25, జనవరి 2011, మంగళవారం

సాధనకు త్యాగరాజు సూత్రము - మనసా ఎటులోర్తునే

మున్నుడి:
  
సాధనా మార్గములో మనసు పరి పరి విధాల అనేక దిక్కుల పరిగెడుతుంది. అట్టి పరిస్థితిలో, తాత్కాలిక మనో స్థితిపై నియంత్రణ లేక,  గొప్ప గొప్ప వారే మార్గం తప్పి భ్రష్టులైనారు. త్యాగయ్య ఆ కోతి మనసును ఉద్దేశించి స్వానుగతము ఈ కీర్తన ద్వారా భావ గర్భితంగా చెప్పారు. ఎంతటి వారినైన త్వరగా తనవైపు ఆకట్టుకునేవి  చెడు, విషయ వాంఛ, వ్యసనములు. అందుకే వాటిని ప్రలోభములు అని అన్నారు. సామాన్యునికి వస్తువు, విషయము - మంచా, చెడా అన్న జ్ఞానము ఆ సమయములో పని చేయదు. ఆ విచక్షణ, వివేచన సరిగ్గా పనిచేయాలంటే ఇంద్రియ నిగ్రహము, స్థితప్రజ్ఞత, జ్ఞానము, విద్య, దైవ బలము ఎంతో అవసరం. వీటిని సాధించటానికి భక్తి అనేది చాలా సులభమైన మార్గము. ఈ మార్గములో శరణాగతి అనేది ఆవశ్యకము.   ఈ కీర్తన ద్వారా త్యాగరాజు ఈ సందేశాన్ని ఎంతో ఆర్తితో చెప్పారు త్యాగయ్య. మనసా ఎటులోర్తునే సాహిత్యము, అర్థము.

 
సాహిత్యము: 

మనసా ఎటులోర్తునే నా  మనవిని చేకొనవే

దినకర కుల భూషణుని దీనుడవై భజన చేసి
దినము గడుపు మనిన నీవు వినవదేల గుణవిహీన |మనసా|

కలిలో రాజ తామస గుణముల కలవారి చెలిమి
కలసి మెలసి తిరుగుచు మరి కాలము గడపకనే
సులభముగా కడతేరను సూచనలను తెలియజేయు
ఇలను త్యాగరాజు మాట వినవదేల గుణవిహీన  |మనసా|

భావము:

ఓ మనసా! నిన్ను ఎట్లా ఓర్చుకొనేది?  నా మనవిని విను.

గుణవిహీనవైన ఓ మనసా! సూర్యవంశమునకు భూషణుడు అయిన శ్రీరాముని దీనత్వముతో భజన చేస్తూ దినము గడుపుము అంటే మాట వినకున్నావు ఎందులకు?

గుణవిహీనయైన ఓ మనసా! ఈ కలియుగములో రాజస తామస గుణములు కలవారితో స్నేహితము చేసి, వారితో కలిసి మెలిసి తిరుగుచు కాల వ్యర్థా చేయక, సంసారమనే సాగరమును సులభముగా దాటే సూచనలు తెలియచేసే త్యాగరాజు మాట వినవెందులకు? (వినుము అని అర్థం).


పరిశీలన: 

సాధనలో విశ్వాసము, ఏకాగ్రత నెమ్మదిగా అలవడుతాయి. అంతవరకూ మనసు ఎన్నో దిక్కుల పరుగెడుతూనే ఉంటుంది. కొన్నాళ్ళు యాంత్రికంగా అయినా, మనసుకు కళ్ళెం వేసి సాధనలో కూర్చో బెడితే, అటు తరువాత అది స్వయంగా సహకరిస్తుంది. పరిగెత్తేటప్పుడు కళ్ళెం వేయటానికే మనకు మంత్ర జపము, పూజ విధానము, స్తోత్రములు, ఉపచారములు (అత్యుత్తమైనది, అతి కష్టమైనది ధ్యానము)  ఆగమాలు నిర్వచించాయి. అటువంటి పదహారు ఉపచారములలో ఒకటి కీర్తన చేయటం. అలాగే నవ విధ భక్తులలో కూడా కీర్తన ఒకటి. అటువంటి కీర్తన ద్వారా త్యాగయ్య మనసును స్వాధీనములో ఉండమని, సరియైన మార్గములో నడువుమని ఉద్దేశించి ఈ కృతి చేశారు.

కలియుగ లక్షణము మూడు పాళ్ళు అధర్మము, ఒక పాలు ధర్మము. అంటే నలుగురిలో ముగ్గురు అధర్మ పరాయణులే. కాబట్టే, త్రిగుణములైన సాత్త్వికము, రాజసము, తామసములలో ఈ యుగములో రాజస తామస గుణములు కలవారే ఎక్కువ. కానీ, భవత్ప్రాప్తికి కావలసినది సత్సాంగత్యము. అంటే సాత్త్విక గుణములు కలవారి చెలిమి. పరమ భాగవతుని ముఖ్య గుణము సత్త్వము. అంటే సత్యమును అన్వేషించుట, అనుభూతి పొందుట, ఆచరణలో పెట్టుట, ఇతరుల పట్ల హింసను విడనాడుట, కరుణ దయ కలిగి యుండుట. ఈ సత్త్వమును జీవితములోని ప్రతి క్రియలో అమలు పరుస్తాడు సాత్త్వికుడు, నిజ భక్తుడు. అన్నిటికన్నా ఉన్నతమైనది భగవంతుడని నమ్మి కర్మలను చేస్తూ, ఫలితం ఆశించక, వచ్చిన దానితో తృప్తి చెంది ధర్మమును నిర్వర్తిస్తాడు భాగవతుడు. ఇతరులను నొప్పించడు, తాను నొచ్చుకోడు సత్త్వికుడు. ఈ లక్షణాలు కలవారిని వెదికి వారితో సాంగత్యము చేయుమని మనకు శృతి, శాస్త్ర పురాణేతిహాసములు ఘోషిస్తున్నాయి. అదే సందేశాన్ని త్యాగరాజు ఈ కీర్తనలో చెడు గుణములు కలవారి స్నేహితములో కాలము వృథా చేయకుండా భక్తి, జ్ఞాన వైరాగ్యములు కలిగిన సత్త్వసంపన్నుల సంగతి కలిగి పరమాత్మను కనుటలో కాలం గడుపుము, నా మాట వినుము అని నివేదిస్తాడు.

ఇంత కన్నా గొప్ప ఆధ్యాత్మిక సందేశము ఏముంటుంది?. అందుకే ఆయన స్వామి, మహానుభావుడు, ఋషి, పరమ భక్తుడు అయ్యాడు. మనసా ఎటులోర్తునే మల్లాది సోదరుల గళంలో వినండి, చూడండి.

త్యాగయ్య రామభక్తి - బంటు రీతి కొలువు


రాముని పట్ల అనుపమానమైన భక్తి, అచంచలమైన విశ్వాసము కలిగిన వారు త్యాగరాజ స్వామి. రామతారక మంత్రాన్ని గురువుల వద్దనుండి పొంది, దానిని సాధన చేసి మంత్ర సిద్ధి పొందిన తరువాత రాముని గుణవైభవములను వర్ణిస్తూ వేల కీర్తనలను రచించారు. పరిపూర్ణమైన యోగులు ఆయన. పోతన గారి లాగానే రాజాశ్రయాన్ని తిరస్కరించి రామచరణాలే శరణు అన్న మార్గాన్ని ఎన్నుకొని తరించారు. తద్వారా వచ్చిన దారిద్య్రం వారిని ఏ మాత్రం చలింపజేయలేదు. ఉంఛవృత్తి, అందులోనూ భుక్తి దొరకక పోతే తులసిదళములు, నీళ్లు ఇదీ ఆయన జీవితం. మరి రామభక్తి సామ్రాజ్యంలో ఊరికే ఉన్నతమైన స్థానం లభిస్తుందా? ప్రేయమైనవన్నీ వదులుకొని శ్రేయమైన రాముని నామాన్నే ఆశ్రయించిన ఆయన ఈ భువిని వదిలి ఎంతో కాలం కాలేదు. కేవలం 169 ఏళ్లు మాత్రమే.

ఆయన ద్వైత భావమునుండి అద్వైతానికి ఏ విధంగా సోపానం చేశారో ఆయన కీర్తనలలోనే అర్థమవుతుంది. భక్తిలో రూపలక్షణాల వర్ణన ఒక ఎత్తైతే, ఆ దివ్యత్వంతో రమించటం, దానికి మార్గాలను చెప్పగలగటం మరింత ఉన్నతమైన మెట్టు. దీనికి ఒక మచ్చుతునక బంటురీతి కొలువీయవయ్య రామా అనే కృతి. ఉత్తముడైన ఆ హనుమంతునివలె రామభక్తి సామ్రాజ్యంలో తనకు కూడా కొలువు ఈయవయ్యా ఎంత ఆర్తితో వేడుకున్నాడు? రాముని నామము జపిస్తుంటే హనుమంతునికి రోమాంచమట. రోమాలు నిక్కబొడుచుకొని, ఆనందబాషాపాలు రాలాయట. ఆ రోమాంచమే ఆయనకు గొప్ప రక్షణ కవచం, హనుమంతుడికి చిరునామ ఏమిటి? రామభక్తి. రామనామమే అన్నిటికి కన్నా పెద్ద ఆయుధమట. ఇవన్నీ ఇచ్చింది ఆ రాముడే కదా?  ఇలా ఒకటా రెండా? వేల కృతులు ఆ రమునిపై, రామభక్తిపై...

హనుమంతుని బలము ఏమిటి? కేవలం రామభక్తి, ఆ ప్రభువుకు పూర్తి దాస్యము. ఆ నిరంతర రామ నామ కీర్తనా బలంతో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, లంకను గెలిచాడు, సంజీవనిని తెచ్చాడు. అంతటి మహత్తు గల రామ భక్తి, అటువంటి దాస్యము తనకు అనుగ్రహించ వలసిందిగా  త్యాగయ్య ఆ రాముని వేడుకునే కీర్తన బంటు రీతి.  ఈ కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.


సాహిత్యము: 

బంటు రీతి కొలువీయవయ్య రామా ||బంటు||

తుంట వింటివాని మొదలైన మదా
దుల బట్టి నేల కూలజేయు నిజ ||బంటు||

రోమాంచమనే ఘన కంచుకము
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు
రామనామమనే వరఖడ్గమీవి
రాజిల్లునయ్య త్యాగరజునికే ||బంటు||

భావము: 

ఓ రామా! నీ కొలువులో నీ బంటుగా సేవించుకునే భాగ్యము కలిగించు స్వామీ!

మన్మథుడి ప్రభావము వలన కలిగే కామము, మరియు - లోభ, మోహ, మద, మాత్సర్యములనే నా శత్రువులను బట్టి నేల కూల్చు నిజమైన భక్తి వలన కలిగే శక్తిని నాకు ప్రసాదించు నీ బంటుగా నన్ను అనుగ్రహించుము.

నీపై కల భక్తితో కలిగే రోమాంచము (రోమములు నిక్కబొడుచుట) గొప్ప కవచమై, 'రామ భక్తుడు' అనే ముద్ర బిళ్ళ (చిహ్నము/చిరునామా) ధరించి, రామనామము అనే వరము ఖడ్గముగా ధరించి  నీ రామభక్తి సామ్రాజ్యమునందు రాజిల్లుదును. నాకు (త్యాగరాజునకు) అంటి బంటు వంటి కొలువు ఈయుము రామా!

పరిశీలన:
 
సంపదలను, లౌకిక సుఖాలను వదులుకుని  పరదైవాన్ని పరమావధిగా సాధన చేయటానికి త్యాగరాజు భక్తి, కీర్తన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్గమేమి పూల బాట కాదు. విషయ వాంఛలను వదులుకొనుట మానవ జీవితానికి ఆధ్యాత్మిక మార్గములో అతి కష్టమైన పరీక్ష. తన విద్యకు మహారాజులు గుర్తింపు, సన్మానాలు, సత్కారాలు మొదలైనవి ఇంటికి వచ్చినా కూడా వాటిని తిరస్కరించి, పూట గడవటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా ఆయన రాముని పాదములను విడువలేదు. ఈ మనుజుల కాళ్ళ పట్టుకోలేదు, తన నైతిక విలువలకు పూర్తిగా కట్టుబడి ఆదర్శ ప్రాయుడైనాడు. అందుకే ఆయన కీర్తనలలో అంత భక్తి, అసామాన్య వర్ణన, సంపూర్ణ నిజ దాస్యము, శరణాగతి కనిపిస్తాయి. ఎందరు వాగ్గేయ కారులు వచ్చిన, త్యాగయ్య భక్తి, వినమ్రత, దాస్య చిత్తము ముందు దిగదుడుపే.

అటువంటి బంటు లాంటి కొలువు తనకు ఆ శాశ్వత రామ భక్తి సామ్రాజ్యములో ఇవ్వమని ఆ త్యాగబ్రహ్మం హంసనాద రాగంలో కృతి చేశారు. ఎంతోప్రాచుర్యం పొందిన ఈ కీర్తన రామభక్తిని చిహ్నముగా, రామనామమును ఒక మహత్కరమైన ఖడ్గముగా, ఆ భక్తిలో మునుగుట కలిగిన రోమాంచమును  ఒక గొప్ప కవచముగా వర్ణిస్తారు. అరిషడ్వర్గములు అనే శత్రువులను నాశనము చేయుటకు రామభక్తి సామ్రాజ్యానికి దాస్యమే ఏకైక సాధనము అని మనకు సందేశాన్ని ఇచ్చారు త్యాగయ్య.

ఈ త్యాగరాజ స్వామి కీర్తన (ఆలాపన కూడా ఉంది) డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి (సహకార గాత్రం ఆయన ప్రియ శిష్యులు శ్రీ డి.వి. మోహన కృష్ణ గారు).కొంత తెలుగు ఉచ్చారణలో లోపమున్నా, మహారాజపురం సంతానం గారు రాగాన్ని శ్రావ్యంగా ఆలాపించారు. 

24, జనవరి 2011, సోమవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - ఎందరో మహానుభావులు

సంగీత త్రిమూర్తులు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామ శాస్త్రి




పంచరత్న కీర్తనలలో ఆఖరిది ఎందరో మహానుభావులు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క ఆణిముత్యము. మరి చివరిది ఖచ్చితంగా అతి మధురమైనది, అత్యంత ప్రజాదరణ పొందినదే. ఎందుకంటే అందులో భక్తులు, భగవంతుడు - ఇద్దరినీ పూర్తి నిజ దాస భావనతో నుతించారు త్యాగరాజు.  కీర్తన సాహిత్యము, అర్థము, పరిశీలన.

ఎందరో మహానుభావులు అందరికి వందనములు

చందురు వర్ణుని అంద చందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారు (ఎందరో)

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులు (ఎందరో)

మానస వన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారు (ఎందరో)

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారు (ఎందరో)

పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను
బాడుచును సల్లాపముతో స్వర లయాది రాగములు దెలియు వారు (ఎందరో)

హరి గుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో
చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వారు (ఎందరో)

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక
శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు (ఎందరో)

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక (ఎందరో)

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు వారు (ఎందరో)

భాగవత రామాయణ గీతాది శ్రుతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల
గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావ రాగ లయాది
సౌఖ్యముచే చిరాయువుల గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు (ఎందరో)

ప్రేమ ముప్పిరి గొను వేళ నామము దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన వారు (ఎందరో)


అర్థము: 

ఎందరో మహానుభావులు. వారందరికీ నా నమస్కారములు.

పూర్ణ చంద్రుని వలె అందము చందము కల్గిన శ్రీ రాముని తమ హృదయ కమలమున కాంచి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందమున మునిగి యుండు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సామగాన లోలుడు, మన్మథుని సౌందర్యము కలిగిన వాడును అయిన శ్రీరాముని సౌందర్యమును చూసే ధన్యతను పొందిన ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

మనస్సు అనే కోతి యొక్క చంచలమైన స్వభావాన్ని, ఆలోచనలను స్థిరము చేసి, శ్రీరాముని దివ్య రూపమును దర్శనాన్ని బాగుగా పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

వేరే ఆలోచన చేయక, తన హృదయమనే కమలమును ఆ శ్రీ రాముని పాదములకు సమర్పణ చేసే వారెందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పతితపావనుడు, పరాత్పరుడు అయిన శ్రీ రామచంద్రుని పరమార్థమైన సన్మార్గముతో భక్తి కలిగి, స్వరము, లయ మొదలగు సంగీత జ్ఞానముతో కీర్తిస్తూ, భజన చేసే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

శ్రీహరి గుణ గణముల కీర్తనలనే మనులచే పొదగబడిన హారములను గళములో ప్రకాశింప చేసుకొనుచున్న భక్త కోతులు, ఈ భూమిపై కరుణతో, స్నేహ భావముతో ఈ జగమునంతా తీయని చల్లని చూపులచే రక్షించు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

సొగసుల, హొయల నడకలు కలిగినవాడు , సరసుడు, వెన్న వంటి హృదయము కలవాడు అయిన శ్రీరాముని ఎల్లప్పుడూ కన్నులతో చూస్తూ, శరీరము పులకించి, ఆనందమనే సాగరములో ఓలలాడుచు యశము కలవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

పరమ భక్తులు, మునులు, మహర్షులు, సూర్య చంద్రులు, సనక సనందులు, దిక్పాలకులు, దేవతలు, కింపురుషులు, ప్రహ్లాద, నారద తుంబురులు, హనుమంతుడు, శివుడు, శుకుడు, బ్రహ్మ, బ్రాహ్మణులు, పరమ పవిత్రులు, శాశ్వతులు, ఘనులు, శ్రీరామ నామమును చేయుచు బ్రహ్మానందమును ఎల్లపుడు పొందేవారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

 నీ శరీరము, నామము యొక్క వైభవము, నీ శౌర్యము, ధైర్యము, శాంత హృదయము, దాన గుణము మొదలైన వేవ వాక్కుల వంటి నిజాములు నీ యందు అపారమైన భక్తిని కలుగ చేయునవి. నాస్తికులను సైతం ఆస్తికులుగా, శ్రీరామ భక్తులుగా మార్చుతున్నవి. అటువంటి నీ మనస్సును తెలిసి సంతోషముతో నీ గుణగణములను కీర్తించుచు, భక్తి పారవశ్యములో పాడుచు, భజనానందమున, సంతృప్తి పొందే వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

భావతము, రామాయణము, భగవద్గీత, వేదములు, శాస్త్రములు, పురాణములు, వాటి రహస్యములు, శైవము, శాక్తేయము, కుమారము, గణపతి, విష్ణు, సూర్య మొదలగు దేవతా విధానములను పాటించే మతముల యొక్క పరమార్థములను, రహస్యములను తెలిసి, సకల దేవతల అంతరంగముల భావములను తెలిసి, సంగీతము, లయ భావముల ఆనంద సాగరములో మునకలు వేయుచు, చిరంజీవులై నిరవధికమైన సుఖము కలిగిన వారి, త్యాగరాజునికి ఆప్తులైన వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.

ప్రేమ పరిపూర్ణము చెందిన భక్తులు, శ్రీరాముని నామ స్మరణ చేయుచు, శ్రీ త్యాగరాజునిచే నుతింప బడిన, శ్రీ రాముని నిజదాసులైన  వారు ఎందరో మహాను భావులు. వారందరికీ నా నమస్కారములు.


పరిశీలన:

ఈ కీర్తన పూర్తిగా రామ భక్తి సామ్రాజ్యములోని దైవము, దాసుల మహత్త్వమును గురించే. ఆ రాముడి గుణాలు, మహిమల వర్ణన, ఆ రాముని కొలిచే భక్త కోటి యొక్క గొప్పతనం అద్భుతమైన పదజాలంతో, అసామాన్యమైన భక్తి, వినమ్ర భావనతో త్యాగయ్య ఈ కీర్తన రచించారు. రామభక్తిలో మునిగితేలే భక్తుల గుణాలను వివరముగా పది చరణాలలో వర్ణించారు త్యాగయ్య.

అనుపల్లవి, మొదటి చరణం - ఆ రాముని అందమును తమ హృదయములలో చూసి బ్రహ్మానందము పొందేవారు, ధన్యతను పొందేవారు కొందరట. హృదయాన్ని కమలముతో పోల్చటం కవులకు పరిపాటి. ఆ ఉపమానాన్ని అద్భుతంగా తన కీర్తనలలో ఉపయోగించారు కవి త్యాగరాజు. భక్తి పారవశ్యంలో మునిగితే మరి అటువంటి పదాలు ముత్యాల పేర వస్తాయేమో?

మూడవ చరణం గమనించండి. స్వాంతమను సరోజమును సమర్పణము - ఎంత అందమైన భావ వ్యక్తీకరణ? ఎంత మానసిక వికాసము, దైవానుభూతి ఉంటే ఈ పవిత్రమైన శరీరమును, దాని హృదయమును రాముని అర్పించగలము?

నాలుగవ చరణంలో - జీవన సత్యమైన, పరమార్థమైన ఆ రాముని గూర్చి పూర్తి శరణాగతితో రాగము, శృతి, లయలతో పాడుతూ, ఆడుతూ నుతించే వారు ఎంతోమంది. ఈ భావము మీకు ఇప్పుడు కూడా కొంత మంది కళాకారులలో స్పష్టంగా అగుపిస్తుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, బాలమురళీ కృష్ణ వంటి కళాకారులు గానం చేసిన దృశ్య శ్రవణం చూడండి. వారిలో ఇదే తాదాత్మ్యత, కదలికలు, సుస్వర శృతి బద్ధ లక్షణాలు నూరు శాతం కనిపిస్తాయి. అటువంటి మహానుభావులకు ఈ కీర్తన ద్వారా వందనాలు సమర్పించారు త్యాగయ్య వారు.

ఐదవ చరణంలో - ఇటువంటి మహానుభావులు తమ స్నేహ భావముతో, మేధస్సుతో, కరుణతో ఈ కల్లోలిత ప్రపంచముపై చల్లని చూపులు ప్రసరిస్తారుట. ఎంత నిజం చెప్పారు త్యాగయ్య?. భక్తి పారవశ్యంలో మునిగిన ఒక సుబ్బులక్ష్మి వంటి కళాకారిణి కళ్లలో, పాటలో శిలనైనా కరిగించే కరుణ, ప్రేమ కనిపిస్తుంది మనకు.

ఆరవ చరణంలో - సకల సుగుణాభిరాముని, సౌందర్య మూర్తియైన రాముని కదలికలు కళ్ళతో చూస్తూ, శరీరము పులకించి ఆనంద సాగరంలో మునిగి కీర్తి పొందేవారు ఎంతో మంది కళాకారులు. భక్తిలో ఇటువంటి భావన ఎంతో సులభం. సర్వం బ్రహ్మమయం అని భావించి నుతిస్తే ఆ ఆనందం వర్ణనాతీతం అని త్యాగయ్య ఈ చరణంలో హృద్యంగా చెప్పారు.

ఏడవ చరణంలో - ఇక ఎవరూ ఆ మహానుభావులు?  - భక్తులు, మునులు, ఋషులు, దేవతలు, దిక్పాలకులు, వివిధ దేవ సమూహము, స్వయముగా శివుడు, బ్రహ్మ మొదలగు వారు. వీరంతా ఆ శ్రీహరి భక్తి సామ్రాజ్యంలో సేవకులే. ఇటువంటి వారు మరి ఘనులు, శాశ్వతులు, బ్రహ్మానందులు అని మనోజ్ఞమైన పదములు, భావనతో నుతించారు త్యాగయ్య.

ఎనిమిది, తొమ్మిది చరణాలు - ఇంత గొప్ప వైభవమున్న ఆ పరమాత్ముని లక్షణములు ఆస్తికులకు, చెడ్డవారికి కూడా భక్తి భావన కలిగిస్తాయిట. దీనికి మన శృతి శాస్త్ర పురాణాలలోని ఎన్నో గాథలు నిదర్శనము. భాగవతము, రామాయణము, గీత మొదలైన శాస్త్రముల సారము, రహస్యములు, వివిధ మతముల రహస్యములు, ముక్కోటి దేవతల అంతరంగములు తెలుసుకుని రాగము, లయలతో కీర్తించి, నుతించే వారు దీర్ఘాయుష్షు కలిగి త్యాగరాజునికి ఆప్తులు.

మరి త్యాగయ్య, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, వీరి కన్నా  ముందు పురందరదాసు, భక్త రామదాసు, వ్యాసరాయలు - ఇలా ఎంతో మంది పరమాత్మ గుణ కీర్తన చేస్తూ భక్తి సామ్రాజ్యంలో తరించారు. వారందరికీ ఈ కృతి ద్వారా వందనములు. ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో, అనిర్వచనీయమైన అనుభూతిలో, పదాలు ఆ రామునిచే రాయబడినవా అనేంత రమ్యంగా, శ్రావ్యంగా త్యాగరాజు కృతి రచన చేశారు. అందమైన శ్రీరాగంలో ఈ కీర్తన కూర్చబడినది.  హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు గారి గళంలో ఈ కీర్తన విని ఆనందించండి. ఎందరో మహానుభావులు అందరికి వందనములు.

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - కన కన రుచిరా

శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృం
గార  గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో 
త్తారక నామ భద్ర గిరి దాశరథీ! కరుణా పయోనిధీ!

భద్రాచల రామదాసు ఈవిధముగా వంద శ్లోకములతో దాశరథి శతకము రచించి ఆ భద్రాద్రి రాముని నుతించాడు. అదే విధముగా, పంచరత్న కీర్తనలలో నాలుగవది అయిన కన కన రుచిరా పూర్తిగా శ్రీహరి అవతారమైన శ్రీరాముని గుణ రూప మహిమా వర్ణనలో సాగుతుంది. వరాళి రాగం ఆది తాళంలో కృతి చేయబడినది.


సాహిత్యం:

కన కన రుచిరా కనక వసన నిన్ను

దిన దినమున మనసున చనువున నిన్ను (కన)

పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను (కన)

కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను (కన)

బాలార్కాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ (కన)

సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాట వీనుల
జురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదా అటు (కన)

మృగమదలలామ శుభనిటల వర జటాయు మోక్ష ఫలద
పవమానసుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను (కన)

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస
విహారా ఆప్తసురభూజ మానిత గుణాంగ చిదానంద!
ఖగ తురంగ ధృత రథాంగ పరమ దయాకర
కరుణారస వరుణాలయ భయాపహరా శ్రీ రఘుపతే (కన)

కామించి ప్రేమమీర కరముల నీదు పాద కమలముల
బట్టుకొను వాడు సాక్షి, రామనామ రసికుడు, కైలాస
సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక
పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షి గాదా
సుందరేశ సుఖ కలశాంబుధి వాసాఽశ్రితులకే (కన)

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముదహిత వరద నిన్ను (కన)

అర్థము:



బంగారు వస్త్రములు (పీతాంబరములు) ధరించిన ఓ రామా! నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి. నీ యందము ప్రతి దినము నీ యందు గల చనువుతో ఎంత చూసినాను తనివి తీరదు.పాలు గారు మోము గల, అపారమైన మహిమ కలిగిన నీ మోము ఎంత చూస్తే అంత రుచి.కళ కళలాడు సుందరమైన ముఖ కళ కలిగిన సీతా దేవి నిన్ను వాలు చూపుల చూసినప్పుడు నీ సౌందర్యం ఎంత చూస్తే అంత రుచి. ఉదయ సూర్యుని ప్రకాశము కలిగి, పట్టు వస్త్రములు ధరించి, మణులతో పొదిగిన హారములు ధరించి, కమలముల వంటి కన్నులు, అందమైన బుగ్గలు కల, మెరిసే కిరీటమును ధరించిన శ్రీరామా! నిను సంతోషముతో మనసారా ఎంత చూస్తే అంత రుచి. ఉత్తానపాదుడి రెండవ భార్యయైన సురుచి తన సవతి కుమారుడైన ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చొని నందుకు 'నీకు ఆ అర్హత లేదు' అని దుర్భాష లాడెను. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేసెను. ఆ తపస్సుకు మెచ్చి నీవు శాశ్వతమైన ధ్రువ పదమును ప్రసాదించితివి. ఆ నీ శ్రీ హరి సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. ఓ శ్రీ రామా! నీవు శుభప్రదమైన నుదురుపై కస్తూరి తిలకము ధరించి యున్నావు. రావణుని చేతిలో హతుడైన జటాయువుకు మోక్షము ప్రసాదించినావు. హనుమంతుడు దూతయై లంకకు వెళ్లి నీ మహిమను సీతకు తెలపగా, ఆమె అది తెలుసుకొని, ప్రేమతో బాధ పడెను. ఆ విధముగా నిన్ను ఎంత చూస్తే అంత రుచి. ఓ రామా! సౌఖ్యములకు నిలయమా! రాక్షసులను హతమార్చిన వాడా! సీతాదేవి మనసునందు విహరించే వాడా! భూసురులైన బ్రాహ్మణులకు ఆప్తుడా! సాటిలేని సౌందర్యము, సుగుణములు కలవాడా! చిదానంద స్వరూపా! గరుత్మంతుని వాహనముగా కలవాడా! చక్రమును ధరించిన వాడా! పరమ దయాకరా! కరుణా రసమును వర్షించే మేఘము వలె కురిపించే వాడా! భయమును పోగొట్టే వాడా! రఘు వంశములో శ్రేష్ఠుడా! నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.

నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి.

అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.


పరిశీలన: 


ఈ కీర్తన పూర్తిగా రాముని సాకారమును వర్ణనలా కనిపించినా ఆ శుద్ధ చైతన్య స్వరూపుని అగణిత గుణ గణములను, అపార కరుణా రసమును, దయావ్రుష్టిని, ఆశ్రిత జన వాత్సల్యమును ఉదాహరణలతో చెపుతుంది. ధ్రువుని చరిత ఒక చరణంలో ఎంతో అందముగా చెప్పారు త్యాగయ్య వారు. తన భక్తునికి శాశ్వతమైన ధ్రువ పదము ప్రసాదించిన ఆ శ్రీహరి వాత్సల్యము భాగవతములో పోతనగారు అద్భుతముగా వర్ణించారు. ఆ భక్త శిరోమణి ధ్రువుని ప్రస్తావించటం ఈ కీర్తన ద్వారా త్యాగయ్య వ్యక్తపరచిన సందేశానికి పతాకం.

తన భక్తుడైన జటాయువు రావణునితో వీరోచితముగా పోరాడి, కీలకైన ఆ రావణుని వృత్తాంతము రామునికి తెలిపే వరకు కోన ప్రాణములు నిలుపుకొని ఉంటాడు. రెక్కలు తెగి మరణ శయ్యపై ఉన్న ఆ జటాయువుపై రాముడు కరుణించి ఆ పక్షిరాజుకు మోక్షము ప్రసాదిస్తాడు. ఎంతటి అదృష్టము ఆ జటాయువుది?

సీతా మనోహరుడు అయిన శ్రీరాముడు ఆయన సీత కొరకు వెదుకుతూ దుఃఖిస్తూ అడవుల తిరుగుతుంటే ఆయన భక్తుడైన హనుమ ఆయన పాదములను ఆశ్రయించి సీతాదేవిని వేడుకు బృహద్కార్యమును స్వామి ఆశీర్వాదముతో చేపడతాడు. అనన్యసామాన్యమైన సాగర తారకాన్ని రాముని భక్తితో వాయువేగముతో పూర్తి చేసి అరి వీర భయంకరులైన రాక్షసులను ఎదిరిస్తాడు. ఆ సందర్భంలో రెండు మహత్తు గల శ్లోకాలను హనుమంతుని నోట మనకు వాల్మీకి మహాముని వినిపిస్తారు.

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః 

దాసోహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః 
హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజః 

ఆ రాముని పై భక్తి ఆ హనుమంతునికి కొండంత బలము ఇచ్చి ఆ రామ కార్యమును సాధించుటలో ముందుకు నడిపింది. ఆ కార్యములో భాగముగా ఆ హనుమంతుడు సీతామాతను చూచుటే గాక, మహా వీరులైన అక్ష కుమారుడు మొదలగు రావణ సంతతిని సంహరించి ఆ రాక్షస రాజుకు రాముని బల పరాక్రమాల రుచి చూపుతాడు. ఇక తరువాత శత్రు జన సంహారము, అరి వీర భయంకర రామ రావణ యుద్ధము. అట్టి మహత్తు కలది రామ భక్తి.

సీతామాత రాముని నుండి దూరము తాళలేక రావణుడు పెట్టే బాధలు భరించ లేక ప్రాణ త్యాగానికి సిద్ధమైనప్పుడు హనుమంతుడు వచ్చి ఆ రాముని మహిమను కీరిస్తాడు. ఆ మాట రామునితో తన గుర్తులను చెపుతూ కాకాసురుడు మొదలగు విషయాలను ప్రస్తావిస్తుంది. ఆ సందర్భముగా ఆమె చెప్పిన మాటలు రామునిపై ఆమెకు గల అవ్యాజమైన ప్రేమానురాగములకు నిదర్శనము. ఈ మొత్తాన్ని త్యాగయ్య వారు అందముగా ప్రస్తావించారు.

ఈ కీర్తన ద్వారా భక్త జన పరిపాలన, ధర్మ సంరక్షణ, దాసుల పాలిటి దయ, కరుణ, ధర్మ పత్ని పై ప్రేమ ఇలా ఎన్నో ఎన్నలేని గుణములకు నిలయమైన రాముని ఎంతో అందముగా నుతించారు త్యాగరాజు.

ఆ కోదండరాముని స్తుతులతో వేల కృతులు రచించి రామభక్తి సామ్రాజ్యములో తనకు శాశ్వత స్థానం ఏర్పరచు కున్నారు త్యాగ బ్రహ్మ. ఆ మహానుభావునికి మరొకమారు నీరాజనములు.

ఈ పంచరత్న కృతి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

23, జనవరి 2011, ఆదివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - సాధించెనే ఓ మనసా

ఘన రాగ పంచ రత్న కీర్తనలలో మూడవది సాధించెనే ఓ మనసా.  ఈ కీర్తనలో త్యాగరాజు వారు శ్రీ కృష్ణుని నిందా స్తుతి  చేస్తున్నట్టు అనిపిస్తుంది. కృష్ణావతారములో ఆ శ్రీహరి ఎన్నో లీలలను దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు నాటకీయంగా, సామాన్యులకు అందని పద్ధతిలో సాగిస్తాడు. సామ దాన భేద దందోపాయములతో సందర్భోచితంగా మాయా వినోదం చేస్తాడు ఆ కృష్ణుడు. లీల ఏదైనా, సందేశం మాత్రం ధర్మ సంస్థాపనే. అందుకనే, త్యాగరాజు వారు ఈ కృతిలో కొంత నింద, కొంత గుణగణ వర్ణన చేశారు (మన తెలుగు భాషలో సాధన అనే పదానికి ఎన్నో అర్థాలు - అనుకున్న పని చేయుట, ఏదో ఒక కారణముతో ఆడిపోసుకొనుట, ఆధ్యాత్మిక సాధన మొదలైనవి. వీటిలో మొదటిది, రెండవది ఈ కృతికి ఉచితం).  ఆరభిరాగం ఆది తాళంలో ఈ కృతి కూర్చబడినది.


సాహిత్యము:

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గ వచనముల బొంకు జేసి తా బట్టిన పట్టు

సమయానికి తగు మాట లాడనే

దేవకి వసుదేవుల నేగించినటు

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు

గోపి జన మనోరథ మొసంగ లేకనే గేలియు జేసే వాడు

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే పరమాత్ముడదియు గాక
యశోద తనయుడంచు ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండా జన్మ మనఘు డీ కలి
బాధలు దీర్చు వాడనుచు నే హృదంబుజమున జూచు చుండగ

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష
శేష శయన పర నారి సోదర అజ విరాజతురగ రాజ
రాజనుత నిరామయా అపాఘన సరసీరుహ దళాక్ష
యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబర ధర లసన్మకుట కుండల విరాజిత
హరే అనుచు నే పొగడగ త్యాగరాజ గేయుడు
మానవేంద్రుడయిన రామచంద్రుడు

సద్భక్తుల నడత లిట్ల నెనే
అమరికగా నా పూజ కొనెనే, అలుగ వద్దననే
విముఖులతో జేర బోకు మననే వెత గలిగిన తాళుకొమ్మననే
దమశమాది సుఖ దాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
 

అర్థము:

ఓ మనసా! శ్రీ కృష్ణుడు తాను తలపెట్టిన కార్యములను సాధించెనే.

శ్రీ కృష్ణుడు భగవద్గీతలో సన్మార్గమును బోధించెను. కానీ తానే ఆ మాటలను కల్లచేసి, వాటికి భిన్నముగా తాను పట్టిన మొండి పట్టును సాధించుకునెను .

శ్రీ కృష్ణుడు అవసరానికి తగినట్లు, సమయానుకూలముగా మాట్లాడుచు, రాజకీయమును, తన లీలను ప్రకటిస్తున్నట్లు పైకి కనిపించును. (కానీ, దుష్ట శిక్షణ/శిష్ట రక్షణలో తాను తలచిన పనిని నిర్విఘ్నముగా కొనసాగించు కొను సామర్థ్యము కల వాడు). 

కారాగారములో దేవకీ వసుదేవుల బాధకు కారకుడైనట్లు తోచును కాని అది సత్యము కాదు. అది కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో భాగం మాత్రమే.

శ్రీ రంగనాథుడు, గంగానదికి జనకుడు అయిన విష్ణువు సంగీత సాంప్రదాయము కలవాడు.

గోపికల మనోరథం తీర్చకుండా (శ్రీ రాముని కౌగిలించుకోవాలన్న మునుల కోరికను ఆయన మరు జన్మలో, వారు గోపికల అవతారము ఎత్తినప్పుడు తీరుస్తానని వాగ్దానం చేస్తాడు. శ్రీ కృష్ణావతారములో గోపికల ఆ కోరిక తీర్చవలసినది), తిరిగి అపహాస్యము చేసాడు. ఆ విధముగా శ్రీ కృష్ణుడు సమయానికి తగు మాటలాడి తన తలపులను సాధించు కొనెను. (అని త్యాగరాజుల వారు శ్రీకృష్ణుని నిందాస్తుతి చేశారు ఈ చరణంలో)

శ్రీకృష్ణుడు గోపికలను శృంగార పరమైన ఆశలతో అలసిపోవునట్లు చేసి, అలాగే, తాను యశోద తనయుడు కాదు అనే సత్యము తెలిసి కూడా యశోద తనను తల్లిలా భావించి ముద్దు పెట్టగా శ్రీ కృష్ణ పరమాత్మ యశోద అమాయకత్వమును చూచి నవ్వుచుండును.

శ్రీకృష్ణుడు తన భక్తులను వాత్సల్యముతో కాపాడుతున్నాడు. సుగుణముల సాగరమైన వాడు, జన్మ జన్మలకు పుణ్యమూర్తి, కలియుగములో మన బాధలను తీర్చేవాడు  అని మనమందరమూ మనసులో భావిస్తున్నప్పుడు, దానికి భిన్నముగా ఆయన మనలను కాపాడుట లేదు (అని త్యాగరాజు నిందాస్తుతి చేస్తున్నాడు).

ఓ శ్రీరామా! నీవు పాపలను హరించే వాడవు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, వెలుగును ఇస్తూ చంద్రునిలా ప్రకాశించే వాడవు. రఘువంశమునకు నాయకుడవు. మృదు భాషివి. ఆదిశేషుని పై శయనింతువు. పరస్త్రీలను సోదరుని వలె కాపాడుడువు. పుట్టుక లేని వాడవు. వాహనమైన గరుత్మంతునిపై విహరిస్తూ ప్రకాశించేడవు. రారాజులచే పొగడబడిన వాడవు. అసమానమైన శరీర కాంతి కలవాడవు. కమలదలముల వంటి కనులు కలవాడవు అని అనేక విధముల నేను నిన్న వేడుకొనుచుండగా నీవు నన్ను రక్షించక సాధించుచున్నావు.

ఓ రామా! నీవు వేంకటేశ్వరుడవు. సుప్రకాశకుడవు. సర్వోన్నతుడవు. మంచివారి హృదయములలో నివసించే వాడవు. పీతాంబరమును ధరించిన వాడవు. మెరిసే కిరీటము, కర్నాభారమునులు కలిగి ప్రకాశించువాడవు. ఓ శ్రీహరీ! నిన్ను పైవిధముగా అనేక విధముల నిత్యము కీర్తించు చున్నాను. నీవు నా కీర్తన రూపుడవు. మానవులలో శ్రేష్ఠుడవు. ఇట్టి నా కీర్తనలు నీవు పెడచెవిన పెట్టి నన్ను సాధించుచున్నావు.

శ్రీరాముడు త్యాగరాజుని దగ్గరకు రాక, దూరముగా ఉండి, ఎన్నో బోధనలు చేసి, త్యాగరాజు యొక్క ప్రవర్తనను మెచ్చు కొనెను. సద్భక్తుడని మెచ్చు కొనెను. అలుగవద్దని చెప్పెను. నాస్తికులతో కూడవద్దని, శాంతము, ఇంద్రియ నిగ్రహము కలిగియుండమని, కష్టమును ఓర్చుకోమని శ్రీరాముడు స్వయముగా త్యాగరాజు తో మాట్లాడినట్లు భావము.


పరిశీలన: 

నిందాస్తుతి కావ్య, కృతి రచనలో ఒక శైలి. మానవునిలో సహజమైన ద్వంద్వ భావమునకు అక్షర రూపము ఈ నిందాస్తుతి. సాధనలో ధ్యేయ ప్రాప్తి ఆలస్యమవుతున్న కొలదీ ఆవేదన, అసహనము, ప్రశ్న మొలకెత్తటం  మానవ జన్మకు సహజం. అది కావ్య రూపములో ఒక పక్క ప్రశంస మరొక పక్క ప్రశ్నార్థకమైన నింద. ఈ ప్రక్రియను త్యాగరాజు వారు ఈ   కృతిలో ఉపయోగించారు.

ఆ శ్రీ కృష్ణుని పుట్టుకే ఒక నాటకం. కంసుని చంపటానికి దేవకికి ఏడు గర్భములు, ఆ బిడ్డల చంపబడుట ఏల? చెల్లెలి అష్టమ గర్భము తనను చంపుతాడనే భయముతో మొత్తము మధురా పట్టణములో ఆ వయసు పిల్లలను చంపించుట ఏల?  అసలు దేవకీ వసుదేవలంతటి మంచి వారికి కారాగార వాసమేల?  ఇన్ని జరిగిన తరువాత - నడి రేయి వసుదేవునిచే మోయబడి యమునను దాటి నందగోకులం చేరుట ఏల?. ఒక్క కంసుని చంపుట అనే దుష్ట శిక్షణకు ఇంత రంగము ఎందుకో? ఇవన్నీ మానవాళికి పాఠములే. భూమి, మానవాళి భరించలేని క్రౌర్యము, దౌష్ట్యము, రాక్షసత్వమును అంతమొందాలంటే దానికి అవతారము, సరైన పరిస్థితులు కావాలి. అవి ఆయన స్వయంగా కావలసినట్టుగా ఏర్పరచుకుంటాడు. దానికి ప్రతి అవతారము ఒక ఉదాహరణ.

ఒక పక్క ఆ శ్రీ కృష్ణుని, రాముని గుణ గణములను, మహిమలను వర్ణిస్తూనే  మరొక పక్క నేను ఎన్నో విధముల పొగడుతున్న నన్ను బ్రోవుట లేదు అని నిందిస్తున్నారు త్యాగరాజుల వారు.మాయ మానుష రూపుడైన శ్రీ కృష్ణుడి లీలను ఎన్ని? విశ్వాత్మ యైన శ్రీ హరి బాలుడిలా యశోదను మురిపిస్తూ, అల్లరి పనులు చేస్తూ, తల్లిచే దండను పొంది, మరల వెంటనే లాలన పొంది, మరల అంతలోనే నోట విశ్వమును చూపించి ఆ యశోద జన్మను ధన్యము చేసినాడు. అట్టి లీలను చూస్తే ఆయన అంతరార్థము తెలుసుకొనుట ఎంతో కష్టం. పాలు తాగుతున్నట్టు నటిస్తూ పూతనను సంహరించటం, తల్లి తన అల్లరిని భరించలేక రోకటికి కట్టి వేస్తే, రోకటితో సహా పాకుతూ వెళ్లి సాల వృక్షములను కూల్చి నలకూబరుల శాపము తీర్చాడు.

అలాగే, గోపికలు, గోపబాలకులు, గోప స్త్రీలతో రాసలీలలు, వస్త్రాపహరణము, కాళీయ మర్దనం, గోవర్ధనోద్ధరణ, ద్రౌపదీ మాన రక్షణ - ఇలా, ఎన్ని లీలలో? చేసే పని ఒకటి వాటి వెనక కార్యం, అంతరార్థము ఇంకొకటి. అందుకనే ఆయనను లీలా వినోదుడు అయ్యాడు. ఈ లీలను తెలియాలంటే ఆ పరమాత్మను తెలుసుకోవాల్సిందే. భాగవత, మహాభారతాల్లో ఆ శ్రీకృష్ణుని అంతరార్థము మనకు పూర్తిగా చెప్పబడింది. ఇన్ని జరిగిన తరువాత కూడా, అర్జునుడు తన కర్తవ్యమును మరచి యుద్ధభూమి నుండి వెను దిరిగే సమయములో, ఆయన పూర్తి కర్తవ్య బోధ, జనన మరణ రహస్యము, యోగము, సిద్ధి గురు రూపములో 'గీత'గా తెలిపి, విశ్వరూపమును చూపిస్తాడు.  అందుకే కృష్ణ తత్త్వము తెలుసుకుంటే మోక్షము ముంగిట ఉన్నట్లే అని పెద్దలు చెప్పారు.

ఈ భావనను నిందాస్తుతి రూపంలో అందంగా కృతి రూపం చేశారు త్యాగయ్య. కీర్తన చివరలో, మళ్లీ ఆ శ్రీరాముడే తనకు మార్గము చూపినట్లుగా, తనను ఉద్ధరించినట్లుగా ముగిస్తారు త్యాగయ్య.  ఒకరకంగా ఈ కీర్తన పూర్తి మాయా మానుష తత్త్వమును వివరిస్తుంది. ఆ మహానుభావునికి మరోసారి నీరాజనాలు.  ఈ కీర్తనను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

(తెలుగు తెలియని చాలా మంది కళాకారులు 'సమయానికి తగువు మాటలాడెనే' అని ఆలపిస్తారు. అది అర్థాన్ని పూర్తిగా మార్చేసి విపరీతార్థం తెస్తుంది. కాబట్టి, తెలుగు భాష నేర్చుకుని,  'సమయానికి తగు మాటలాడెనే' అని పాడవలసినదిగా విజ్ఞప్తి).

22, జనవరి 2011, శనివారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - దుడుకు గల నన్నే

ఎన్నాళ్ళైనా ఆ రాముడు తనను బ్రోవుట లేదని త్యాగరాజ స్వామి తనలో ఏమైనా లోపముందేమో అని బాహ్య ప్రపంచములో ఉన్న మానవులు చేస్తున్న తప్పిదాలను తనకు ఆపాదించుకుని ఈ కీర్తన రాసినట్టు కనిపిస్తున్నది. ఈ సమాజంలో ఉన్న దుర్విషయములు, వ్యసనములతో ఇతరులు చేస్తున్న కాల వ్యర్థమును ఈ కీర్తనలో తనను పాత్రధారిగా చేసుకుని త్యాగయ్య అద్భుతంగా వివరించారు. లేకుంటే రాముని సేవ కొరకు మహారాజుల కానుకలు, ఆస్థాన మర్యాదలు, భోగములు వదులుకున్న మహానుభావుడు దుడుకుగల వ్యక్తి ఎలా అవుతాడు?.

నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగా బల్కు మనసా అని తన మానసిక భావాన్ని వ్యక్త పరచిన వాగ్గేయకారుడు పేదరికంలో రాముని సేవయే పెన్నిధి అని జీవించి తరించాడు. ఆ రాముడు తనను ఇంకను కరుణించ లేదని దుర్లక్షణాలను తనలో ఉన్నాయేమో అని ఈ కీర్తనలో చెపుతున్నారు త్యాగయ్య. గౌళ రాగం ఆదితాళం తో కట్టబడింది ఈ పంచ రత్న కీర్తన.


సాహిత్యము:

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో

కడు దుర్విషయాకృష్టుడై గడియ గడియకు నిండారు

శ్రీ వనితా హృత్కుముదాబ్జ అవాంగ్మానస గోచర |దుడుకు గల|

సకల భూతముల యందు నీ వైయుండగ మదిలేక పోయిన |దుడుకు గల|

చిరుత ప్రాయము నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన |దుడుకు గల|

పర ధనముల కొరకు నొరుల మది కరగబలికి కడుపు నింప తిరిగినట్టి |దుడుకు గల|

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే అనుచు సదా దినములు గడిపే |దుడుకు గల|

తెలియని నటవిటక్షుద్రులు వనితలు స్వవశమగుట కుపదేశించి 
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై సుభక్తులకు సమానమను |దుడుకు గల|

దృష్టికి సారంబగు లలనా సదనాఽర్భక సేనాఽమిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాక నీ పదాబ్జ భజనంబు మరచిన  |దుడుకు గల|

చక్కని ముఖ కమలంబును సదా నా మదిలో స్మరణ లేక నే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి
దుర్విషయ దురాశలను రోయలేక, సతతమపరాధినై, చపల చిత్తుడనైన |దుడుకు గల|

మానవతను దుర్లభ మనుచు, నెంచి, పరమానందమొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు |దుడుకు గల|

సతులకై కొన్నాళ్ళాస్తికై సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితినయ్య త్యాగరాజాప్త ఇటువంటి |దుడుకు గల|


అర్థము:
దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?  అనుక్షణము, ఎడతెగక, చెడ్డ పనులతో నా మనస్సు నిండి యున్నది. ఈ చెడ్డ బుద్ధి నన్ను చుట్టుకుని యున్నది. అటువంటి నన్ను ఏ దొర కొడుకు (రాజ కుమారుడైన రాముడు) బ్రోచును? 

ఓ శ్రీ రామా! నీవు లక్ష్మీ దేవి యొక్క హృదయ పద్మములా ఉన్నావు. వాక్కు చేతగాని, మనసుచేత గానీ గోచరము కావు నీవు. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

 ప్రపంచము నందు గల ప్రతి వస్తువులో నీవే యున్నావు. కానీ నాలో లేకపోవుట కేవలం నా దుర్మార్గపు ప్రవర్తన వలననే అని భావిస్తున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

చిన్నతనము నుండి అమృత రసము వంటి నీ భజన యొక్క మహిమ తెలియలేక చేదు వాదనలు చేస్తున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఇతరుల ధనము కొరకు వారి వద్ద చేరి ప్రియమైన మాటలతో, పొగడ్తలతో వారి మనసును సంతోషింప చేసి వారిచ్చు ధనమునకు ఆశపడే దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మనసులో ఈ ప్రాపంచిక సుఖమే పరమావధిగా భావించి ఎల్లపుడు సమయము గడుపుతున్న దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

అమాయకులు, అజ్ఞానులు, నటులు, విటులు, క్షుద్రులు మొదలైన వారి వద్ద జ్ఞానిగా నటించి వారికి బోధలు చేసి వారిని తన శిష్యులుగా చేసుకుని వారిని తన అదుపులో ఉంచుకుని సంతోషముగా యున్నాను. తనకు స్వర లయ జ్ఞానములు లేకనే తానొక గొప్ప విద్వాంసుడని అనుకుని ఇతరులను తాను మహా భక్తుడనని కూడా భ్రమింప చేసినాను. ఇట్టి దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

ఓ దేవాది దేవ! అందమైన వనితా, ఇల్లు, పిల్లలు, సేవకులు, అమిత ధనము, ఆస్తి మొదలైన అశాశ్వతములైన ప్రాపంచిక కోరికల యందు ఆసక్తి కలిగి, అవియే సర్వస్వముగా భావించి  నీ పాదములను భక్తితో భజన చేయుట మరచిన, దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

గర్వముచే గుడ్డియైన వారితో స్నేహము చేసి, చెడ్డ పనులు చేయుచు, దురాశలను వదల లేక దుర్మార్గుడునై యుండుట చేత నీ చక్కని కమలము వంటి ముఖమును ఎల్లప్పుడూ నా మదిలో స్మరించ లేకుండుంటిని. నా ప్రవర్తనకు నేను చింతిస్తున్నాను. నా చపల చిత్తమును నిగ్రహించుకోలేకున్నాను. పశ్చాత్తాపము నన్ను దహించుచున్నది. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

మానవ జన్మను పొందుట ఎంతో కష్టము. అటువంటి అదృష్టము కలిగినందుకు సంతోషించక - గర్వము, ఈర్ష్య, కామము, క్రోధము, పిసినారి తనము, మొదలగు దురాలోచనలకు, చెడు కార్యములకు లొంగిపోయి మోసపోతిని. జ్ఞానమే పరమావధిగా కలిగిన కులములో పుట్టి కూడా అజ్ఞానినై ప్రవర్తిన్చితిని. ఇటువంటి విషయములను అసహ్యించుకొనక, మొత్తం తలక్రిందులై నేను కూడా వాటినే చేయు యున్నాను. దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

యౌవనములో భార్యల కొరకు, మరి కొన్నాళ్ళు ఆస్తుల కొరకు, మరి కొన్నాళ్ళు పిల్లల కొరకు, ధనము కొరకు జీవన సమయమంతా వ్యర్థము చేస్తూ తిరిగితిని. ఓ త్యాగరాజునికి ఆప్తుడవైన రామా! దుడుకుగల నన్ను ఏ భగవంతుడు రక్షించును?

పరిశీలన: 
మానవ జన్మ ఎత్తుట మనకు భగవంతుడు ఆయనను తెలుసుకొనుటకు ఇచ్చిన మహదవకాశం.  కానీ, జీవిత సమయమంతా, విషయ వాంఛలలో, దుర్వ్యసనములలో, చెడు ఆలోచనలో దుర్వినియోగము చేసి, ఆ పరమాత్మను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని చేజేతులా పోగొట్టుకుని మరల మరల ఈ భువిపై పశువుల, క్రిమి కీటకములలా పుట్టి, మరణించి మళ్లీ మళ్లీ  జన్మలెత్తుతూ విషయ పాప చక్రములో బంధించ బడుతున్నాము. ఈ భావననే త్యాగరాజుల వారు ఈ కీర్తన ద్వారా, తననే ఉదాహరణగా, పాత్రగా తీసుకుని మానవ జన్మను వివరించారు. 

శారీరిక వాంఛలు, ధన సముపార్జన - వీటి కొరకు ఆరు దుర్లక్షణములకు (కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము) లోనై, ఇతరులను హింసించి, తాన దైవత్వమును మరింత దిగజార్చుకుని, మళ్లీ మళ్లీ అదే ఊబిలో చిక్కుకుని ఉన్నాడు మానవుడు. అస్థిరములైన యౌవనము, కామము, ధనము, భార్యా బిడ్డల కొరకు శాశ్వతమైన దేవుని తెలుసుకునే మార్గమును వదులుకోవాలా?. అలాగని మనకు మనము చేస్తున్నది తప్పని తెలియక కాదు. తెలిసి, లోపల పశ్చాత్తాప పడుతూ, అధిగమించటానికి ఆశక్తులమై ఉంటాము. ఇటువంటి సమయములోనే, మనకు దారి చూపటానికి గురువులు కావాలి. వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ మనలను సరైన మార్గములో నడిపించి, లోపాలను సరిదిద్దుతూ భగవంతుని మార్గములో నడిపిస్తుంది. 

మనలో ప్రతి వారికి ఒక గమ్యము ఉంది. అది మనము ఏమిటి, మనలో ఉన్న బ్రహ్మము ఏమిటి అని తెలుసుకొనుట. దాని కొరకే మనకు వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ, చదువు, సంస్కారములు, పురుషార్థములు కలిపించబడ్డాయి. వాటిని వదలి, ఆత్మ విమర్శ లేక, నిరంతరమూ నటిస్తూ, తనలోని శుద్ధ తత్త్వముపై తొలగించటానికి అతి కష్టమైన పొరలను కప్పివేస్తాడు మానవుడు. ఇంతటి దుడుకుతనము గల నన్ను (మనలను) ఏ రాముడు రక్షిస్తాడు? కాబట్టి మన ధర్మానికి కట్టుబడి, వాటిని నిర్వర్తిస్తూ, మనకు ఇచ్చిన జన్మను శాశ్వతమైన ఆ ప్రభువును తెలుసుకొనుటకు ఉపయోగిస్తే, ఆయనే మనలను కాపాడుతాడు అని త్యాగయ్య సందేశం.

నా ఉద్దేశంలో పంచరత్న కీర్తనలలో అత్యున్నత ఆధ్యాత్మిక సందేశము కలది ఈ కృతి. బాలమురళీకృష్ణ గారి గళంలో విని, సందేశాన్ని అర్థం చేసుకుని తరిద్దాం.

21, జనవరి 2011, శుక్రవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన -జగదానంద కారక

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః 
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం 
బ్రహ్మా నారద వచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే 

సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు.


మహా వాగ్గేయకారుడు, అపర నారదుడు, అనుపమ రామభక్తుడు అయిన త్యాగరాజస్వామి వారు ఆ రామునిలో ఐక్యమైన రోజు పుష్య బహుళ పంచమి. ప్రతి సంవత్సరం దీన్ని పురస్కరించుకొని ఆయన జన్మ స్థలమైన తిరువాయూర్ తో పాటు ప్రపంచమంతా ఐదు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుపుతారు. ఆయా ఊళ్లలో కళాకారులు ఆ మహానుభావుని సంకీర్తనలను గానం చేసి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అందులో భాగంగా ఈ పుష్య బహుళ పంచమి నాడు ఆయన రచించిన ఘన రాగ పంచరత్న కృతులు బృంద గానం చేస్తారు.

ఈ ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటిది జగదానంద కారక. ఇది నాట రాగం, ఆది తాళంలో  స్వర పరచబడినది. రాగ లక్షణాలను పక్కకు పెట్టి ఇందులోని సాహిత్యపు విలువలను, వర్ణనను పరిశీలిద్దాము. మొదట సాహిత్యము, అటు పిమ్మట అర్థము, చివర పరిశీలన.

సాహిత్యము:

జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల |జగదానంద|

అమర తారక నిచయ కుముదహిత, పరిపూర్ణ అనఘ సుర, సురభూజ
దధి పయోధి వాస, హరణ, సుందరతర వదన సుధామయ వచో
బృంద, గోవింద సానంద, మావర, అజర, ఆప్త, శుభకరా అనేక |జగదానంద|

నిగమ నీరజా అమృతజ పోషకా అనిమిష వైరి వారిద, సమీరణ,
ఖగతురంగ, సత్కవి హృదాలయ అగణిత వానరాధిప నతాంఘ్రి యుగ |జగదానంద|

ఇంద్ర నీలమణి సన్నిభాఽపఘన చంద్రసూర్య నయన అప్రమేయ వా-
గీంద్ర జనక, సకలేశ సుభ్ర నాగేంద్ర శయన, శమన వైరి సన్నుత |జగదానంద|

కరధృత శరజాల, అసుర మదాపహరణ, అవనీసుర సురావన,
కవీన బిలజమౌని కృత చరిత్ర, సన్నుత శ్రీ త్యాగరాజనుత |జగదానంద|

సృష్టి స్థిత్యంతకారక, అమితకామిత ఫలద, అసమాన గాత్ర,
శచీపతి నుతా, అబ్ధి మదహర, అనురాగ రాగరాజిత కథాసార, హిత |జగదానంద|

పాద విజిత మౌనిశాప సవపరిపాల వరమంత్ర గ్రహణ లోల
పరమశాంత చిత్త జనకజ, అధిప సరోజభవ వరద, అఖిల |జగదానంద|

పురాణ పురుష, నృవరాత్మజాశ్రిత పరాధీన ఖర విరాధరావణ
విరావణ అనఘ పరాశర మనోహర అవికృత త్యాగరాజ సన్నుత |జగదానంద|

సజ్జన మానసాబ్ధి సుధాకర, కుసుమ విమాన, సురసారిపు కరాబ్జ
లాలిత చరణా అవగుణ అసురగణ మదహరణ సనాతన, అజనుత |జగదానంద|

ఓంకార పంజరకీర, పురహర, సరోజభవ, కేశవ, ఆదిరూప
వాసవరిపు జనకాంతక, కలాధర, కలాధరాప్త, ఘృణాకర,
శరణాగత జనపాలన, సుమనో రమణ, నిర్వికార నిగమ సారతర |జగదానంద|

అగణితగుణ, కనకచేల, సాల విదళన, అరుణాభ, అసమాన చరణ,
అపార మహిమ, అద్భుత సుకవిజన హృత్సదన, సుర మునిగణ విహిత,
కలశ నీరనిధిజ, రమణ పాపగజ, నృసింహ వర త్యాగరాజాధినుత |జగదానంద|


అర్థము:

(ఇక్కడ త్యాగరాజ సన్నుత/నుత అన్నప్పుడల్లా త్యాగయ్యగా  కన్నా శివునిగా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది)

జగము యొక్క ఆనందమునకు కారకుడా! సీతాపతీ! శ్రీరామా! నీకు జయము.

నింగికి రాజైన సూర్యుని వంశములో జన్మించిన ఓ శ్రీ రామా! రాజులకు రారాజువు నీవు.  సుగుణములకు రూపము నీవు, దేవతలచే సేవించబడిన వాడవు, ఎల్లప్పుడూ సకల ఆనందములను, శుభములను కలిగించే వాడవు.

ఓ శ్రీ రామా! నీవు దేవతలనే నక్షత్ర సమూహానికి చంద్రుని వంటి వాడవు, పరిపూర్ణుడవు. పాపములు లేని వాడవు. పుణ్య రూపుడవు, దేవతలకు కల్పతరువు వంటి వాడవు. పాలు, పెరుగుల మధ్య పెరిగిన వాడవు, వాటిని దొంగిలించిన బాల కృష్ణుడవు. అందమైన ముఖము కలవాడవు, అమృతము వంటి మాటలు పలికెడి వాడవు. ఆవులను రక్షించేవాడవు, గోపాలుడవు, లక్ష్మీ పతివి, నిత్య యౌవ్వనుడవు, దేవతలకు, సమస్త జీవ కోటికి ఆప్తుడవు,  శుభకరుడవు. అనేక విధముల జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామ! నీవు వేదములను పద్మముల నుండి జన్మించిన అమృతమును (శ్రుతులు, ఉపనిషత్తులు, పురాణములు) పోషించు చున్నావు. దేవతలకు శత్రువులను మేఘాలను చెల్లాచెదరు చేసే గాలి వలె   వారించుచున్నావు. గరుత్మంతుని వాహనముగా కలవాడవు. గొప్ప కవుల హృదయములలో నివసించేవాడవు. వానర వీరులైన సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు మొదలగు వారిచే పూజించబడిన పాదములు కలిగిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా! ఇంద్రుని నీలమణి వంటి శరీర ప్రకాశముతో వెలుగుతున్నావు. సూర్యచంద్రులు నీ రెండు కన్నులుగా కలవాడవు.  సాటిలేని దైవము నీవు. వేదములను సృష్టించిన బ్రహ్మకు  తండ్రివి. సర్వేశ్వరుడవు. కల్మషము లేని వాడవు. ఆదిశేషుని పై శయనించిన వాడవు.కాలుడైన యమునికి కాలుడైన శివునిచే పూజించబడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ రామా! నీవు భుజములపై బాణములు ధరించి  రాక్షసుల గర్వమును పోగొట్టుదువు. బ్రాహ్మణులను, దేవతలను రక్షించెదవు. కవికోకిలయైన వాల్మీకి రచించిన రామాయణమున నాయకునిగా ప్రకాశించి పొగడబడిన వాడవు. శుభకరుడైన శివునిచే (త్యాగరాజుచే) పొగడబడి పూజించ బడినవాడవు. నీవు జగదానంద కారకుడవు.

సృష్టి, జీవనము, అంతము నీవే సమర్థవంతముగా చేసెదవు. అశేషమైన కోరికలను తీర్చేదావు. అనుపమానమైన దేహకాంతి కలవాడవు. ఇంద్రునిచే పొగడబడిన వాడవు. సముద్రుని గర్వము అణచిన వాడవు. ప్రేమ, మధురమైన పదములు, అనురాగము మొదలైన వాటితో ప్రకాశించే రామాయణమునకు సారము నీవే. సమస్త లోకములకు హితుడవు నీవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీరామా! నీ పాద స్పర్శచే పతియగు గౌతమ మునిచే శాపము పొందిన అహల్యకు శాప విమోచనము కలిగించి బ్రోచితివి. విశ్వామిత్రుని యాగ రక్షణ సమయమున వారిచే మహామంత్ర రూపమున బల, అతి బల విద్యలను, అనేక అస్త్ర శాస్త్రములను స్వీకరించి విజయమును పొందితివి. నిరంతరము శాంత చిత్తుడవై యుందువు. నీవు సీతాపతివి. బ్రహ్మదేవునకు వరములు ప్రసాదిన్చితివి. నీవు సమస్త జగములకు ఆనందమును ఇచ్చుచున్నావు. నీవు జగదానంద కారకుడవు.

 ఓ రామా! నీవు పురాణ పురుషుడవు. నరపతి అయిన దశరథుని కుమారుడవు. నిన్ను శరణు కోరిన భక్తుల ఆధీనములో ఉందువు. ఖరుడు, విరాధుడు, రావణుడు మొదలగు రాక్షసులను సంహరించిన వాడవు, పాపములు లేని వాడవు, పరాశరుని మనస్సు దోచిన వాడవు. సుందరమైన రూపము కలవాడవు. పరమశివునిచే (త్యాగరాజుచే) నుతించ బడిన వాడవు. నీవు జగదానంద కారకుడవు.

ఓ శ్రీ రామా!  నీవు మంచి వారి మనసు అనే సముద్రమునకు చంద్రుని వంటి వాడవు. పుష్పక విమానము పొందిన వాడవు. సురస అనే రాక్షసిని జయించిన హనుమంతుని చేత లాలించబడు చరణయుగములు కలవాడవు. దుర్గుణములు కలిగిన రాక్షస సమూహముల గర్వమును అణచిన వాడవు. శాశ్వతుడవు. బ్రహ్మచే నుతించ బడిన వాడవు.

ఓ రామా! నీవు ప్రణవ నాద (ఓంకార) స్వరూపుడవు. నీవు జగత్తు అనే పంజరములో చిలుకగా పరమాత్మవై ఉన్నావు. త్రిమూర్తుల రూపము నీవు.త్రిమూర్త్యాత్మకుడవు. ఇంద్రుని శత్రువగు ఇంద్రజిత్తు తండ్రియైన రావణుని జయించిన వాడవు. కళారూపుడవు. చంద్రుని తలపై ధరించిన శివుని స్నేహితుడవు. దయాకరుడవు. శరణాగతులను రక్షించిన వాడవు. దేవతలకు అధిపతివి. వికృతిలేని వాడవు. వేదముల సారమును మించిన సారము కలవాడవు. నీవు జగదానంద కారకుడవు.

శ్రీరామా! నీవు ఎన్నో మంచి గుణములు కలవాడవు. బంగారు వస్త్రములు (పీతాంబరము) ధరించిన వాడవు. కృష్ణుని అవతారములో సాల వృక్షములను చేదించిన వాడవు. ఎర్రటి రంగు గల పాదములు కలవాడవు. గొప్ప మహిమ కలిగిన వాడవు. అద్భుతమైన మంచి కవుల హృదయ కమలములందు నివసించే వాడవు. దేవతలకు మునులకు హితము చేసే వాడవు. పాల సముద్రములో లక్ష్మీ రమణుడవు. పాపము అను ఏనుగును వధించిన నర శార్దూలము నీవు. మహానుభావుడైన శంకరునిచే (త్యాగరాజుచే) నుతించబడిన వాడవు.  నీవు జగదానంద కారకుడవు.

పరిశీలన: 

ఈ కీర్తనలో త్యాగరాజ స్వామి రాముని అనంతమైన గుణగణములను ప్రాకృత భాషలో వర్ణించారు. సంస్కృతం ఈ కీర్తనను మనోజ్ఞం చేసింది. విశేషమైన పదప్రయోగము, లోతైన భావ వ్యక్తీకరణ ఈ కీర్తన ప్రత్యేకత.

ఈ కీర్తన ద్వారా త్యాగయ్య ఆధ్యాత్మిక సంపదగా రాముని పర తత్త్వాన్ని, వేద సార రూపమును, వేదములలో నుతించబడుటను, ఏకాక్షర బ్రహ్మ స్వరూపమును, సచ్చిదానంద కారకమును, నిష్కల్మషమును, భక్తజన పరిపాలనను, శాంత చిత్తమును, త్రిమూర్త్యాత్మక రూపమును, సృష్టిస్థితిలయ కారకమును, నిత్య యౌవన, సనాతన తత్త్వమును ముందుంచారు .

ఈ కీర్తనలో త్యాగయ్య రాముని గుణగణ, మహిమల వర్ణనకు ఆయన శాంతమూర్తిని, సౌశీల్యమును, భక్తజన లోలతను, ఆనంద కారకమును, ఆ శ్రీహరి అవతారములైన కృష్ణుని లీలలో వెన్న దొంగతనాన్ని, గోపాలనమును, గోరక్షణను, ఉదాత్త హృదయతను, వానరముఖ్యులచే, శివునిచే, బ్రహ్మచే, వాల్మీకిచే,ఇంద్రునిచే నుతించ బడుటను, అహల్యా శాపవిమోచనమును మనోహరముగా మన ముందుంచారు. ఇక రూప వర్ణనకు వస్తే - ఆయన అసాధారణ లావణ్యము, అందమైన ముఖము, అమృత తుల్యమైన, తీయని మాటలు, నిత్య యౌవనము,  మృదు భాషణను, విశేష శరీర కాంతిని గొప్పగా చెప్పారు త్యాగయ్య.

రాముడు ఎంత శాంతుడో, ధర్మ రక్షణకు అంతే అరివీర భయంకరుడు అని చెప్పటానికి త్యాగయ్య ఈ కీర్తనలో కాల మేఘముల పాలిటి మారుతముగా, సూర్యచంద్ర నేత్రునిగా, బలాతిబాల విద్యలతో విశ్వామిత్రుని యాగ రక్షకునిగా, అఖండ శరసంపదతో రాక్షస సమూహాన్ని నాశనం చేసిన వాడిగా, లంక చేరుటకై సముద్రం దాటు సమయమున సముద్రుని గర్వము అణచుట, ఖర దూషణుల, రావణుని చంపిన శౌర్యము, సాల వృక్షముల చేదించిన ఏకాగ్రత, బలము, పాపమనే మహా ఏనుగును సంహరించే ఏకైక సాధమనే సింహముగా వర్ణించారు.

మొత్తం మీద - గుణములను, మహిమలను,పర తత్త్వమును అద్భుతముగా, సంపూర్ణముగా ప్రస్తుతించారు త్యాగయ్య. అందుకే ఇది ఘన రాగా పంచ కీర్తనగా పేరొందింది. సుస్వరలక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో ఈ కృతి వినండి. ఆ మహానుభావునికి ఆరాధనోత్సవాల సందర్భంగా  మహా నివాళి. సద్గురు త్యాగరాజ భక్తి సాహిత్యా సంగీత పరంపర అనంత గంగా ప్రవాహంలా ఎల్లప్పుడూ కొనసాగేల మనందరమూ ప్రయత్నిద్దాము.

20, జనవరి 2011, గురువారం

శ్రీమచ్ఛంకరభగవత్పాద కృత సాధనా పంచకం - తాత్పర్యము

మానవ జన్మ పరమార్థము మనము ఏమిటో తెలుసుకొని, పాప ప్రక్షాళన చేసుకొని, పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, ఆ పరబ్రహ్మమును అనుభూతి పొంది, ఆ సచ్చిదానంద స్థితిలో ఉండటం. ఇది ఒకరోజులో అలవాటు అయ్యేది కాదు, అనుభూతి పొందేది కాదు. నిరంతర కఠోర సాధన అత్యంత ఆవశ్యకం. మరి ఈ అనంతమైన భవసాగరంలో మునిగి తేలే మనకు ఏది సరైన మార్గము?.

దీనికోసమే శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

జగద్గురువు అనుగ్రహమే నేటి భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యము

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.

కాబట్టి, ఈ సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. దీన్నే షిర్డీ సాయిబాబా వంటి సద్గురువులు మనకు అరటి పండులా ఒలిచి చెప్పారు. వివేకానంద వంటి వేదాంతులు ఘోషించారు. ఆధ్యాత్మిక సంపాదకు మనకు ఏమి కొరత లేదు. కానీ, దానిని ఉపయోగించుకుని, ఆచరణలో పెట్టే చిత్తశుద్ధి, త్యాగనిరతి లేదు. వీటిని దాటితే, మనకు ఎదురు లేదు.

ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.  జయ జయ శంకర! హర హర శంకర!

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మా 

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం  ౧

వేదములను నిత్యము అధ్యయనం చేద్దాము. వాటిలో చెప్పబడిన కర్మలను అనుష్ఠిద్దాం. వాటిని అనుసరించి దేవతలను పూజించుదాం, కర్మలను ఫలాపేక్ష లేకుండా చేద్దాము. మనం చేసే తప్పులను తెలుసుకుందాం, పాపములనుండి దూరముగా ఉందాము. ఆత్మజ్ఞానమును పొందుదాం. గృహ బంధనముల నుండి దూరముగా ముక్తి మార్గములో  పయనిద్దాం.

సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాఽఽధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వానుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం  ౨

సత్సాంగత్యమును ఆచరిద్దాం. భగవంతునిపై దృఢమైన భక్తీ భావాన్ని పెంపొందిన్చుకుందాం. శాంతి మొదలగు మానసిక స్థితులను తెలుసుకుందాం, కర్మలను దృఢ సంకల్పముతో నిర్వర్తిద్దాము. సద్గురువును ఆశ్రయిద్దాం, శరణాగతి కోరుదాం, గురు పాదుకలను నిత్యము పూజిద్దాం. ఏకాక్షర బ్రహ్మమును (ఓం)  ధ్యానిద్దాం, శ్రుతులలో చెప్పిన వాటిని శిరోధార్యముగా విందాం.

వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరపక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతాం
బ్రహ్మాస్మీతి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహంమతిరుఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం  ౩

వేదాలలోని గొప్ప వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నిద్దాం, వేద సారాన్ని తెలుసుకుందాం. చేదు వాగ్వివాదములకు దూరంగా ఉందాము, వేదములపై సంవాదములలో మాత్రమే పాల్గొందాము. నేనే బ్రహ్మను అనే భావనను వీలైనంత కలిగి ఉందాము,  అహంకారాన్ని వీడుదాం. నేను అనగా శరీరం అనే భావనను వీడుదాం, పండితులతో వాదనలు పరిత్యజిద్దాము.

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతాం  ౪

ఆకలి అనే రోగానికి చికిత్స చేద్దాము, ప్రతిదినము భిక్షలో దొరికిన దానినే ఔషధంగా భుజిద్దాం. రుచికరమైన భోజనము కొరకు యాచించ కుండా ఉందాము, విధివశాత్తు దొరికిన దానితో సంతృప్తి చెందుదాం. శీతోష్ణములను ఓర్చుకుందాము, వృథా వాక్యములను మాట్లాడకుందాము.  ఉదాసీనమును ఇష్ట పడదాం (విషయముల పట్ల ఉదాసీనముగా ఉండుట  - సంతోషము, విచారము లేకుండా), జనులు మన పట్ల చూపించే కృప, నిష్ఠూరములను మనలకు అంటకుండా ఉందాము.

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం  ౫

ఏకాంతంలో సుఖాసీనులమై, ఆత్మ యొక్క సత్యముపై మనసు లగ్నము చేద్దాము. పూర్ణాత్మను దర్శించుదాం. ఆ సత్యముతో నిండిన విశ్వాన్ని దర్శించటానికి ప్రయత్నిద్దాము. పూర్వ కర్మల ఫలములను నాశనము చేద్దాము, కొత్త కర్మలలో చిక్కుకొన కుండా ఉందాము. ప్రారబ్ధమును ఇక్కడే వదిలివేద్దాము, పరబ్రహ్మ స్థితిలో ఉందాము.

19, జనవరి 2011, బుధవారం

శ్రీ బుధకౌశిక ఋషి విరచిత శ్రీరామరక్షా స్తోత్రం - తాత్పర్యము

'రాం' అనే అక్షరం అగ్ని స్వరూపం. అంతటి మహిమాన్వితమైన బీజాక్షరం మరొకటి లేదని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి దీనికి దేవత అయిన శ్రీ రాముడు ఎంత మహిమాన్వితుడో మనకు వాల్మీకి మహర్షి విపులంగా రామాయణ మహాకావ్యంలో చెప్పాడు.

మానవునిగా పుట్టి,  ధర్మ సంరక్షణకోసం, సత్య వాక్పరిపాలన కోసం ఆదర్శ జీవనాన్ని గడిపిన ఆ ధర్మమూర్తి రామచంద్రుని స్మరిస్తే సకల భయాలు, ఆపదలు,  పాపాలు తొలగుతాయని, మోక్షము కలుగుతుందని ఎన్నలేని నిదర్శనాలు ఈ భారత భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఎందరో ఋషులు, యోగులు, కవులు, పండితులు, పరమ భక్తులు, వాగ్గేయ కారులు ఈ రామ నామ మహిమను వివరించారు, నుతించారు. స్వయంగా పరమశివుడే పార్వతికి ఈ రామ నామ మహత్తును చెప్పాడుట.


ఆ రాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ రామ రక్షా స్తోత్రాన్ని రచించారు. ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఇందులో వేర్వేరు మూలాలనుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందు పరచారు.

రామ రక్షా స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం అనురాధా పోడ్వాల్ గారి గాత్రంలో.

ఓం శ్రీగణేశాయ నమః

వినియోగః

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య  బుధకౌశిక ఋషిః
శ్రీసీతారామచంద్రో దేవతా  అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః  శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః

బుధకౌశికఋషి రచించిన రామరక్షా స్తోత్రము, సీతా రామచంద్రుడు దేవత,  సీత శక్తి, హనుమంతుడు కీలకం (మూల స్థంభం అని అర్థం), అనుష్టుప్ ఛందములో చెప్పబడింది. శ్రీరాముని ప్రీతి కొరకు ఈ రామరక్షా స్తోత్రము వినియోగము.

అథ ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం
వామాంకారూఢ సీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రం

మోకాళ్ళ వరకు ఉండే పొడవైన చేతులు కలవాడు, ధనుస్సు, శరములు ధరించిన వాడు, పద్మాసనములో కూర్చుని ఉన్నవాడు, పసుపు పచ్చని వస్త్రము ధరించిన వాడు, నవ కలువలతో పోటీ పదే  కన్నులు కలవాడు,   ప్రసన్నుడు, తన ఎడమ తొడపై కూర్చుని ఉన్న కమలము వంటి ముఖము కల సీతపై చూపులు కలవాడు, మేఘ శ్యాముడు, అనేకమైన ఆభరణములు ధరించిన వాడు, పొడవైన కేశములు తొడలవరకు కలవాడు అయిన శ్రీ రాముని ధ్యానించుము.

ఇతి ధ్యానం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం  ౧

శ్రీరాముని చరితము ఎంతో విస్తారమైనది. ఇందులోని ప్రతి అక్షరము మానవుని మహా పాతకములను నాశనము చేయగలిగిన శక్తి కలది.
 
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం  ౨

కలువల వంటి కన్నులు, నీలి మేఘము వంటి శరీర ఛాయ, అందమైన కేశములు కిరీటముగా కలిగి, సీతా లక్ష్మణులు చెరొక వైపు కలిగి ప్రకాశిస్తున్న రాముని ధ్యానించుదాము.
 
సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకం
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం  ౩

ఖడ్గము, ధనుస్సు, అమ్ముల పొదిలో బాణములు ధరించిన వాడు, నిశాచరులైన రాక్షసులను సంహరించిన వాడు, జన్మ లేని వాడు, దుష్ట శిక్షణ కోసమే అవతారమెత్తిన వాడు, ప్రకాశించే ప్రభువును ధ్యానించుదాము.

రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః  ౪

రామ రక్షా స్తోత్రము పఠించే జ్ఞానులకు పాపములన్ని నశించి అని కోరికలు తీరును. రఘువంశములో పుట్టిన రాముడు నా శిరస్సును కాపాడు గాక, దశరథ కుమారుడైన రాముడు నా నుదురును కాపాడు గాక.

కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియఃశ్రుతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః  ౫

కౌసల్యా సుతుడైన రాముడు నా కన్నులను కాపాడు గాక. విశ్వామిత్రుని ప్రియుడైన రాముడు నా కర్ణములను కాపాడు గాక. యజ్ఞమును కాపాడిన రాముడు నా  నాసికమును కాపాడు గాక.  లక్ష్మణుని పట్ల ప్రేమతో ఉండేవాడు నా ముఖమును కాపాడు గాక.

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః  ౬

విద్యా నిధి యైన రాముడు నా నాలుకను కాపాడు గాక. భరతునిచే పూజించ బడిన రాముడు నా  కంఠమును కాపాడు గాక. దివ్యాయుధములు ధరించే రాముడు నా భుజములను కాపాడు గాక. శివుని విల్లుని విరిచిన రాముడు నా బాహువులను కాపాడు గాక.

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః  ౭

సీతాపతి యైన రాముడు నా కరములను కాపాడు గాక. పరశురాముని గర్వము అణచిన రాముడు నా హృదయమును కాపాడు గాక. ఖర దూషణ రాక్షసులను సంహరించిన రాముడు నా ఉదరమును కాపాడు గాక. జామ్బవంతునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా నాభిని కాపాడు గాక.

సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్  ౮

సుగ్రీవునికి ప్రభువైన రాముడు నా నడుమును కాపాడు గాక. హనుమంతునికి ప్రభువైన రాముడు నా తుంటెను కాపాడు గాక.  రఘు కులములో ఉత్తముడు, రాక్షసులను వినాశనము చేసినవాడైన  రాముడు  నా రెండు తొడలను కాపాడు గాక.

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః  ౯

సేతువును నిర్మించిన రాముడు నా మోకాళ్లను కాపాడు గాక. రావణుని సంహరించిన రాముడు నా పిక్కలను కాపాడు గాక. విభీషణునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా పాదములను కాపాడు గాక. ఈ విధముగా రాముడు నా శరీరము నంతటినీ కాపాడు గాక.

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్  ౧౦

రాముని అంత బలం కల ఈ స్తోత్రమును పఠించిన సత్పురుషునికి   దీర్ఘాయుష్షు, సుఖము, సంతానము, విజయము, వినయము కలుగు గాక.

పాతాలభూతలవ్యోమచారిణ శ్ఛద్మచారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః  ౧౧

రూపమును మార్చుకుంటూ, భూమిపైన, పాతాళములో, ఆకాశములో, అదృశ్య రూపులై  తిరిగేవారికి (దుష్టశక్తులు) రామనామముచే రక్షించబడిన వారు కనబడక యుందురు.

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి  ౧౨

రామ, రామభద్ర, రామచంద్ర అని ఆ దేవుని స్మరించే మానవులకు ఎటువంటి పాపము అంటదు. వారికి భుక్తి, ముక్తి కలుగును.

జగజైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః  ౧౩

ప్రపంచాన్ని జయించిన రామ నామ మనే ఈ మంత్రమును ధరించిన వారికి సర్వ కార్య సిద్ధి కలిగి, సిద్ధులు వారి కనుసన్నలలో యుండును.

వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం  ౧౪

వజ్రపంజరమనే ఈ రామ కవచాన్ని స్మరించే వారికి ఓటమి యుండదు. వారికి ఎల్లవేళలా జయము, శుభము కలుగును.

ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః  ౧౫

పరమ శివుడు బుధ కౌశిక మునిని ఈ స్తోత్రము రచించుమని స్వప్నములో ఆదేశించెను. మరునాడు ఉదయము ఆ ఋషి ఈ స్తోత్ర రచన చేసెను.

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః  ౧౬

అన్ని కోరికలు తీర్చే కల్పవ్రుక్షమైన వాడు,  అన్ని ఆపదలను పోగొట్టేవాడు, మూడులోకములచే వందితుడు అయిన రాముడే  నిస్సంశయముగా మన ప్రభువు.

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ  ౧౭

యువకులు, సుందరమైన వారు, సుకుమారులు, మహాబలము కలవారు, కలువలవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, జింక చర్మము ధరించిన ఆ రామలక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడుదురు  గాక.

ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ  ౧౮

దశరథుని పుత్రులైన ఈ రామలక్ష్మణులు కందమూల ఫలములు భుజించి, నిగ్రహముతో, తపస్సు చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నారు.


శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ  ౧౯

రఘువంశ రాజ కుమారులు, ధనుర్విద్యలో ఆరితేరిన వారు, రాక్షసులను సంహరించిన వారు, అందరి రక్షకులు అయిన రామ లక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడు గాక.

ఆత్తసజ్జధనుషావిషుస్పృశౌ అక్షయాశుగనిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతాం  ౨౦

ధనుర్బాణములు ధరించి తయారుగా ఉన్న, వారి చేతులు నిండుగా ఉన్న అమ్ములపొదిలోని బాణములపై కలిగిన రామ లక్ష్మణులు మనలను మన మార్గములో ఎల్లవేళలా కాపాడెదరు గాక. 

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః  ౨౧

ఖడ్గము, కవచము, బాణములు, ధనుస్సుతో ఎల్లప్పుడూ సన్నద్ధుడై యుండి, లక్ష్మణుడు అనుసరించగా, మన మనోరథము తీర్చుటకై వచ్చిన రామ చంద్రుడు లక్ష్మణ సమేతుడై మనలను కాపాడు గాక.

రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః  ౨౨

దశరథ మహారాజు, కౌసల్యల తనయుడు, శూరుడు, లక్ష్మణునిచే అనుగమించ బడిన వాడు,  బలవంతుడు, సూర్యవంశమున జన్మించిన వాడు, పూర్ణ పురుషుడు, రఘు కులములో ఉత్తముడు ఈ రాముడు.

వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః  ౨౩

వేదాంతములచే గ్రహించబడే వాడు,  యజ్ఞములకు అధిపతి, సనాతనుడు, పురుషోత్తముడు, సీతాప్రియుడు, శుభకరుడు, అనంతమైన పరాక్రమము కలవాడు ఈ రాముడు.

ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః  ౨౪

పరమ శివుడు ఇలా అన్నాడు - నా భక్తులారా! రాముని ఈ నామములను శ్రద్ధతో జపించేవారికి సంశయం లేకుండా అశ్వమేధ యాగము చేసిన దాని కన్నా ఎక్కువ ఫలము లభించును.

రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః  ౨౫

కలువల వంటి కన్నులు కలవాడు, నీల మేఘ శ్యాముడు, పీతాంబరములు ధరించిన వాడు అయిన రాముని దివ్య నామములు స్తుతించే వారు ఇంక ఈ సంసార సాగరములో చిక్కుకొని యుండరు (వారికి మోక్షము కలుగును).

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం  ౨౬

మనోహరుడు, లక్ష్మణుని అగ్రజుడు, సీతాపతి, రఘుకులములో ఉత్తముడు, కరుణా సాగరుడు, సర్వ సులక్షణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియుడు, ధర్మ రక్షకుడు, సత్య సంధుడు, రాజేంద్రుడు, దశరథ పుత్రుడు, నల్లని వాడు, శాంతమూర్తి, రావణుని సంహరించిన వాడు, లోకాభిరాముడు అయిన రామునికి వందనములు.


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః  ౨౭

 శుభకరుడు, రక్షకుడు, చంద్రుని వలె చల్లనైన వాడు, సీతాపతి, లోక నాథుడు యైన రామునికి నమస్కారములు.

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ  ౨౮

రఘునందనుడు, భరతునికి అగ్రజుడు, యుద్ధములో అరివీర భయంకరుడు అయిన రాముని నేను శరణు కోరుచున్నాను.

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే  ౨౯

శ్రీరామచంద్రుని పాదములను - మనసులో స్మరిస్తున్నాను. మాటలలో పొగడుతున్నాను, శిర్స్సుతో నమస్కరిస్తున్నాను, శరణు కోరుతున్నాను.

మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాఽన్యం జానే నైవ జానే న జానే  ౩౦

శ్రీరాముడే నాకు తల్లి, తండ్రి, ప్రభువు, స్నేహితుడు. నా సర్వస్వం ఆ దయాళువైన రామచంద్రుడే. అటువంటి వారు నాకు ఇంక ఎవ్వరు లేరు, లేరు గాక లేరు.

దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం  ౩౧

కుడి పక్కన లక్ష్మణుడు, ఎడమ పక్కన సీత, ముంగిట హనుమంతుడు కలిగిన రామునికి వందనములు.

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే  ౩౨

కన్నులకు ఇంపైన వాడు, సమరములో శత్రుజన భయంకరుడు, అందమైన కన్నులు కలవాడు, రఘువంశ నాథుడు, కరుణా రూపుడు, కరుణాకరుడు అయిన రాముని శరణు కోరుతున్నాను.

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే  ౩౩

 మనస్సు అంత వేగము కలవాడు, వేగమున తండ్రియైన వాయువుతో సమానమైన వాడు, ఇంద్రియములను జయించిన వాడు,  బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయు పుత్రుడు, వానరసేనలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమంతుని శరణు కోరుతున్నాను.

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం  ౩౪

రామాయణ కావ్యం ద్వారా మధురమైన రామ నామమును చెట్టుపై యున్న కోయిల వలె గానం చేసిన వాల్మీకి మహర్షికి వందనములు.

ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం  ౩౫

అన్ని ఆపదలు తొలగించే వాడు, సకల సంపదలను ఇచ్చే వాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి నేను పరి పరి నమస్కారములు చేయుచున్నాను.

భర్జనం భవబీజానాం అర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం  ౩౬

రామనామ ఉచ్చారణ, గర్జన పునర్జన్మ యనే బీజమును నాశనము చేయును (మోక్షము కలిగించును). అది సకల సంపదలను ఇచ్చును, యమ దూతలను పారద్రోలును.

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర  ౩౭

రాజులలో మణి వంటి వాడు, రాక్షసులను సంహరించిన వాడు అయిన రామున్ని భజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఆ రాముని మించిన కొలువు, దైవము లేదు, నేను అతని సేవకుడను. నా మనసు ఆ రాముని యందే లయమై యున్నది. ఓ రామా! నన్ను ఉద్ధరించుము, తరించుము. 

శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే  ౩౮

పరమశివుడు ఇలా అన్నాడు - ఓ పార్వతీ దేవీ! నేను రామ నామ ఉచ్చరణను ఆస్వాదిస్తున్నాను. అది నాకు ఎంతో ప్రియమైనది. ఈ నామమును ఒక్కసారి ఉచ్చరించుట పరమాత్ముని ఇతర సహస్ర నామములను ఉచ్చరించినంత ఫలము నిచ్చును.

ఇతి శ్రీ బుధకౌశికఋషి విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం

18, జనవరి 2011, మంగళవారం

శ్రీమచ్ఛంకరభగవత విరచిత మనీషాపంచకం - తాత్పర్యము

శంకర భగవత్పాదులు కాశీలో నివసిస్తున్నప్పటి సంఘటన ఇది. ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు  వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన మనీషా పంచకం.

అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.  ఈ పంచకము, తాత్పర్యము.



అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాథ్
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి

ఓ యతివరా! దూరము వెళ్ళుము దూరము వెళ్ళుము అని అంటున్నావు నన్ను. అది ఒక ఆహారము తిన్న శరీరము ఇంకొక ఆహారము తిన్న శరీరమును అంటున్న మాటయా? లేక  ఒక చైతన్యము ఇంకొక చైతన్యమునా? దేనిని పొమ్మని అంటున్నావు?  చెప్పుము.

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావభోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాంకోఽయం  విభేధభ్రమః
కిం గంగాంబుని బింబితేఽంబరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽంతరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽంబరే

ఎలాగైతే సూర్యుని ప్రతిబింబము నిశ్చలమైన నీటిపై స్పష్టంగా కనిపిస్తుందో అలాగే పరబ్రహ్మము ఈ చరాచర సృష్టిలోని ప్రతి వస్తువులోను స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ అయోమయము? సందిగ్ధము? పవిత్ర గంగానదిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి, ఒక చండాలుడు ఉండే వీధిలోని నీటిలో కనిపించే సూర్యుని ప్రతిబింబానికి తేడా ఏమైనా ఉందా? అలాగే నీటిని కలిగిన ఉన్న బంగారు మరియు మట్టి పాత్రల వలన ఈ రెండిటిలో ఉన్న నీటికి ఏమైనా భేదము కలదా?

          మనీషాపంచకం

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౧

ఎవరైతే - తనలో ఉన్న ఆత్మ పరబ్రహ్మ రూపమై జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో అవగతమవుతుందో, అదే ఆత్మ చీమలో కూడా ఉందని, అది చేతనమై, అగోచరమై, సాక్షియై ఉన్నదని - తెలుసుకున్నాడో వాడే అత్యుత్తమమైన గురువు/తత్త్వవేత్త - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితమ్
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  ౨

అజ్ఞానము, త్రిగుణముల (సత్త్వ, రజస్,  తమో గుణములు) వలన ఈ విశ్వము వేర్వేరు రకములైన జీవులతో ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఏ పరబ్రహ్మ రూపమున ఈ విశ్వమున్నదో, నిరంతర ఆ పరబ్రహ్మ ధ్యాసతో, తానే పరబ్రహ్మమని గ్రహించిన వాడే ఉత్తమైన గురువు - వాడు చండాలుడైన నేమి బ్రాహ్మణుడైన నేమి.

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా
భూతం భాతి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ  ౩

ఈ విశ్వము ఒక అశాశ్వతమైన మాయయని, ఈ శరీరము ఆ పరమాత్మను శాంతముతో, సంపూర్ణ విశ్వాసముతో ధ్యానించుటకు, తద్వారా పాపములను ఆ పవిత్రమైన అగ్ని యందు దాహించుటకు ఇవ్వబడినదియని సెప్పిన గురువుల మాటను నేను పూర్తిగా నమ్ముతున్నాను.
 
యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ  ౪

మేఘములచే కప్పబడిన సూర్యుని వలె అజ్ఞానము జీవిని పరమాత్ముని కానకుండా చేయుచున్నది. ఆ పరబ్రహ్మము వలన ఈ చరాచర సృష్టి యందు కార్యములు జరుగుతున్నవని, ఆ సత్యమును తనయందే గ్రహించిన యోగి  ఉత్తమమైనవాడు అని నా అభిప్రాయము.

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ  ౫

ఇంద్రాది దేవతలచే పూజించబడే పరబ్రహ్మముపై నిరంతర ధ్యానము కలిగిన వాడు, పరిపూర్ణ శాంతుడై యుండును. అట్టివాడు ఆ పరబ్రహ్మమును తెలిసికొని యున్నాడు అని, అతడే ఆ పరబ్రహ్మ అని నా పూర్తి నమ్మకము.

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః

ఓ శంభో! నేను ఈ శరీర రూపముతో  నీ సేవకుడను. ఓ త్రినేత్రా! జీవ రూపములో నేను నీలో ఒక భాగమును. ఆత్మ రూపములో నీవు నా యందు, మరి సమస్త జీవకోటి యందు యున్నావు. నేను నా బుద్ధి ద్వారా, శాస్త్రముల ద్వారా ఈ విషయమును గ్రహించి యున్నాను.

 ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మనీషాపంచకం సంపూర్ణమ్

15, జనవరి 2011, శనివారం

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము


ఇరువది నాలుగవ దశకము - ప్రహ్లాద చరితము

హిరణ్యాక్షే పోత్రీప్రవరవపుషా దేవ భవతా
హతే శోకక్రోధగ్లపితఘృతిరేతస్య సహజః |
హిరణ్యప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో || ౨౪-౧||

నారాయణా! యజ్ఞ వరాహరూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి. అందువలన అతని సోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము, కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహా సభలో అతడు ప్రతిజ్ఞ చేసెను.


విధాతారం ఘోరం స ఖలు తపసిత్వా నచిరతః
పురః సాక్షాత్కుర్వన్సురనరమృగాద్యైరనిధనమ్ |
వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్ || ౨౪-౨||

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వాని చేత చావు లేకుండునట్లువరమొసగెను . ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వముతో హిరణ్యకశిపుడు నీవు నాయకుడిగా ఉన్న ఈ భువనములన్నిటినీ బాధలకు గురిచేయుచు నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాదిపత్యమును లాగు కొనెను. 


నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మవపుషా |
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్
భియా యాతం మత్వా స ఖలు జితకాశీ నివవృతే || ౨౪-౩||

ప్రభూ! పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెదకియు, నీ ఉనికిని కనుగొనలేక పోయెను. అప్పుడు నీయెడ శత్రుభావము వహించి యున్న హిరణ్యకశిపుని హృదయమందు నీవు సూక్ష్మ రూపమున ప్రవేశించి యుంటివి. నీవుఎచ్చటను కనబడనందున భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడనను గర్వముతో వికటాట్టహాసము చేయుచు వెనుకకు మరలెను. 


తతోఽస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభబద్భక్తిమహిమా |
స వై జాత్యా దైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతామ్ || ౨౪-౪||

వరదా! గురువాయుపురాధీశా! ఆ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదముని వలన నీ భక్తి మహిమను కనుగొనెను. దైత్య వంశములో పుట్టినప్పటికినీ ప్రహ్లాదుడు నీ భక్త శిఖామణియై బాల్యమునుండి ఖ్యాతి వహించెను.

సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్ |
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవ చరణభక్త్యైవ వవృధే || ౨౪-౫||

దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడు అయితే రాక్షసుల మధ్య అది అపహాస్యమగునని తలచి అతనిని విద్యాభ్యాసము కొరకు తన గురువుల వద్దకు పంపించెను. ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించునది శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాద పద్మముల సేవయే అన్నిటి కన్నా మిన్న అని తలంచెను.


అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టేఽథ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః |
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యోత్యభివిదన్
వధిపాయానస్మిన్ వ్యతత్నుత భవత్పాదశరణే || ౨౪-౬||

ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తరువాత అతడు నేర్చుకున్న విద్య తెలిసికొన దలచి హిరణ్యకశిపుడు అతనిని తన వద్దకు రప్పించు కొనెను. హిరణ్యకశిపుడు పుత్రునితో నీవు నేర్చుకున్న విద్యలలో ఉత్తమమైనదిగా ఏది తోచినది? అని అడిగెను. అప్పుడు పరమ భక్త శిఖామణి యైన ప్రహ్లాదుడు శ్రీహరి సేవయే అన్నిటి కన్నా మిన్న అనిచెప్పెను . అప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో గురువులను ప్రశ్నించగా వారు 'అది అతనికి సహజముగా కలిగిన బుద్ధి' అని చెప్పిరి. అప్పుడు హిరణ్యకశిపుడు నీపై కోపముతో ఆ ప్రహ్లాదుని చంపుటకు ఎన్నోవిధముల ప్రయత్నించెను.
 

స శూలైరావిద్ధః సుబహు మథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టోఽప్యనశనగరాహారవిధుతః |
గిరీంద్రావక్షిప్తోఽప్యహహ పరమాత్మన్నయి విభో
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత || ౨౪-౭||

దేవా! ఆ రాక్షసులు ప్రహ్లాదుని శూలములతో పొడిచిరి, మదించిన ఏనుగులతో తొక్కిన్చిరి, మహా సర్పములచే కరిపించిరి, తిండి లేక మాడ్చిరి, విషాహారమును పెట్టిరి.  ఎత్తైన ప్రదేశముల నుండి అగాధములలోకి నెట్టిరి. ఇన్ని బాధలు పెట్టినను, ప్రహ్లాదుని మనసు నీపై లగ్నమై ఉండుటచేత, నీ మహిమ వలన అతనికి ఏ బాధ కలుగ లేదు. ఇది యెంత ఆశ్చర్యకరము.


తతః శంకావిష్టః స పునరతిదుష్టోఽస్య జనకో
గురూక్త్యా తద్గేహ కిల వరుణపాశైస్తమరుణత్ |
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమపి విజ్ఞానమశిషత్ || ౨౪-౮||

ఈ విధముగా దండములన్ని విఫలమగుటచే హిరణ్యకశిపునికి అనుమానము వచ్చెను. అందువలన గురువు ఆశ్రమములోనే ప్రహ్లాదుని వరుణ పాశములచే బంధించెను. అయినను, గురువు దగ్గర లేనప్పుడు ఇతర దైత్య కుమారులకు పరమ విజ్ఞానమైన నీ తత్త్వమును ఉపదేశించెను.


పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం
రుషాంధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి |
బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోఽయమగదీత్ || ౨౪-౯||

తన కుమారుడు దైత్యపుత్రులకు నీ భక్తిజ్ఞానమును బోధించిన విషయము తెలిసిన హిరణ్యకశిపుడు 'ఓరీ దైత్యుల శత్రువా! నీకు ఇంత బలము ఎక్కడినుంచి వచ్చింది' అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'వైకుంఠ నాథుడు అయిన శ్రీ హరి నాకు, నీకే కాదు ఈ జగత్తు మొత్తానికి బలమైన వాడు. అతడే సమస్త లోక స్వరూపుడు' అని చెప్పెను.


అరే క్వాసౌ క్వాసౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభింతే స్మ స్తంభం చలితకరవాళో దితిసుతః |
అతః పశ్చాద్విష్ణో న హి వదితుమీశోఽస్మి సహసా
కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మామ్ || ౨౪-౧౦||

అప్పుడు హిరణ్యకశిపుడు 'ఆ హరి ఎక్కడ - ఇక్కడ అక్కడా దానిలోనా దీనిలోనా'  అని కోపావేశముతో తన కరవాలముతో ఒక స్థంభమును దూసెను. అప్పుడు ఏమి జరిగినదో వర్ణింప అలవి కాదు. ఓ ప్రభు! కృపాకరా! గురువాయురప్పా! నా బాధలను తొలగించి నాకు ఆనందము కలుగ చేయుము.
 
ఇరువది ఐదవ దశకము - శ్రీ నృశింహావతార వర్ణనము

స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్
నాధూర్ణజ్జగదందకుండకుహరో ఘోరస్తవాభూద్రవః |
శ్రుత్వా యం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం
కంపః కశ్చన సఫ్పపాత చలితోఽప్యంభోజభూర్విష్టరాత్ || ౨౫-౧||

ప్రభూ! హిరణ్యకశిపుడు స్థంభముపై కొట్టగానే భయంకర ధ్వనితో దానినుండి నీవు ఆవిర్భవించితివి. ఆ శబ్దమునకు చెవులు బద్దలు అయ్యెను. బ్రహ్మాండమంతా గిర్రున తిరిగినట్లాయెను. ఆ ధ్వనిని వినగానే హిరణ్యకశిపుని హృదయము కంపించెను. పద్మము నందు ఆసీనుడైన బ్రహ్మ కూడా ఆ భీకర ధ్వనికి చలించి పోయెను.

దైత్యే దిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణీ స్తంభతః
సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో |
కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తేఽసురే
విస్ఫూర్జద్ధవలోగ్రరోమవికసద్వర్ష్మా సమాజృంభథాః || ౨౫-౨||

భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూచు చుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముతూ స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహము గానీ మానవుడు గానీ గాక నరసింహ రూపుడవై యుంటివి. అంతట ఆ రాక్షస రాజు మిక్కిలి విభ్రాంతుడై 'భయంకరముగా, అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి? ఏమిటి?' అని వణికి పోసాగెను. అంతట అతని ధైర్యము సడలి పోయెను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదుల్చుచు విరాడ్రూపముతో విజృంభించితివి.


తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర-
ప్రోత్కంపప్రనికుంబితాంబరమహో జీయాత్తవేదం వపుః |
వ్యాత్తవ్యాప్తమహాదరీసఖముఖం ఖద్గోగ్రవల్గన్మహా-
జిహ్వానిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడ్డామరమ్ || ౨౫-౩||

ప్రభూ! నీ నరసింహ రూపమున కనుగ్రుడ్లు పుటం పెట్టిన బంగారము వలె పచ్చగా ఉండి మహా భయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్క పొడుచుకుని ఆకాశమంతా వ్యాపించియున్నది. నీ నోరు చాల భయంకరమైన గుహవలె ఒప్పుచున్నది. నోటినుండి బయటకు వచ్చి అటు ఇటు కదులుచున్న నాలుక కత్తివలె భయంకరముగా నున్నది, భీకరమైన కోరలతో విలసిల్లు చున్నది.  అట్టి నీ నరసింహ రూపమునకు జయమగు గాక.


ఉత్సర్పద్వలిభంగభీషుణహనుం హ్రస్వస్థవీయస్తర-
గ్రీవం పీవరదోశ్శతోద్గతనఖకౄరాంశుదూరోల్బణమ్ |
వ్యోమోల్లంఘిఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావిత-
స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః || ౨౫-౪||

స్వామీ! నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడుతలు పడుచున్నవి. నీ కంఠ భాగము పొట్టిగా దృఢమైనది. బాగుగా పుష్టి గలిగి యున్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడిగా మహా భయంకరముగా నున్నవి. నీ శరీరము ఆకాశమును అంటుకొనునట్లు చాల ఎత్తుగా నున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘ గర్జన వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసిమ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును.


నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం
దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్ |
వీరో నిర్గళితోఽథ ఖడ్గఫలకౌ గృహ్ణన్విచిత్రశ్రమాన్
వ్యావృణ్వన్పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో || ౨౫-౫||

దేవా! అంతట హిరణ్యకశిపుడు 'నిజముగా ఇతడే విష్ణువు. ఇతనిని నేను సంహరించెదను' అని పలుకుచు, గదను భయంకరముగా తిప్పుచు నీ మీదికి విజృంభించెను. అప్పుడు నీవు బలమైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకొంటివి. కానీ ఆ దుర్మార్గుడు నీ బాహు బంధములనుండి తప్పించుకొని, ఖడ్గమును, దలును చేబూని, చిత్రవిచిత్రములుగా తిరుగుచుండెను. పిమ్మట సమస్త లోకములను మ్రింగ బోవుచున్నట్లు మహా భయంకరముగా నున్న నీపైకి అతడు విరచుకొని పడెను.


భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారేఽథోరుయుగే నిపాత్య నఖరాన్వ్యుత్ఖాయ వక్షోభువి |
నిర్భిందన్నధిగర్భనిర్భరగళద్రక్తాంబు బద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహుజగత్సంహారిసింహారవాన్ || ౨౫-౬||

రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను  నీవు అతని గట్టిగా పట్టుకొని సభాద్వారము దగ్గర కడప మీద నీ తొడలపై చేర్చుకుని, నీ వాడియైన గోళ్ళతో గ్రుచ్చి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచుచున్న వేడి రక్తముతో ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించు చున్నట్లు మిక్కిలి భయంకర సింహనాదము చేసితివి.

త్యక్త్వా తం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానే త్వయి |
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుఃస్థామవస్థాం దధౌ || ౨౫-౭

స్వామీ! నీవు ఆ రాక్షసుని చంపి, అతనిని వదిలి పెట్టి రక్తపు మడుగులో తడిసి యున్న నీవు చెంగున ముందుకు దూకి, మిగిలిన రాక్షసులను చంపి తినుచున్నప్పుడు భూమిఅంతా గుండ్రముగా తిరిగి పోయినది. సముద్రములు అల్లకల్లోలము అయినవి. మహా పర్వతములు కడలి పోయినవి. ఆకాశమున నున్న నక్షత్రములు అటు ఇటు చెల్లా చెదురు అయిపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురైనది.

తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం
త్వాం మధ్యేసభమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవమ్ |
అభ్యేతుం న శశక కోఽపి భువనే దూరే స్థితా భీరవః
సర్వే శర్వవిరించవాసవముఖాః ప్రత్యేకమస్తోషత || ౨౫-౮||

స్వామీ! నీవు హిరణ్యకశిపుని సంహరించి, అతని మాంసము, వాప మొదలైన వాటిచే మహా భయంకరముగా నుంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి కోపముతో గర్జిన్చుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్టి నీ ఆకారమును చూచి ఎవ్వరును నీ దగ్గరకు వచ్చుటకు సాహసము చేయలేక పోయిరి. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు, మొదలైన దేవతలు కూడా భయముతో చాల దూరముననే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతించ సాగిరి.

భూయోఽప్యక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః |
శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధాః స్తోత్రైరథోద్నాయత-
స్తస్యాకామధియోఽపి తేనిథ వరం లోకాయ చానుగ్రహమ్ || ౨౫-౯||

దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మ దేవుని ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ పాదములకు నమస్కరించెను. అంతట పరమ దయాళువైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమును ఉంచితివి. అప్పుడా ప్రహ్లాదుడు నిన్ను అనేక విధముల స్తుతించెను. అతనికిఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములను ఇచ్చితివి. 

ఏవం నాటితరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ-
శ్రుత్యంతస్ఫుటగీతసర్వమహిమన్నత్యంతశుద్ధాకృతే |
తత్తాదృఙ్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్
ప్రహ్లాదప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్పాహి మామ్ || ౨౫-౧౦||

ప్రభూ! నీవు సహజముగా పరమ శాంతుడ వైనను ఈ విధముగా క్రోధమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతా శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపించబడెను.   నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు. అందరికంటేను ఉన్నతమైన వాడవు. నిన్ను అధిగమించు వారు లేరు. ప్రహ్లాద ప్రియా! గురువాయురప్పా! దయతో నా సమస్త రోగములనునివారింపుము.