29, జులై 2017, శనివారం

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన - అన్నమాచార్యుల సంకీర్తన


తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు

కలికి కావేరి తరగల బాహులతలనే 
తలగకిటు రంగ మధ్యపు తొట్టెలను
పలుమారు దనునూచి పాడగా నూగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

వేదములే చేరులై వెలయంగ శేషుడే
పాదుకొను తొట్టెలై పరగగాను
శ్రీదేవితో గూడి శ్రీవేంకటేశుడై
సేదదీరెడి వాడె శ్రీరంగశిశువు

తొలుత మఱ్ఱాకుపై వైభవంగా తేలియాడిన వాడు,వటపత్రశాయిగా పేరొందిన వాడు ఈ శ్రీరంగ శిశువు. లతలవంటి కావేరీ తరంగాలు బాహువులుగా,  పాటలు పాడబడుచు పెదవుల మూలలలో పాలు కలిగిన అందమైన బాలుడు శ్రీరంగములో తొట్టెలలో ఊగుచున్నాడు. వేదాలే హారములుగా ఆది శేషుడే ఊయలగా ఒప్పుగా లక్ష్మీదేవితో కూడిన వేంకటేశుడు సేదదీరుచున్నాడు. అతడే శ్రీరంగ శిశువు.

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు.

నీలాంబరి రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆ శ్రీరంగంలోని చిన్ని కృష్ణుడు ఊయలలో ఊగే సేవను అద్భుతంగా తలపిస్తుంది. పాలు తాగి ఊయలలో ఆ చిన్ని కృష్ణునికి తిరువారాధనలో పాటలు పాడుచుండగా ఊగే మనోజ్ఞమైన దృశ్యాన్ని అన్నమయ్య మనకు ఈ సంకీర్తన ద్వారా ఆవిష్కరించారు. పాలకడలిలో ఆదిశేషునిపై సేదదీరే లక్ష్మీపతి, మార్కండేయుని తపస్సుకు మెచ్చి అతనిని మఱ్ఱాకుపై వెలసిన బాలుని ఉదరములోనికి ప్రవేశింపజేసి విశ్వ రహస్యాన్ని తెలుపుతాడు. ఆ వటపత్రశాయే ఈ బాలకృష్ణుడు అని అన్నమయ్య తెలిపారు.


(చిత్రం వటపత్రశాయి అలంకారంలో ఉడిపి శ్రీకృష్ణుడు)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి