23, మార్చి 2015, సోమవారం

జపవిధానము



జకారో జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః
జన్మచ్ఛేదకరో యస్మాత్ జపమిత్యభిదీయతే

జ అంతే జన్మరాహిత్యము, ప అతే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి కలిగి సంపూర్ణ ఫలితము లభించును. 

మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:

1. జపము మూడు విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము, దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.

2. ప్రాతఃకాలములో చేతులు పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి, సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.

3. చందనముతో, అక్షతలతో, పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము, ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.

4. జపము చేయునప్పుడు జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి చాటున లేదా ఒక వస్త్రముతోనైనా తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. ఆ వస్త్రము తడిగా ఉండరాదు.

5. జపమాలను అనామిక (ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.

6. జపము చేయునప్పుడు కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.

7. అజాగ్రత్తవలన జపమాల కింద పడినచో నూట ఎనిమిది మార్లు ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా జపము చేయవలెను.

8. ఒకవేళ చేతి వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు యొక్క మేరువులను తాకుతూ చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. ఈ మర్గాన్ని విలోమములో చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను. చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను. దీనిని కరమాల అందురు.(రెండవ చిత్రాన్ని చూడండి)

9. సంధ్యోపాసనలో చేసే గాయత్రీ మంత్ర జపానికి కరమాల శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి రుద్రాక్షమాల శ్రేష్ఠం.

10. జపమును ముగించిన పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.

- "నిత్యకర్మ - పూజా ప్రకాశిక" (మదునూరి వెంకటరామశర్మ, గీతాప్రెస్)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి