10, మే 2015, ఆదివారం

ఎంతెంత దయ నీది ఓ సాయీ



ఎంతెంత దయ నీది ఓ సాయీ నిను ఏమని పొగడను సర్వాంతర్యామీ

తొలగించినావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు

భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో కొలువున్నావు

ప్రభవించినావు మానవ మూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే సర్వ దేవతల నవ్యాకృతి నీవే

బాబా సాయిబాబా! బాబా మా సాయిబాబా! బాబా షిర్డి సాయిబాబా! బాబా షిర్డి బాబా!

- డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్రీకృష్ణుని పలుకుల ఫలితంగా 19వ శతాబ్దపు చివర హిందూ-ముస్లిం ఘర్షణలతో ఆశాంతికి గురవుతున్న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతంలో గోదావరీ నదీ తీరాన షిర్డీ సాయి అవతరించాడు. దత్తావతారునిగా కొలువబడ్డాడు. మతాలకు అతీతంగా మనుషులను ఏకం చేశాడు సాయి. డబ్బుకు అతీతంగా, బైరాగిగా జీవించి ఈనాడు కోట్లాది భక్తులకు సమర్థ సద్గురువుగా, దైవంగా నిలిచాడు. శ్రద్ధ మరియు సబురీ అన్న రెండు సిద్ధాంతాలతో నమ్మిన వారికి ఎన్నెన్నో మహిమలను చూపించాడు. అంధకారంలో ఉన్నవారి కన్నులు తెరిపించాడు. ఆయన జీవితంలో ప్రతి రోజూ ఒక అద్భుతమే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పిన అన్నమయ్య మాటను అక్షరాలా నిజం చేశాడు. మహళ్సా మరియు శ్యామాకు మారుతిగాను, కొందరికి పాండురంగనిగా, కొందరికి శివునిగా, కొందరికి రామునిగా, కొందరికి గణపతిగా, ఎందరికో దత్తాత్రేయునిగా ఏ విధమున కొలిస్తే ఆ రూపంలో కనిపించి కరుణించాడు. యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు. 

అహంకారం వీడి శరణన్న వారిని అనుగ్రహించాడు. చూపులేని వారికి చూపు ఇచ్చి, క్షయ కలిగిన వానికి క్షయరహితునిగా చేసి, పాము కాటుకు గురైన వారికి క్రోధంతో ఉపశమనం, పొయ్యిలో పడుతున్న బిడ్డను సిద్ధ శక్తులతో తన చేయి కాల్చుకొని రక్షిచాడు. ఊదీతో నిండు చూలాలి ప్రాణాలు కాపాడాడు, ఎన్నో రోగాలనుండి ఉపశమనం కలిగించాడు. ఇలా అగణితం సాయి మహిమలు. దురాశతో దీపాలకు నూనెను ఇవ్వను అని చెప్పిన వ్యాపారి కళ్లు తెరిపించటానికి నీటితో దీపాలు వెలిగిస్తాడు సాయి. సబ్ కా మాలిక్ ఏక్ హై అని పైకి చూపేవాడు. తాను దైవమని ఎన్నడూ చెప్పలేదు. కానీ, తన పాదాల వద్ద గంగాయమునల ధారలను సృష్టించాడు. 

సాయి పొగడ్తలకు లొంగలేదు, మాటలకు అందలేదు. భక్తుల పాపాలను కడిగే పావన గంగలా అవతరించాడు. ఇస్లాం మతస్థుడైనా కబీరు రామభక్తుడు. ఆతని సిద్ధాంతమే తన మతంగా, ఫకీరుగానే ఉంటూ రామనవమి ఉత్సవాలను నిర్వహించాడు సాయి. జ్ఞాన చక్షువులు తెరచి చూస్తే అందరిలోను తానే ఉండి బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మే సాయి. 

ఈ భావాన్ని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ఎంతో రమ్యంగా, భక్తిపూరితమైన పదాలతో పొందుపరచారు. సాయి భక్తులకు నియమ నిష్ఠలకన్నా భక్తి విశ్వాసాలు ఆయుధాలు. ఆచారాల కన్నా శ్రద్ధ, ఓర్పు మార్గాలు. అదే భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో సంపూర్ణంగా వ్యక్తపరచారు. 

ఎస్. జానకి గారి గళంలో ఈ గీతం వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి