24, అక్టోబర్ 2015, శనివారం

పాయోజి మైనే - మీరా భజన్



ఇక్ష్వాకు వంశార్ణవ జాత రత్నం
సీతాంగనా జీవన భాగ్య రత్నం
వైకుంఠ రత్నం మమ భాగ్య రత్నం
శ్రీరామ రత్నం శిరసా నమామి

- శ్రీరామకర్ణామృతం

పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో

వస్తు అమోలిక్ దీ మేరే సద్గురు కిర్పా కర్ అప్నాయో పాయోజి మైనే

జనం జనం కీ పూంజీ పాయీ జగ్ మే సభీ ఖోవాయో పాయోజి మైనే

ఖర్చై న ఖోటై చోర్ న లూటై దిన్ దిన్ బఢత్ సవాయో పాయోజి మైనే

సత్ కి నావ్ ఖేవటియా సద్గురు భవ్ సాగర్ తర్వాయో పాయోజి మైనే

మీరా కే ప్రభు గిరిధర్ నాగర్ హరఖ్ హరఖ్ జస్ గాయో పాయోజి మైనే

- మీరాబాయి 

భావం:

సజ్జనులారా! నేను నామమనే రత్నాన్ని (రామనామము) ధనంగా పొందాను. ఈ అమూల్యమైన బహుమతిని నాకు సద్గురువులిచ్చారు. నేను కృతజ్ఞతతో స్వీకరించాను. ప్రాపంచిక వస్తువిషయాలన్నీ కోల్పోయినా, ఎన్నెన్నో జన్మల పుణ్యానికి లభించే ఈ రామనామమనే సంపదను ఈ జన్మలోనే పొందాను. ఏ దొంగా దొంగిలించలేనిది ఈ సంపద. ఎంత ఖర్చుపెట్టినా మరింత పెరిగే ఈ రామనామమనే సంపదను పొందాను. సత్యమనే నావలో సద్గురువుల అనుగ్రహంతో భవసాగరాన్ని దాటాను. మీరాకు ప్రభువైన ఆ గిరిధరుని కీర్తిని హర్షముతో గానము చేస్తున్నాను.

వివరణ:

మధురభక్తికి మరో పేరు మీరాబాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ భక్తురాలు ఎన్నో కఠిన పరీక్షలను, సామాజిక వివక్షను ఓర్చి తన కృష్ణభక్తిని చాటింది. ఆమె భక్తి విషాన్ని కూడా భగవతుని రూపంగా మార్చివేసింది. ప్రస్తుతపు రాజస్థాన్‌లో జన్మించి ద్వారకలో స్వామిలో ఐక్యమైన ఈ భక్తురాలు తన భావాలను అద్భుతమైన పదాలుగా అందించింది. భారతదేశపు భక్తి సంగీతంలో మీరా రచనలు ఉత్తమ భజనలుగా శాశ్వతమైనాయి. మధురభక్తిలో తనను తానే స్వామిని సమర్పించుకొని స్వామితో రమించే భావజాలం ఎందరో మహానుభావులు తమ సాహిత్యంలో కనబరచారు. అన్నమాచార్యులు, క్షేత్రయ్య, గోదా, మీరా వీరిలో ప్రముఖులు. భగవంతునికే అంకితం అయిన మీరా భజనల్లో భక్తి సువాసనలు పుష్కలం. అటువంటిదే ఈ పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో. వ్రజ భాషలో మీరా రచనలు చేసింది. అది హిందీ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్రజ, అవధ్ అనేవి రెండు ద్వాపర యుగం నుండి శ్రీకృష్ణుడు తిరిగిన ప్రాంతాలలో ప్రజల భాషలు. వీటినుండే హిందీ జన్మించింది. ఈ వ్రజ భాషకు దేవనాగరి లిపి. ఇప్పటికీ రాజస్థాన్, హర్యాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వ్రజ భాషా మాట్లాడుతారు.



ఈ భజనలో మీరా రామనామమనే సంపద వలన తనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అద్భుతంగా నుతించారు. అసలు రామనామమెంత అమూల్యమైనదో, అది సద్గురువుల అనుగ్రహం వలన తనకు లభించిన సంపదగా ఆమె అభివర్ణించారు. తనకున్న సంపదలన్నీ పోయినా ఎన్నో జన్మలెత్తినా కూడా లభించని  రామనామమనే సంపదను గురువులు రవిదాసు గారు ఆమెకు అందించారని కొనియాడారు. దొంగలు దోచుకోలేనిది, ఎంత పంచితే అంత విలువ పెరిగేదిట రామనామ సంపద. నిజమే కదా? మనకు తెలిసిన తారక మంత్రము ఎంత మందికి అందితే దాని విలువ మరింత పెరుగుతునే ఉంది. ఎందరో మహానుభావులు ఈ రామనామంతో జనన మరణాల వలన కలిగే కష్టాలను, దుఃఖాన్ని అధిగమించి మోక్షం పొందారు. ఈ ప్రపంచంలో ఒక్కటే సత్యం. అదే భగవంతుడు. సంసారమనే దుర్భరమైన సాగరాన్ని సత్యమనే నావలో గురువులు నన్ను దాటించారు అని ఎంతో భావగర్భితంగా మీరాబాయి స్తుతించారు. రాముని నామం రుచి తెలిసిన వారికి వేరేదీ రుచించదు. దానినే స్మరిస్తూ అందులోనే తరించారు. అదే విధంగా మీరా కూడా తాను నమ్ముకున్న దైవాన్ని స్మరిస్తూ భగవంతునిలో లీనమైంది. నేను అన్న భావన వదిలి, దేహం యొక్క వాసనలను త్యజించి జీవాత్మను శుద్ధి చేస్తే అదే పరమాత్మ రూపం అని తెలిసి ముక్తిని మహానుభావులలో మీరా అగ్రగణ్యురాలు. ఈ కర్మభూమిలో మీరాబాయికి గల స్థానం పవిత్రమైనది, ఉన్నతమైనది.

లతా మంగేష్కర్ గారి గళంలో ఈ భజన వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి