29, జులై 2017, శనివారం

కదిరి నృసింహుడు కంబమున వెడలె - అన్నమాచార్యుల సంకీర్తన


కదిరి నృసింహుడు కంబమున వెడలె
విదితముగా సేవించరో మునులు 

ఫాల లోచనము భయదోగ్రముఖము
జ్వాలామయ కేసరములును
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలగతి ధరియించుక నిలిచె 

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడనదరెడి కటములును
నిడుద నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసె 

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూని
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివొ

- సద్గురువు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

నరసింహావతారంపై అన్నమాచార్యుల వారు ఎన్నో కీర్తనలు రచించారు. వాటిలో ప్రత్యేకమైనది ఈ కదిరి నృసింహుడు కంబమున వెడలె. అనంతపురం జిల్లాలోని ఖాద్రి నరసింహస్వామి క్షేత్రం సనాతనమైనది. ఖాద్రి అనగా బ్రహ్మదారువు చెట్టుతో చేయబడిన స్థంభము. హిరణ్యాక్షుని వధించటానికి నరహరి రూపంలో శ్రీమహావిష్ణువు ఆ ఖాద్రియందు అవతరించాడు. అందుకే ఆ క్షేత్రానికి ఖాద్రి నరసింహుడు అని పేరు వచ్చింది. కాలగమనంలో కదిరిగా మారింది. ఆ కదిరి నరసింహుని అవతరణికను అన్నమయ్య ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు.

కంబమునుండి వెడలిన ఆ నరసింహుని సేవించండి మునులారా అని అన్నమయ్య ఈ సంకీర్తనను ఆరంభించారు. అగ్ని నేత్రముతో, భయము కలిగించే ఉగ్రమైన ముఖముతో, జ్వలించే కేసరములతో, ప్రళయకాల రుద్రుని వలె భీకరమైన దంతములతో హేలగా నిలిచినాడు. ముడి పడిన కనుబొమ్మలు, బుసలు కొట్టే ఉచ్ఛ్వాస-నిశ్శ్వాసలతో, గడ గడ అదరుచున్న చెక్కిళ్లతో, బయటకు వెడలియున్న నాలుకతో, నిక్కబొడుచుకున్న చెవులతో, ప్రత్యేకమైన రూపంగా వెలసినాడు. సమస్త ఆయుధములు, ఎంచలేని భుజములు కలిగి భీకరమైన గోళ్లతో వేగముగా కదలుచు దుష్టులైన దానవులను సంహరించటానికి ఆ శ్రీవేంకటేశ్వరుడు (నరసింహుడు) అవతరించినాడు.ఆతని సేవించండి!

ఈ సంకీర్తన అఠాణ రాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు అద్భుతంగా ఆలపించారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి