14, ఫిబ్రవరి 2011, సోమవారం

సుబ్రహ్మణ్య తత్త్వము, సుబ్రహ్మణ్యాష్టకం, తాత్పర్యము

|| ఓం శరవణ భవ ||

పత్నీ సమేత శిఖి వాహన షణ్ముఖుడు

దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని  ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో  సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు. గుళ్ళ సంగతి పక్కకు పెట్టి, సుబ్రహ్మణ్య తత్త్వము గురించి కొంచెం చెప్పుకుందాం.

అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా  కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.

శ్రీ వల్లీ దేవసేనా పతి

స్కందుని జననము, వృత్తాంతము:

కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన.  తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు. జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.

ఈ సుబ్రహ్మణ్య లక్షణాలు అన్నీ సంపుటంగా ఈ ధ్యాన శ్లోకంలో వివరించ బడ్డాయి.

శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం 
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి

గంగాదేవి  శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.

ఆ సుబ్రహ్మణ్యుని అష్టకం, తాత్పర్యము, శ్రవణం 2. దీనినే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా కూడా పిలుస్తారు.

పళని మురుగన్ 

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పంకజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౧

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౨

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౩

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండితదివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౪

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౫

హారాదిరత్న మణియుక్తత కిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౬

పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౭

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్
సిక్త్వా తు మా మవ కళాధరకాంతకంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౮
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి. ౯

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్

తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్య స్వామి

తాత్పర్యము:

హే స్వామినాథ! (స్వామిమలై కొండలపై ఉన్న వాడు స్వామినాథుడు) ! కరుణాకరా! దీనబంధో! కలువ వంటి ముఖము కల పార్వతీ దేవి కుమారా! విష్ణువు మొదలగు దేవతలచే పూజించబడిన పద్మముల వంటి పాదములు కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

దేవాది దేవుడైన శివునిచే నుతించ బడినవాడా! దేవ గణములకు అధిపతీ! దేవేన్ద్రునిచే పూజించబడిన కలువలవంటి పాదములు కలవాడా! , దేవర్షి యైన నారదుడు మొదలైన మునులుచే గానము చేయబడి, నుతించబడిన కీర్తి కలవాడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

ప్రతిదినము అన్నమునిచ్చే వాడా! అన్ని రోగములను హరించే వాడా! భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చీ వాడా! వేదములలో చెప్పబడిన ప్రణవమునకు  నిజ రూపుడా! వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము).

క్రౌంచము, రాక్షసుల, దేవేంద్రుని గర్వమును అణచిన వాడా! శక్తి శూలము, పాశము మొదలగు శస్త్రములు శోభతో చేతులయందు కలవాడా! కుండలములు ధరించి, అందమైన మెడ కల నెమలిని అధిరోహించిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము  (నన్ను కాపాడుము).

దేవాది దేవా! రథమండలము మధ్యలో యున్న వాడా! దేవేంద్రుని నగరాన్ని కాపాడిన వాడా! హస్తములతో వేగముగా బాణములు వేయగలవాడా! అసురుడైన శూరుని చంపి దేవతలచే పొగడబడిన వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

హారములు, మణులతో పొదగబడిన కిరీటమును ధరించిన వాడా! కేయూరములు, కుండలములు, కవచము ధరించి అందముగా యున్న వాడా! వీరుడా! తారకుని జయించి దేవతల బృందముచే మ్రొక్క బడిన వాడా!  వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

పంచాక్షర జపముతో, గంగా నదీ స్నానముతో, పంచామృత స్నానముతో దేవతలు, మునులు కొనియాడి కొలుచు చుండగా 
దేవేంద్రునిచే సేనాపతిగా అభిషిక్తుడవైన  వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

 కరుణతో నిండిన పూర్ణమైన చూపులతో కామము, రోగము నాశనము చేసి, కలుషితమైన మనస్సును శుభ్రపరిచే ఓ కార్తికేయ! సకల కళలకు నిధీ! శివుని తేజస్సుతో వెలిగే వల్లీ నాయకా! నాకు నీ చేతి సహాయమునిమ్ము (నన్ను కాపాడుము). 

ఈ  సుబ్రహ్మణ్యాష్టకం పఠించే బ్రాహ్మణులకు ఆ స్వామి ముక్తి ప్రసాదించును. ఉదయముననే ఈ అష్టకము పఠించే వారికి కోటి జన్మలలో చేసిన పాపములు ఒక్క క్షణములో నశించును. 

1 కామెంట్‌: