6, సెప్టెంబర్ 2015, ఆదివారం

కలువ యొక్క పరిణామాలు - మానవ జీవితానికి సారూప్యత


కలువపూవు యొక్క పగలు రాత్రి పరిణామాలు మానవునికి ఎంతో మార్గదర్శకం. ఈ ప్రక్రియ మానవుని జీవితానికి ప్రతిబింబం. ఈ పుష్పానికి గల ప్రత్యేకమైన లక్షణాలను, మానవ జీవితానికి గల సారూప్యతను దగ్గరగా పరిశీలిద్దాం.

1. మురికి, బురదనీటినుండి కలువ బీజం నీటిమొక్కగా ఆవిర్భవిస్తుంది. కర్మఫలముల సంకెల వలన కలిగే కష్టాలతో కూడినది మానవ జన్మ. ఆ సంకెలకు ప్రతీక ఈ బురదనీరు. ఎన్నో కష్టాల మధ్య కొన్ని సుఖాలు మానవ జీవితం. ఎంత బురద నీరైతే అంత అందమైన కలువ పుడుతుంది. ఎంత కష్టమయ జీవితమైతే అంత సుందరమైన వ్యక్తిత్వం మానవునికి కలుగుతుంది.

2. కలువు మొక్క యొక్క బీజాలు మానవుని పుష్టికి, శక్తికి, సామర్థ్యానికి ప్రతీక. ఈ బీజాలలో అద్భుతమైన లోపరహితమైన, ఆకార సారూప్యత గల ఆకుల రూపం దాగి ఉంటుంది. నీటి ద్వారా ఆ బీజాలు కావలసిన శక్తితో అనుసంధానమై మనోహరమైన ఆకులుగా పరిణమిస్తాయి. అదే మనిషి సామర్థ్యాన్ని దైవ శక్తితో అనుసంధానం చేసి జీవన పరిణామంలో దివ్యత్వ సాధనకు ప్రతీక. మనిషి ముందడుగుకు సంకల్పం మూలం. బీజమే సంకల్పానికి ప్రతిబింబం.

3. ఆ బురదనుండి పుడుతుంది అందమైన పువ్వు యొక్క బలమైన కాడ. కష్టాలను దాటుతూ, అనుభవాలతో గట్టిపడేది మానవుని వ్యక్తిత్వము. అదే పువ్వు యొక్క కాడ.  ఇది బలంగా ఉన్నా, వంచితే వంగుతుంది. అంటే, దృఢమైన వ్యక్తిత్వమున్నా మనిషి పరిస్థితులను బట్టు తన్ను తాను మలచుకోగలడు. కాడ మనిషి లాఘవాన్ని సూచిస్తుంది.

4. కలువ పూవు వికసించటం అంటే మనిషి అనుభవాలు, జీవిత పాఠాల ద్వారా జ్ఞానాన్ని పొంది తన వ్యక్తిత్వ వికాసం చేసుకోవటం. ఎలా అయితే కలువ రెక్కలు సూర్యుని కాంతితో నెమ్మదిగా విచ్చుకుంటాయో, అలాగే మనిషి వ్యక్తిత్వం జ్ఞానమనే వెలుగుతో వికసించి దివ్యత్వాన్ని పొందుతుంది. వికసించిన కలువ దివ్యత్వానికి ప్రతీక.

5. రోజంతా సూర్యుని కాంతితో అనుసంధానమై కలువు విప్పి ప్రకాశించి లోకానికి ఆనందదాయకమవుతుంది. జ్ఞాని కూడా అంతే. తన జ్ఞానజ్యోతితో లోక కళ్యాణానికి పాటుపడతాడు.

6. సూర్యాస్తమయం తరువాత కలువ ఎలా విచ్చుకుందో అలాగే ముడుచుకుంటుంది. మరుసటిరోజు సూర్యునితో అనుసంధానమై మరో ఆరంభం. జ్ఞాని కూడా రాత్రి సమయాన తనలోని మాలిన్యాలను తొలగించుకుంటాడు. మరుసటిరోజు జీవితం పునః ప్రారంభమవుతుంది. జ్ఞానికి ప్రతి రాత్రి ఒక మరణం, ప్రతి ఉదయం ఒక జననం. నిన్నటితో పనిలేదు. నేటిలోనే జీవితం, నేదే రేపటికి పునాది.

మానవ జీవితానికి ఇంతటి ప్రత్యక్ష సారూప్యత గల కలువ అందుకే సగుణోపాసనలో ఎంతో ముఖ్యమైన స్థానం పొందింది. సమస్త దేవతలకు కలువలతో అర్చన ఎంతో ప్రియం. సూర్యునికి ఎర్రని కలువలతో పూజ చేస్తే ఎంతటి రోగాలైన హరిస్తాయి అన్నది సనాతన ధర్మం చెప్పిన విషయం. ఎర్రని కలువలను దాదాపు ప్రతి దేవతా మూర్తీ చేతిలో ధరించినట్లుగా మన వాఙ్మయాలు చెబుతున్నాయి. వీలైతే ఏడాదికోమారు 108 కలువలతో మీకిష్ట దైవాన్ని కొలిచే ప్రయత్నం చేయండి. తప్పక తదనుగుణమైన ఫలితం లభిస్తుంది.

రాబోయే వినాయక చతుర్థి నాడు స్వామిని ఎర్రని తెల్లని కలువలతో పూజించండి. స్వామి సంతుష్టుడవుతాడు. సర్వే జనాః సుఖినోభవంతు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి