9, జూన్ 2015, మంగళవారం

కంజదళాయతాక్షి కామాక్షి

కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి


కంజదళాయతాక్షి కామాక్షి కమలా మనోహరి త్రిపురసుందరి

కుంజర గమనే మణిమండిత మంజుల చరణే మామవ శివ
పంజర శుకి పంకజముఖి గురుగుహ రంజని దురిత భంజని నిరంజని

రాకా శశివదనే సురదనే
రక్షిత మదనే రత్న సదనే
శ్రీకాంచన వసనే సురసనే
శృంగారాశ్రయ మంద హసనే
ఏకానేకాక్షరి భువనేశ్వరి
ఏకానందామృత ఝరి భాస్వరి
ఏకాగ్ర మనోలయకరి శ్రీకరి
ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి

ఎర్రని కలువలవంటి కనులు గల ఓ కామాక్షీ! శ్రీమహాలక్ష్మికి ప్రియమైన ఓ త్రిపుర సుందరీ!

ఏనుగువలె అందముగా మెల్లగా నడిచే తల్లీ! మణులతో అలంకరించబడిన మృదువైన పాదముల కల అమ్మా! శివుని హృదయమనే పంజరములో యున్న చిలుక వంటి పార్వతీ! కలువ వంటి ముఖము గల అమ్మా! కార్తికేయునికి ఆనందం కలిగించే తల్లీ! పాపాలన్నిటినీ నాశనం చేసే పవిత్రమైన తల్లీ! 

నిండు పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము కల అమ్మా! మంచి పలువరుస కల తల్లీ! మన్మథుని కాపాడిన తల్లీ! రత్న సింహాసనాన్ని అధిరొహించి బంగారు వస్త్రాలను ధరించిన తల్లీ! అద్భుతమైన సౌందర్యము మరియు చిరునవ్వు కలిగిన అమ్మా! ఒకటి లేదా అనేక అక్షరములతో కొలువబడిన తల్లీ! సమస్తభువనములకు ఈశ్వరివి! సచ్చిదానందమనే అమృతాన్ని ప్రవహిస్తూ ప్రకాశించే తల్లీ! ఏకాగ్రమైన మనసుకు లయకారిణివి! శుభములు కలిగించే తల్లీ! ఏకామ్రేశ్వరుని పత్నివి! శంకరీ! 

కంచిలోని శివుడు ఏకామ్రేశ్వరుడు, పార్వతి కామాక్షీ రూపం. ఆ కామాక్షిపై కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు రచించిన ఈ కృతి ఎంతో ప్రాచుర్యం పొందింది. దేవీ ఉపాసనలో దీక్షితులవారు అమ్మ సాక్షాత్కారము పొంది సిద్ధులైనారు. శ్రీచక్ర నివాసిని అయిన ఆదిపరాశక్తి వైభవానికి ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు ఆనంద నిలయాలు.

సంగీత త్రయంలో దీక్షితులవారు, శ్యామశాస్త్రుల వారు కంచి కామాక్షి అమ్మపై ఎన్నో కీర్తనలను రచించారు.  కామాక్షీ వైభవాన్ని వీరిరువురూ తమ కీర్తనల ద్వారా ఎంతో ప్రభావవంతంగా ప్రచారం చేశారు. 

దీక్షితుల వారు పల్లవిలోనే రాగముద్రను కమలామనోహరి అన్న పదం ద్వార ఉపయోగించారు. ఓంకార పంజర శుకీం అన్న శ్లోకానికి దగ్గరగా ఆయన శివ పంజర శుకి అన్న అమ్మవారిని వర్ణించారు. శివుని హృదయంలో శక్తి నివసించటం ఈ విశ్వతత్త్వానికి ప్రతీక. అందుకే ఈ శివ పంజర శుకి అన్నది చాల నిగూఢార్థమైన ప్రయోగం. గురుగుహ అన్నది ఆయన ముద్ర. 

దీక్షితుల వారి రచనలు ఎక్కువ మటుకు సంస్కృత భాషలోనే చేశారు. ఇసుకతో చేసిన లింగాన్ని మామిడి చెట్టు కింద అర్చించి వివాహమాడిన సన్నివేశానికి ప్రతీక కంచిలోని కామాక్షీ ఏకామ్రేశ్వరుల దేవాలయం. శక్తి పీఠాలలో ఒకటైన కంచి ఆది శంకరులు ఇక్కడి అమ్మవారిని కొలిచిన తరువాత ప్రాభవాన్ని పొందింది. ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి అని దీక్షితులు ఈ ఆది దంపతుల దివ్యక్షేత్ర మహిమను చాటారు.

ఈ కృతి చివరలో చిట్ట స్వరం దీనికి ఎంతో అందాన్నిచ్చింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గాత్రంలో వినండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి