15, జులై 2011, శుక్రవారం

గురుపౌర్ణమి విశిష్టత

గురుపౌర్ణమి విశిష్టత
శ్రీ సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై
 
త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసారభీతిభంగాయ తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: నీవే నా తండ్రివి, తల్లివి, హితుడవు, దేవుడవు. సంసార భయాన్ని పోగొట్టే గురువైన నీకు నా నమస్కారములు.

(సద్గురు స్వామి శివానంద వారి గురుతత్త్వముపై అనుగ్రహ భాషణలో నేటి గురుపౌర్ణమి వైశిష్ట్యాన్ని వివరించారు. దానికి తెనుగు అనువాదం మీకోసం).

ఆషాఢ శుద్ధ పౌర్ణమి అత్యంత శుభప్రదమైన పర్వదినం. ఈ రోజును గురుపౌర్ణమిగా భావిస్తారు. వేదవ్యాసునికి గౌరవ సూచకంగా ఈ పవిత్ర దినం నాడు యోగులు, సన్యాసులు ఒకచోట చేరి వేదాంత విచారములో భాగంగా ఆ కృష్ణద్వైపాయనుని బ్రహ్మసూత్రాలపై ప్రసంగిస్తారు. వేదవ్యాసమహాముని నాలుగు వేదాల అధ్యయనంతో బ్రహ్మసూత్రాలు, పద్ధెనిమిది పురాణాలను, మహాభారతమును, భాగవతమును రచించి మానవాళికి వెలకట్టలేని ఆధ్యాత్మిక సంపదను వారసత్వంగా ప్రసాదించారు. దీనికి, ఆ మహానుభావునికి గల మన ఋణాన్ని ఆ రచనల అధ్యయనం ద్వారా, ఆయన బోధనలను ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే తీర్చుకోగలము. ఆయన బోధనలు, రచనలు ఏ యుగానికైన ప్రామాణికమే. ఆ మహామునికి గౌరవంగా సాధకులు, యోగులు ఈ గురుపౌర్ణమినాడు వ్యాస పూజ నిర్వహిస్తారు. సాధకులు తమ తమ గురువులను పూజిస్తారు. గురువులను, మహాత్ములను సత్కరించి వారిని రంజిల్లజేస్తారు. గృహస్థులు భక్తి శ్రద్ధలతో దానధర్మములవంటి సత్కార్యములు చేస్తారు. సన్యాసులకు చాతుర్మాస్యం నేడు ప్రారంభమవుతుంది. అనగా, సన్యాసులు వర్షాకాలపు ఈ నాలుగు నెలలు ఒకే చోట నివసించి బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేస్తూ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు.

ఈ గురుపౌర్ణమి విశిష్టతను నిశితంగా గమనించండి. చాతుర్మాస్యం, అనగా మండే వేసవి తరువాత ఎంతో ఎదురు చూసే నాలుగు నెలల వర్షాకాలం ఆరంభం నేడు. ఎండవేడిమికి ఆవిరై మేఘాల రూపంలో ఉన్న నీరు పుష్కలంగా వర్షించి కొత్త జీవనానికి బీజం వేస్తుంది. అలాగే మనందరం కూడా ఓపికతో అధ్యయనం చేసిన విద్యను నిజజీవితంలో అమలు చేయటం ప్రారంభిద్దాం. నిజ సాధన ఈ రోజు ప్రారంభించి సరికొత్త ఆధ్యాత్మిక అలలను సృష్టిద్దాము. మనము చదివినది, వినినది, చూచినది, నేర్చుకున్నది, సాధన ద్వారా అనంతమైన విశ్వ సౌభ్రాతృత్వము, ప్రేమ, నిరంతర సేవా భావముతో, భక్తి తత్పరతలతో విశ్వవ్యాప్తుడైన భగవంతుని కొలుచుదాం.

(సన్యాసులకు) ఈ చాతుర్మ్యాస్యంలో పాలు, పండ్లు మాత్రమే ఆహారముగా తీసుకుని, కఠోర జప, ధ్యానములు చేద్దాము. బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేద్దాము. మీ గురు మంత్రమును లేదా ఇష్ట దేవతా మంత్రమును లక్షల జపము (అనుష్ఠానము లేదా పునశ్చరణ అయినా పరవాలేదు) చేద్దాము. ఇది మనకు అత్యంత శుభ, లాభకరం.

ఈ గురు పూజా దినము సాధకులకు అత్యంత ఆనందకరమైనది. తన ప్రియ గురువుపై తనకు గల భక్తి, గౌరవాలను వ్యక్తపరచటం కోసం ఉత్సాహంగా ఉన్న శిష్యునికి ఇది ఎంతో ఆతురతతో ఎదురుచూసే సుదినం. కేవలం ఒక్క గురువు మాత్రమే మానవుని బంధపాశములను తొలగించి భవసాగరమునుండి విముక్తుడిని చేయగలడు. శ్రుతులు ఈ విధంగా చెబుతున్నాయి - "భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు కలిగి, అట్టి భక్తి విశ్వాసములు గురువు మీద కూడా కలిగియున్న ఉన్నతాత్ములకు ఈ రహస్యము అవగతమై ఆత్మజ్ఞానమును పొంది అఖండ తేజోవంతులగుదురు". గురువే బ్రహ్మ. గురువే ఈశ్వరుడు. జీవాత్మ యొక్క అంతరాళమునుండి మనలను ఉత్తేజపరచి ముందుకు నడిపించే వాడు గురువు. ఆ గురువు అంతటా ఉన్నాడు.

అనేకజన్మ సంప్రాప్త కర్మబంధవిదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః

 తాత్పర్యము: జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే ఆ గురువునకు నా నమస్కారములు

2 కామెంట్‌లు: