11, మే 2015, సోమవారం

శీతాద్రి శిఖరాన - మంగళ హారతి



శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం

జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.

వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం.

లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.

హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.

కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.

వేదవతీ ప్రభాకర్ గారు ఈ మంగళహారతిని ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి