15, ఫిబ్రవరి 2011, మంగళవారం

శంకర విరచిత భవాన్యష్టకం, తాత్పర్యము

సర్వోన్నతమైన వైరాగ్యము, శరణాగతిలో ఆది శంకరుల స్తోత్రాలను మించినవి లేవు. ఇది లోక విదితం. శక్తి పీఠాలు అనగానే శంకరులు మనకు ఇచ్చిన మహా ఆధ్యాత్మిక వారసత్వ సంపద,  ఎందరో యోగుల, యోగినుల, సాధువుల, భక్తులకు ఆలవాలమైన దేవాలయాలు, ముక్తి స్థానములు గుర్తుకు వస్తాయి. ప్రధానమైన మహా అష్టాదశ శక్తి పీతాలలో - లంకలో శాంకరి, కంచిలో కామాక్షి, ప్రద్యుమ్నంలో శృంఖల, మైసూర్ లో చాముండేశ్వరి, అలంపురంలో జోగుళాంబ, శ్రీశైలంలో భ్రమరాంబ, కొల్హాపూర్లో మహాలక్ష్మి, నాందేడ్ లో ఏకవీర, ఉజ్జయినిలో మహాకాళి, పిఠాపురంలో  పురుహూతిక, జాజ్పూర్ లో విరజ, ద్రాక్షారామంలో మాణిక్యాంబిక, గౌహతిలో కామరూప, ప్రయాగలో మాధవేశ్వరి, జ్వాలాలో వైష్ణవి, గయలో సర్వమంగళ, వారణాసిలో విశాలాక్షి, దంతేవాడలో దంతేశ్వరి, కాశ్మీరంలో సరస్వతి -  ఈ క్షేత్రాలలో సతీదేవి యొక్క వివిధ దేహ భాగాలను ఆయా రూపాలలో కొలుస్తున్నాము.

ఇక భవానీ రూపానికి వస్తే, మన దేశంలో సుప్రసిద్ధ శక్తి పీఠం తుల్జాపూర్ భవాని క్షేత్రం. శివాజీ మహారాజు సంతతము కొలిచిన మాత ఈ భవాని. స్వయంభు ఐన భవాని విగ్రహం ఇక్కడ అష్ట భుజములతో సింహాసన స్థితయై యున్నదట. శివాజీకి మాత ప్రత్యక్షమై అతనికి భవాని ఖడ్గము ప్రసాదిన్చిందిట. దానితో ఆ ఛత్రపతి అరివీర భయంకరుడై విజయాలు సాధించాడుట.

తుల్జాపూర్ భవాని

ఆది శంకరులు ఈ స్తుతి ద్వారా ఆ జగన్మాత పట్ల తన సర్వస్య శరణాగతిని, పరిపూర్ణ ఆధ్యాత్మిక వికాసాన్ని, ఔన్నత్యాన్ని మరో మారు ప్రస్ఫుటంగా ప్రకటించారు.సామాన్య మానవుని లక్షణాలను అద్భుతంగా వర్ణిస్తూ, వాటిని తనకు ఆపాదించుకుంటూ, అజ్ఞానమనే అంధకారములో, సంసార సాగరములో మునిగి తేలుతున్న, సర్వ అవలక్షనములతో కొట్టుమిట్టాడుతున్న తనను కాపాడుమని, మాతయే శరణాగతి యని ఈ స్తోత్రము ద్వారా వేడుకుంటున్నారు శంకరులు.

ఆది శంకర విరచిత భక్తి సుగంధం - భవాన్యష్టకం, తాత్పర్యము. శ్రవణం.

న తాతో న మాతా న బన్ధుర్న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౧

భవాబ్ధావపారే మహాదుఃఖభీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః
కుసంసారపాశప్రబద్ధః సదాహం  గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౨

న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్
న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౩

న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్
న జానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౪

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౫

ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౬

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రుమధ్యే
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౭

అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని  ౮

 ఇతి శ్రీమదాదిశంకరాచార్య విరచితా భవాన్యష్టకం సంపూర్ణం


శంకరులచే నుతించబడిన జగన్మాత

తాత్పర్యము: 

తల్లి తండ్రులు, బంధువులు, స్నేహితులు, సంతానము, సేవకులు, భర్త, భార్య, విద్య, వృత్తి - ఇవేవి నాకు గతి కాదు. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను జనన మరణమనే సంసార సాగరములో యున్నాను. పిరికి వాడనై దుఃఖమును ఎదుర్కొన లేకున్నాను. పాపము, ప్రలోభముతో నిండి యున్నాను. కామము, మోహములతో కూడిన కుసంసార పాశములో బద్ధుడనై యున్నాను. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నాకు దానము చేయుట తెలియదు, ధ్యానము తెలియదు.  నాకు తంత్రము, మంత్రము, స్తోత్రం, పూజ, న్యాసము (దేహములోని వివధ భాగములను చేతుల ముద్రలతో తాకి శుద్ధి చేసుకొనుట), యోగము తెలియవు.  ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నాకు పుణ్యము, తీర్థములు తెలియవు. నాకు ముక్తి ఏమిటో తెలియదు, నీ యందు ఏకాగ్రముగా చిత్తమును ఉంచుట తెలియదు. నాకు భక్తి తెలియదు, వ్రతములు, దీక్షలు తెలియవు. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను చెడు కర్మలను చేస్తూ, దుష్టుల సాంగత్యములో ఉన్నాను. నేను దుష్ట బుద్ధి, చెడు ఆలోచనలు కలవాడను. నేను చెడు ఆచారములు కలవాడను, చెడ్డ ప్రభువుల సేవలో ఉన్నాను, చెడ్డ కులములో ఉన్నాను. నేను చెడు ఆలోచనలలో మునుగుతూ చెడ్డ దృష్టి కలవాడను, చెడు వాక్యములను వ్రాసెడి వాడను. ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రులు ఎవరో తెలియని అజ్ఞానమున ఉన్నాను. నాకు వేరే దేవతలు ఎవరూ తెలియదు. నేను ఎల్లప్పుడూ శరణు కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను వివాదములలో, విషాదములో, ప్రమాదములో, ప్రయాణములో, నీటి యందు, అగ్ని యందు, పర్వతముపై, శత్రువుల మధ్య చిక్కుకొని, అరణ్యంలో యున్నప్పుడు పాహి కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి.

నేను అనాథగా, దారిద్ర్యములో, ముసలితనము వలన కలిగే రోగములతో పీడిన్చబడుతూ, క్షీణించి, దీనుడనై, సమస్యలలో చిక్కుకుని, విపత్కర పరిస్థితులలో యున్నప్పుడు శరణు కోరే ఓ భవానీ! నీవే నాకు ఏకైక గతి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి