18, జూన్ 2016, శనివారం

త్యాగరాజ హృత్కమలము - శాంతము లేక సౌఖ్యము లేదు


యోగులైన వారు ఒక్కరోజులో ఆ స్థితిని పొందరు. అది ఓ ప్రస్థానం. ఈ యానంలో జీవితంలోని సంఘటనలు, చుట్టూ ఉండే వారి ప్రభావం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గృహస్థాశ్రమంలో భార్యకు ఉన్న పాత్ర మగవాడిని సరిదిద్దటంలో అతి ముఖ్యమైనది. ఇది మనలాంటి వారికే కాదు, త్యాగరాజస్వామి వంటి యోగులకు కూడా వర్తించింది. అటువంటి ఒక సంఘటన, తద్వారా వెలువడిన అద్భుతమైన కృతి వివరాలు తెలుసుకుందాము.

త్యాగయ్యకు ఎందరో శిష్యులు. వారు ఒకసారి పిలవని పెళ్లికి వెళ్లి అక్కడ ఒక నర్తకి ప్రదర్శిస్తున్న జావళి చూసి వినోదించి ఇంటికి వచ్చి మరునాడు ఆ జావళి పాట పాడుతుంటే త్యాగరాజస్వామికి విపరీతమైన కోపం వచ్చింది.

"మూర్ఖులారా! పిలవని పెళ్లికి నా అనుమతి లేకుండా వెళ్లటం మొదటి తప్పు. అక్కడ వినోదం కోసం నాట్యం చేస్తున్న స్త్రీని చూసి మీ సంయమనాన్ని కోల్పోవటం రెండో తప్పు; దాన్ని నా పవిత్రమైన గృహంలో సిగ్గు లేకుండా పాడటం మూడో తప్పు..ఇంక ఏమి చెప్పను? ఈ పూటకు మీకు భోజనం లేదు, బయటకు వెళ్లండి" అని కోపంతో చెప్పాడు. ఆయన భార్య ఆ పూట కరుణ, దయ మరియు ధైర్యం చూపక పోతే ఆ రోజు మొత్తం వారికి భోజనం ఉండేది కాదు.

భార్య: "మృదువుగా మాట్లాడటం ఒక గురువుకు ప్రధాన లక్షణం కదా?"

త్యాగయ్య: "నిజమైన సున్నితత్వం సమయస్ఫూర్తితో జరిగే దిద్దుబాటు కాదా"

భార్య: "దిద్దుబాటు ఆవేశంతో కూడి ఉండాలని ఉందా?"

త్యాగరాజు: "ముల్లు, గులాబీ కలిసే పెరుగుతాయి కదా"

భార్య: "కానీ, మనుషులు గులాబీని కోసి, ముల్లుని త్రెంచివేస్తారు కదా?"

త్యాగయ్య: "నిజమే. నన్ను సరిదిద్దావు. ప్రేమించే వాడే సరిదిద్దుతాడు. మనిషికి ఇంద్రియాలపై నిగ్రహం ఉండవచ్చు, వేదవేదాంతాలు చదివి ఉండవచ్చు, భార్యా బిడ్డలు, సిరి సంపదల అనుగ్రహం పొంది ఉండవచ్చు, జపతపాదుల ఫలం పొంది ఉండవచ్చు, యజ్ఞ యగాదులు చేసి ఉండవచ్చు, ఇతరుల మనస్తత్త్వాన్ని ఎరుక పరచే ప్రజ్ఞ కలిగి ఉండవచ్చు, భాగవతోత్తమునిగా పేరొంది ఉండవచ్చు. కానీ, ఆవేశాన్ని నిగ్రహించుకోలేకపోతే అట్టి వాని కోపము అతనికి ఆనందాన్ని దూరం చేస్తుంది. శాంతం కరువవుతుంది"

ఈ సంఘటన త్యాగయ్య నోట "శాంతము లేక సౌఖ్యం లేదు" అనే అద్భుతమైన కృతిగా సామ రాగంలో వెలువడింది. ఇది ఆయన జీవితంలో పెద్ద మలుపు. తన బలహీనతను అధిగమించే సాధనమై యోగిని చేసింది.

- ఎం.ఎస్ రామస్వామి అయ్యరు గారు "త్యాగరాజ, ఎ గ్రేట్ మ్యూజీషియన్ సెయింట్" అనే పుస్తకంలో - 1927.

శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళ నయన
దాంతుని కైన వేదాంతుని కైన
దార సుతులు ధన ధాన్యము లుండిన
సారెకు జప తప సంపద కల్గిన

యాగాది కర్మములన్నియు చేసిన
బాగుగ సకల హృద్భావము తెలిసిన

ఆగమ శాస్త్రములన్నియు చదివిన
భాగవతులనుచు బాగుగ పేరైన

రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ
రాజ వినుత సాధు రక్షక తనకుపశాంతము లేక సౌఖ్యము లేదు

నిత్యశ్రీ మహదేవన్ గారి గళంలో ఈ కృతి వినండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి