20, జనవరి 2011, గురువారం

శ్రీమచ్ఛంకరభగవత్పాద కృత సాధనా పంచకం - తాత్పర్యము

మానవ జన్మ పరమార్థము మనము ఏమిటో తెలుసుకొని, పాప ప్రక్షాళన చేసుకొని, పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, ఆ పరబ్రహ్మమును అనుభూతి పొంది, ఆ సచ్చిదానంద స్థితిలో ఉండటం. ఇది ఒకరోజులో అలవాటు అయ్యేది కాదు, అనుభూతి పొందేది కాదు. నిరంతర కఠోర సాధన అత్యంత ఆవశ్యకం. మరి ఈ అనంతమైన భవసాగరంలో మునిగి తేలే మనకు ఏది సరైన మార్గము?.

దీనికోసమే శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

జగద్గురువు అనుగ్రహమే నేటి భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యము

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.

కాబట్టి, ఈ సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. దీన్నే షిర్డీ సాయిబాబా వంటి సద్గురువులు మనకు అరటి పండులా ఒలిచి చెప్పారు. వివేకానంద వంటి వేదాంతులు ఘోషించారు. ఆధ్యాత్మిక సంపాదకు మనకు ఏమి కొరత లేదు. కానీ, దానిని ఉపయోగించుకుని, ఆచరణలో పెట్టే చిత్తశుద్ధి, త్యాగనిరతి లేదు. వీటిని దాటితే, మనకు ఎదురు లేదు.

ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.  జయ జయ శంకర! హర హర శంకర!

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మా 

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం  ౧

వేదములను నిత్యము అధ్యయనం చేద్దాము. వాటిలో చెప్పబడిన కర్మలను అనుష్ఠిద్దాం. వాటిని అనుసరించి దేవతలను పూజించుదాం, కర్మలను ఫలాపేక్ష లేకుండా చేద్దాము. మనం చేసే తప్పులను తెలుసుకుందాం, పాపములనుండి దూరముగా ఉందాము. ఆత్మజ్ఞానమును పొందుదాం. గృహ బంధనముల నుండి దూరముగా ముక్తి మార్గములో  పయనిద్దాం.

సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం  ౨

సత్సాంగత్యమును ఆచరిద్దాం. భగవంతునిపై దృఢమైన భక్తీ భావాన్ని పెంపొందిన్చుకుందాం. శాంతి మొదలగు మానసిక స్థితులను తెలుసుకుందాం, కర్మలను దృఢ సంకల్పముతో నిర్వర్తిద్దాము. సద్గురువును ఆశ్రయిద్దాం, శరణాగతి కోరుదాం, గురు పాదుకలను నిత్యము పూజిద్దాం. ఏకాక్షర బ్రహ్మమును (ఓం)  ధ్యానిద్దాం, శ్రుతులలో చెప్పిన వాటిని శిరోధార్యముగా విందాం.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతాం
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహంమతిరుఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం  ౩

వేదాలలోని గొప్ప వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం, వేద సారాన్ని తెలుసుకుందాం. చేదు వాగ్వివాదములకు దూరంగా ఉందాము, వేదములపై సంవాదములలో మాత్రమే పాల్గొందాము. నేనే బ్రహ్మను అనే భావనను వీలైనంత కలిగి ఉందాము,  అహంకారాన్ని వీడుదాం. నేను అనగా శరీరం అనే భావనను వీడుదాం, పండితులతో వాదనలు పరిత్యజిద్దాము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం  ౪

ఆకలి అనే రోగానికి చికిత్స చేద్దాము, ప్రతిదినము భిక్షలో దొరికిన దానినే ఔషధంగా భుజిద్దాం. రుచికరమైన భోజనము కొరకు యాచించ కుండా ఉందాము, విధివశాత్తు దొరికిన దానితో సంతృప్తి చెందుదాం. శీతోష్ణములను ఓర్చుకుందాము, వృథా వాక్యములను మాట్లాడకుందాము.  ఉదాసీనమును ఇష్ట పడదాం (విషయముల పట్ల ఉదాసీనముగా ఉండుట  - సంతోషము, విచారము లేకుండా), జనులు మన పట్ల చూపించే కృప, నిష్ఠూరములను మనలకు అంటకుండా ఉందాము.

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం  ౫

ఏకాంతంలో సుఖాసీనులమై, ఆత్మ యొక్క సత్యముపై మనసు లగ్నము చేద్దాము. పూర్ణాత్మను దర్శించుదాం. ఆ సత్యముతో నిండిన విశ్వాన్ని దర్శించటానికి ప్రయత్నిద్దాము. పూర్వ కర్మల ఫలములను నాశనము చేద్దాము, కొత్త కర్మలలో చిక్కుకొన కుండా ఉందాము. ప్రారబ్ధమును ఇక్కడే వదిలివేద్దాము, పరబ్రహ్మ స్థితిలో ఉందాము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి