7, జులై 2015, మంగళవారం

జయ జయ నృసింహ సర్వేశ - అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంపద

జయ జయ నృసింహ సర్వేశ - అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంపద


జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద

మిహిరశశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద

చటుల పరాక్రమ సమఘన విరహిత నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్ర నఖ ప్రహ్లాద వరద

శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజ కోటి ప్రతిమాన
శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద

తాత్పర్యము:

సర్వేశ్వరుడు,భయమును తొలగించే వాడు, ప్రహ్లాదునికి వరములొసగిన వాడు అయిన నృసింహునికి జయము జయము.

సూర్యచంద్రులు నేత్రములుగా కలిగి, సగము దేహము నరునిగా, సగము దేహము సింహముగా వేషము గలిగి, బాహ్యము, లోపల పరిపూర్ణుడైన, ఆదిశేషునిపై అధిష్ఠించి శోభించే వాడు, అనేక గుణ గణములు కలిగిన ప్రహ్లాద వరదునికి జయము జయము

అమితమైన, అనుపమానమైన పరాక్రమము కలవాడు, మూడవ నేత్రము కలిగిన శివుడు, మునులచే నుతించబడిన వాడు, హిరణ్యాక్షుని ఉదరమును చీల్చిన వాడు, వజ్రములాంటి పదునైన గోళ్లు కలవాడు అయిన ప్రహ్లాద వరదునికి జయము జయము

ఎడమ తొడపై లక్ష్మీదేవిని కలిగి, కోటిమంది మన్మథుల అందము కలిగిన వాడు, శ్రీవేంకటాద్రిపై వెలసిన వాడు, పావనమైన చరిత్ర కలవాడు అయిన ప్రహ్లాద వరదునికి జయము జయము

విశ్లేషణ:

అన్నమాచార్యులవారు లక్ష్మీ నృసింహునిపై ఎన్నో సంకీర్తనలను రచించారు. వాటిలో ఫాలనేత్రానల, కదిరి నృసింహుడు, జయ జయ నృసింహ, నగుమోము తోడిదో నరకేసరి, ఆనందనిలయా ప్రహ్లాదవరదా, ఆదిమ పురుషుడు అహోబిలమున, నమామ్యహం మానవసింహం, నమితదేవం భజే నారసింహం, కంటిమి నేడిదె గరుడాచలపతి, ఘోరవిదారణ నారసింహ, నగధర నందగోప నరసింహ, మలసీ జూడరో మగసింహము, ఇలయును నభమును ఏకరూపమై...ఇలా ఎన్నో.

అనేక లక్ష్మీనృసింహ క్షేత్రాలను ఈ సంకీర్తనలలో ప్రస్తావించారు. కదిరి, వేదాద్రి, అహోబిలము, పెంచలకోన ఇలాంటి క్షేత్రాలను అన్నమాచార్యుల వారు దర్శించి ఆ నరహరి అనుగ్రహాన్ని పొందారు. అహంకారాతిశయమున బలగర్వితుడైన హిరణ్యకశిపుని జంపుటకు నృహరి రూపంలో వచ్చి వానిని నఖములతో గ్రుచ్చి చంపి లోక కళ్యాణానికి కారకుడైనాడు. తన భక్తుడైన ప్రహ్లాదునికి అభయమొసగి ఆతనిని రాజ్యాభిషిక్తుడిని చేశాడు.

ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు తన నరసింహోపాసనలో ఒక ప్రత్యేకమైన శైలిని మన ముందుంచారు. ప్రహ్లాదుడ్ని కాపాడటం అనే మౌలిక విషయాన్ని పల్లవి, చరణాలలో పొందుపరచారు. ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు. హిరణ్యకశిపుని వినాశనమునకై నారదాదుల ప్రేరణతో లీలావతి గర్భమున జన్మించాడు. ఆతనికి హరిభక్తిని తల్లి కడుపులో ఉండగనే నారదుడు బోధించి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇది కేవలం దైవకార్యం కొరకే. శాపగ్రస్తులైన జయవిజయులలో ఒకడైన హిరణ్యాక్షుడై సమస్త జంతుజాలములనుండి ప్రాణికోటినుండి మరణం లేకుండా వరమను తప్పసు చేసి పొందిన పిమ్మట లోకకంటకుడవుతాడు.

హరిద్వేషి అయిన హిరణ్యాక్షుడు హరిభక్తుడైన కుమారుని హరిని స్థంభంలో చూపించగలవా అనిప్రశ్నిస్తాడు. ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకనినన్ అందందే గలడు దానవాగ్రణి వింటే అని పరిపూర్ణమైన విశ్వాసము, భక్తితో సమాధానం చెబుతాడు. ఉగ్రుడైన హిరణ్యకశిపుడు స్థంభమును గదతో ఛేదించగా ఫెళ ఫెళ ధ్వనులతో ఉగ్ర నరసింహుడు అవతరించి హిరణ్యాక్షుని ప్రేగులను నఖములతో చీల్చి త్రెంచి, ఆతని రక్తమును తాగి ఉగ్రసింహమువలె ఊగిపోతాడు. అప్పుడు దేవతలు, ప్రహ్లాదుడు అతనిని శాంతపరచగా, శ్రీహరి తన నిజస్వరూపమును చూపి ప్రహ్లాదునికి అభయమిస్తాడు.

మొత్తం సంకీర్తనలో ముఖ్యమైన అంశాలు - ప్రహ్లాదుని రక్షించిన ఆ నారసింహుడెలా ఉన్నాడు?  - సూర్య చంద్రులు నేత్రాలుగా కలిగి, విశ్వమంతటా తానేయై యుండి, అనేక గుణ గణ శోభితుడైన వాడు. ఆ నారసింహుని పరాక్రమము అసమానమైనది. వజ్రముల వంటి గోళ్లతో కుటిలుడైన రాక్షసుని ఉదరమును చీల్చిన వాడు. శాంతరూపంలో లక్ష్మీదేవిని ఎడమతొడపై కలిగిన విష్ణుమూర్తి అందములో కోటి మన్మథులకు సమానుడు. ఆతడే శ్రీవేంకటగిరిపై వెలసిన పరమ పావనుడు.

అన్నమాచార్యుల వారు దశావతారములలో నృసింహుని మొదలు కృష్ణుని వరకు వేనోళ్ల నుతించాడు. అన్నిటా పరమార్థము శ్రీవేంకటేశ్వరుడే. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునిలో అన్ని రూపములను దర్శించి రమ్యంగా వర్ణించారు. ఉగ్ర దేవతా రూపమైన నారసింహుని ఎంతో అద్భుతంగా వర్ణించారు. సంస్కృతంలో రచించబడిన ఈ కీర్తనలో పదప్రయోగం అవతార లక్షణాలను, అవతార లక్ష్యాన్ని ప్రతి పదంలోనూ ప్రతిబింబించారు. అందుకే అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులలో శ్రేష్ఠుడైనాడు. సద్గురువుగా శాశ్వతస్థానాన్ని పొంది మనకు మార్గదర్శకులైనారు.

హరియవతారమీతడు అన్నమయ్య! అరయ మా గురువీతడు అన్నమయ్య!

ఎస్పీ శైలజ మరియు బృందం పాడిన ఈ సంకీర్తనను వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి