29, జులై 2017, శనివారం

భజరే చిత్త బాలాంబికాం - ముత్తుస్వామి దీక్షితుల ఆధ్యాత్మిక సంపద


భజరే చిత్త బాలాంబికాం భక్త కల్ప లతికాం

నిజరూప దాన దక్ష చరణం
అరుణాం నిత్యాం కళ్యాణీం శర్వాణీం

శ్రీ వాగ్భవ కూట జాత చతుర్వేద స్వరూపిణీం
శృంగార కామ రజోద్భవ సకల విశ్వ వ్యాపినీం
దేవీం శక్తి బీజోద్భవ మాత్రృకార్ణ శరీరిణీం
దేవనుత భవ రోగ హర వైద్యపతి హృదయ విహారిణీం
భావ రాగ తాళ మోదినీం భక్తాభీష్ట ప్రదాయినీం
సేవక జన పాలన గురుగుహ రూప ముద్దు కుమార జననీం

ఓ మనసా! భక్తుల పాలిట కల్పతరువైన బాలాంబికను భజింపుము. నిజరూప దర్శన భాగ్యము కలిగించే చరణములు కలిగి, సూర్యకాంతి కలిగి, శాశ్వతమై, శుభకరమైన శర్వుని పత్ని అయిన ఆమ్మను భజింపుము. వాగ్భవ కూట బీజాక్షరములనుండి (లలితాదేవి పంచదశాక్షరీ మంత్రములోని మొదటి ఐదు బీజాక్షరాలైన క ఏ ఈ ల హ్రీం అనే అక్షర సంపుటిని వాగ్భవ కూట అంటారు) జన్మించిన, నాలుగు వేదాల స్వరూపిణి అయిన, శృంగార రూపిణిగా కామ రజో కూట బీజాక్షరములనుండి (పంచదశాక్షరిలోని తదుపరి ఆరు అక్షరాలు హ స క హ ల హ్రీం కామ రజో కూట అంటారు) ఉద్భవించిన, సమస్త లోకములు వ్యాపించియున్న బాలాంబికను భజించుము. శక్తి కూట బీజాక్షర సంపుటి నుండి (పంచదశాక్షరిలోని తదుపరి నాలుగు బీజాక్షరాలు స కల హ్రీం శక్తి కూటగా అంటారు) జన్మించిన, ఈ విధంగా అక్షరమాలా శరీరిణి అయిన దేవిని భజింపుము. దేవతలచే నుతించబడిన, ఈ దేహరోగములను హరించే వైద్యనాథుని హృదయ విహారిణి అయిన, భావము, రాగము, తాళములచే మోదము పొందే, భక్తుల కామ్యములను ప్రసాదించే అమ్మను భజించుము. సేవించే జనులను పాలిచించే, గురుగుహ రూపమైన కుమారస్వామి జనని అయిన బాలాంబికను భజింపుము.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

దీక్షితుల వారు గొప్ప శ్రీవిద్యా ఉపాసకులు. మంత్ర సిద్ధి ద్వారా అమ్మ అనుగ్రహం పొందిన ఆధ్యాత్మిక సంపన్నులు. ఈ సాధనలోనే ఆయన అద్భుతమైన కీర్తనలు రచించారు. ఆయన కృతులలో మంత్ర శాస్త్రం ప్రకాశిస్తూ ఉంటుంది. బీజాక్షర యుతమై, లలితాసహస్ర నామావళి తత్వార్థ ప్రస్ఫుటమై ఉంటాయి. గురుగుహ అనే ముద్రతో ఆయన కీర్తనలు గుర్తించబడతాయి. కుమారస్వామిని గురుగుహునిగా కొలుస్తారు. దీక్షితుల వారు తనను ఆ అమ్మ తనయునిగా భావించి కొలిచి అనుగ్రహం పొందిన వాగ్గేయకారులు.  ఆయన రచించిన కమలాంబ నవావరణ కీర్తనలు, క్షేత్ర ప్రాధాన్యమైన కృతులు, నవగ్రహ కృతులు ఈ ఆధ్యాత్మిక సంపదతో నిండినవే. అటువంటిదే ఈ బాలాత్రిపురసుందరి కృతి. లలితాదేవి తత్వాన్ని ఆవిష్కరించే ఈ కృతిలో పంచదశాక్షరీ మంత్ర సంపుటిలోని బీజాక్షరాలను ప్రస్తావించే వాగ్భవ, కామ రజో, శక్తి కూటములను ప్రస్తావించి ఆయన తన మంత్రశాస్త్ర జ్ఞానాన్ని మనకు తెలియజేశారు. అంతే కాదు అమ్మ మహిమా వైభవాలను కూడా చక్కగా నుతించారు. కళ్యాణి రాగం అత్యంత శుభకరమైనది, ఆహ్లాదకరమైనది. గుణ వైభవ వర్ణనలకు ఈ రాగం ఎంతో ఉపయుక్తమైనది. భావయుక్తమైన పదాలతో, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న చరణంతో దీక్షితుల వారు తన శ్రీవిద్యా ఉపాసనా బలానికి అక్షర రూపం ఇచ్చారు. తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని కామరసవల్లిలో పార్వతీపరమేశ్వరులు సనాతనులై వెలసిన క్షేత్రం కర్కోటేశ్వర-బాలాంబిక దేవస్థానం. తిరువాయూరుకు ఉత్తరంగా కావేరీ నదికి ఆవల ఉన్న క్షేత్రం ఇది. వేళ ఏళ్ల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో బాలాత్రిపురసుందరిగా అమ్మ కొలువబడుతుంది. ఆ అమ్మను నుతిస్తూ దీక్షితుల వారు ఈ కృతిని రచించారు.

యేసుదాసు గారి గళంలో ఈ భజరే చిత్త బాలాంబికాం వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి