5, జూన్ 2015, శుక్రవారం

మోక్షము గలదా


మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు



మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు

సాక్షాత్కార! నీ సద్భక్తి సంగీత జ్ఞాన విహీనులకు

ప్రాణాలన సంయోగము వల్ల ప్రణవ నాదము సప్తస్వరము బరగ
వీణావాదనలోలుడౌ శివమనోవిత మెరుగరు త్యాగరాజ వినుత

ప్రపంచమున దేహేంద్రియములతో జీవించియుండు కర్మబంధములకు అంటనివారు కానిచో భువిలో మోక్షము గలదా?

ఎల్లప్పుడూ ప్రత్యక్ష సిద్ధమైయున్న రూపము గలవాడా! నిన్ను తెలియుటకు సాక్షాత్సంబంధము గలది నాదోపాసనమే. ప్రాణవాయువు, అగ్ని యొక్క కలయిక వలన ప్రణవనాదము ఉద్భవించింది. ఆ నాదమే సప్తస్వరములై సంగీతమైనది. సంగీతజ్ఞానము, భక్తిలేని మానవులకు మోక్షము కలుగదు. వీణావాదన తత్త్వజ్ఞుడైన శివుని మనసు తీరును సంగీతజ్ఞానవిహీనులు తెలియలేరు. ఆ మర్మము ఎరిగిన వారికి ప్రణవరూపుడగు శివుడు సాక్షాత్కరించును. కావున నాదస్వరూపమును గుర్తెరిగి పరమాత్మను కీర్తించుట ముక్తికి మార్గము. ఓ దేవా! త్యాగరాజు నిన్ను వినుతించుచున్నాడు.

కలౌ నామ సంకీర్తనం అన్నాడు నారదుడు. కలియుగంలో నామ సంకీర్తనే మోక్షమునకు ఉత్తమమైన మార్గము. ఎందుకు? యుగ లక్షణాలను బట్టి మోక్ష పథము మారుతుంది. పాప పురుషుడు అధర్మాన్ని మూడు పాళ్లు ధర్మాన్ని ఒక పాలుగా చేసే సమయం ఈ కలియుగం. పాపపుణ్యముల మూటలను కేవలం నామ సంకీర్తన పటాపంచలు చేస్తుంది. ఈ పనికోసమే పరమాత్మ శ్రీవేంకటేశ్వర స్వామిగా, షిర్డీ సాయి వంటి ఇతర సద్గురువుల రూపంలో అవతరించాడు. వస్తువులలోను, జనుల ఆలోచనలలోని కలుషితం వలన క్రతువులు కలియుగంలో మోక్షాన్ని ప్రసాదించలేవు. అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి వంటి మహాపురుషులు ఈ విషయాన్ని తెలుసుకొని తమ సంకీర్తనల ద్వారా పరమాత్మను నుతించి మోక్షాన్ని పొందారు. మోక్షమనగా బంధనములనుండి విముక్తి పొందటమే. అది జరిగిన తరువాత దేహి, దేహము యొక్క జ్ఞానము శాశ్వతమై మానవుడు దుఃఖరహితుడవుతాడు.

సంకీర్తనకు సాహిత్యము, సంగీతము తల్లిదండ్రులు. ఆ సంగీత జ్ఞానము భక్తికి, తద్వారా మోక్షానికి ఏ విధంగా ఉపయుక్తమో ఈ కీర్తన ద్వారా త్యాగరాజస్వామి వివరించారు. విశ్వానికి మూలమైన ప్రాణవాయువు మరియు అగ్ని కలయిక నుండి ఓంకారం జనించింది. ఓంకారమునుండి సప్తస్వరములు ఉద్భవించాయి. ఈ సప్తస్వర విన్యాసమే సంగీతము. కాబట్టి విశ్వానికి మూలమైన ప్రాణానలముల శక్తి సంగీతములో ఉంది. అందుకే అతి పవిత్రమైనది, మహత్తరమైనది. ఆ సప్తస్వరముల మేళనలో భావం కలిస్తే ఇక అది మంత్రసమానమే. అటువంటి సంకీర్తనలను శరణాగతితో పాడితే మనలోని మాలిన్యాలు తొలగి, ప్రణవ ప్రేరితమైన దివ్య శక్తి ప్రవేశించి మనలను ఆత్మ సాక్షాత్కారమువైపు నడిపిస్తాయి. కావలసినది ఈ మహత్తు యొక్క జ్ఞానము, పరమాత్మ పట్ల భక్తి మరియు శరణాగతి.

సంగీత జ్ఞానముతో, సంకీర్తనలతో శివతత్త్వాన్ని, తద్వారా మోక్షాన్ని పొందగలమని త్యాగరాజుల వారు సారమతి రాగంలో మనకు తెలియజేస్తున్నారు.

ఈ భావపూరితమైన త్యాగరాజస్వామి వారి కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారి గాత్రంలో వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి