిటినీ సమూలముగా నాశనము చేయుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి