2, ఏప్రిల్ 2017, ఆదివారం

పలుకే బంగారమాయెనా - రామదాసు కీర్తన


పరమాత్మతో వాగ్గేయకారుల సంభాషణలు చాలా సందర్భాలలో వారి వారి మానసిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉంటాయి. విన్నపాలనుండి శరణాగతి వరకు ఎన్నెన్నో ఈ సంభాషణలలో ఉన్నాయి. రాముని నమ్ముకొని రాముని సేవకే జీవితాన్ని అంకితం చేసిన కంచెర్ల గోపన్న తన వృత్తిలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. తానీషా ప్రభువుచే కారాగారం పాలై కఠినమైన పరిస్థితులను ఎన్నుకున్నాడు. కారాగారంలోనే రామునిపై ఎన్నో సంకీర్తనలను రచించాడు. అతనికి అనన్యమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి రాముడు కరుణించి అతనిని విముక్తుడను చేశాడు. ఆ దుర్భరమైన పరిస్థితులలో ఆయన నోట వచ్చిన కృతులలో పలుకే బంగారమేయ్నా ఒకటి. వివరాలు:

పలుకే బంగారమాయెనా కోదండ పాణి 

పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి 
కలలో నీ నామ స్మరణ మరవ చక్కని తండ్రి

ఇరువుగ నిసుకలోన బొరలిన యుడుత భక్తికి 
కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి

రాతిని నాతిగ జేసి భూతలమున ప్ర 
ఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి

ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు 
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి

శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గాద 
కరుణించు భద్రాచల వర రామదాస పోషక 

అర్థం:

ఓ కోదండరామా! నీ పలుకే కరువాయెను. పిలిచినా కూడా పలుకకున్నావు. కలలో కూడా నీ నమస్మరణను నేను మరువకున్నాను చక్కనైన నా తండ్రీ! లంకకు వారధి నిర్మాణం చేసే సమయంలో తనకు చేతనైన స్థాయిలో వినమ్రంగా ఇసుకలో పొరలి తోడ్పడిన ఆ ఉడుత భక్తికి మెచ్చి, కరుణించి బ్రోచినావని నేను బాగా విశ్వసించితిని తండ్రీ! నీ పలుకే బంగారమాయె. శిలయై యున్న అహల్యకు మరల జీవచైతన్యాన్నిచ్చి ఈ భూలోకములో పేరుపొందినావని ఇష్టపూర్వకముగా నమ్మినాను తండ్రీ! నిన్ను ఎంత వేడుకున్నా నీకు ఇంచుక కూడా దయ కలుగుట లేదు. నువ్వు పంతము చేయుటకు నేనెంతటి వాడనయ్యా! శరణాగతులను కాపాడే వాడిగా నీవు బిర్దునుపొందినావు. ఈ భద్రాచల రామదుసును పోషించే వాడవు, నన్ను కరుణించు స్వామీ!

వివరణ:

రామదాసు జీవితం మనకు ఆధ్యాత్మిక జీవితానికి ఉత్తమమైన ఉదాహరణ. ధర్మబద్ధమైన ఉపాధితో ఆధ్యాత్మిక పురోగతిలో పరమాత్మపై విశ్వాసంతో జీవితంలో వచ్చే కష్టాలను ఎలా దాటవచ్చో రామదాసు జీవితం మనకు తెలుపుతుంది. శరణాగతి, అచంచలమైన భక్తి విశ్వాసములతో అత్యంత కఠినమైన పరిస్థితులను దాటవచ్చు అని రామదాసు నిరూపించారు. ఆ ప్రయాణంలో ఆయన తన శరణాగతిని, ఆర్తిని అనేక విధాలుగా వ్యక్తపరచారు. ఈ పలుకే బంగరమాయెనా కృతిలో ప్రశ్నిస్తున్న భావన గోచరించినా, అంతర్లీనంగా చరణాలన్నిటిలోనూ ఆ రాముని మహిమలను పలుకుతూ తనను కాపడమన్న వేడుకొను భావం ప్రస్ఫుటమవుతుంది. వారధి బంధనంలో ఉడుతను బ్రోచిన ఉదంతం, వేల ఏళ్ల పాటు శిలయై నిలిచిన అహల్యకు విముక్తి కలిగించటం, ప్రస్తావించారు రామదాసు. ప్రశ్నిస్తూనే శరణు అని వేడుకోవటం వాగ్గేయకారుల విలక్షణమైన పద్ధతి. రామదాసు కూడా ఈ లక్షణాన్ని చాలా కీర్తనలలో పలికించారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు భద్రాచల రామదాసు కీర్తనలను అజరామరం చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పాడిన కృతులు ఇప్పటికీ తెలుగు ఇళ్లలో వినబడుతూనే ఉంటాయి. వారి గళంలో పలుకే బంగారమాయెనా వినండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి