23, మే 2015, శనివారం

రామ-వాలి సంవాదం.

రామ-వాలి సంవాదం




తదేతత్ కారణమ్ పశ్య యదర్థం త్వం మయా హతః
భ్రాతుర్ వర్తసి భార్యాయామ్ న్యక్త్వా ధర్మమ్ సనాతనమ్

అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయామ్ వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మకృత్

న హి ధర్మ విరుద్ధస్య లోక వృత్తాత్ అపేయుషః
దండాత్ అన్యత్ర పశ్యామి నిగ్రహమ్ హరి యూథప

ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః
ప్రచరేర నరః కామాత్ తస్య ధండో వధః స్మృతః

యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః
తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా
ఆయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి


"నిన్ను నేను హతము చేయుటకు కారణము గ్రహించు - నీవు సోదరుని పత్నితో అధర్మంగా వ్యవహరించావు.

సుగ్రీవుడు బ్రతికి యుండగా, నీ నీచమైన ఆలోచనలతో, కామంతో నువ్వు నీకు కోడలి సమానమైన సుగ్రీవ పత్నియైన రుమ పట్ల అనుచితంగా వ్యవహరించావు.

సమాజ విరుద్ధంగా, ఆచారాలను కాలరాసి ప్రవర్తించే వ్యక్తులపట్ల నేను ఎటువంటి నిగ్రహమూ చూపను. వారికి శిక్ష తప్పదు.

కూతురు, సోదరి, సోదరుని భార్య - వీరియెడ కామాతురుడై ప్రవర్తించిన వానిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మ శాస్త్రము పేర్కొనుచున్నది.

వానరా! బాగుగా ధర్మము తెలిసిన మహరాజులు కూడా వేటాడుచుందురు. కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున వధించుటలో తప్పు లేదు. ఏలననగా నీవు శాఖామృగానివి (కొమ్మలపై, చాటున ఉండే జంతువు). "

- వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత కిష్కింధ కాండలో రామ-వాలి సంవాదం.

వాలి అతి బలసంపన్నుడు. రావణబ్రహ్మనే ఓడించిన మహాబలశాలి. అన్నివిద్యలు నేర్చిన పండితుడు. వానరమూకకు రాజు. కానీ, కామాంధుడై సోదరుని పత్ని పట్ల అనుచితంగా వ్యవహరించటం, దానిని సరిదిద్దుకొనక తామసంతో వ్యవహరించటం వలన ధర్మమూర్తియైన రామచంద్రుని చేత చెట్టుచాటు నుండి చంపబడ్డాడు. ఇక్కడ రాముడు ఒక ముఖ్యమైన విషయాన్ని వాలికి చెబుతాడు.

మానవునికి ముగ్గురు పితృసమానులు - తండ్రి, అన్న మరియు గురువు. ఈ విధంగా పుత్రసమానుడైన సుగ్రీవునికి అన్యాయం చేసిన వాలి శిక్షార్హుడు అన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టి చెప్పాడు రాముడు. అధర్మాన్ని సహించేది లేదని తేల్చి చెప్పాడు. అన్నీ చెప్పి, నీవంటే నాకు ద్వేషము లేదు అని మరల హితవాక్యములు పలుకుతాడు. అతను చేసిన పాపములు ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా పాపరహితుడైనాడని తెలుపుతాడు, తార, అంగదుల గురించి దిగులు పడిన వాలికి వారి భవిష్యత్తును గురించి సాంత్వన కలిగిస్తాడు, వాలి తన అజ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడి రాముని మన్నింపమని వేడుకుంటాడు. రాముడు అతనిని అనుగ్రహించి, అతనికి ఉత్తమ గతులు కలిగేలా చేస్తాడు.

రామో విగ్రహవాన్ ధర్మః. అధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆచరించడు. వాలిని అన్యాయంగా చెట్టు చాటునుండి రాముడు చంపాడు అనే అజ్ఞానులకు ఈ పై శ్లోకాలను, అర్థాన్ని వివరించండి. రామాయణాన్ని చదువకుండా అందులోని ధర్మమూర్తులను నిందించి, మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వారి అహంకారపు మాటలను ఎదుర్కోండి.

సోదరుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించే దుష్టులందరికీ ఇదే గతి తప్పదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి