16, ఆగస్టు 2017, బుధవారం

క్షీరాబ్ది కన్యకకు - అన్నమాచార్యుల అమ్మ వారి నీరాజనం

అమ్మ వారి నీరాజనం ఒకటైన  అన్నమాచార్యుల వారు రచించిన క్షీరాబ్ది కన్యకకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్నమాచార్యుల వారికి సంకీర్తనలలో అమ్మ అలమేల్మంగను ఎన్నో కృతులలో కొనియాడారు. ఈ నీరాజనం సంకీర్తన తెలుగిళ్లలో, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా వినబడుతుంది.


క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని 
నీరజాలయకును నీరాజనం 

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం 
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతి కళలకును నీరాజనం 
జగతినలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

క్షీర సాగర మథనంలో ఆవిర్భించింది కాబట్టి మహాలక్ష్మిని క్షీరాబ్ది కన్యక అంటారు. ఆ అందమైన పదసంపుటిని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనా నీరాజనంలో పల్లవి ఆరంభంలోనే ఉపయోగించారు. ఆ తల్లి అలా ఆవిర్భవించిన వెంటనే శ్రీమహావిష్ణువును వరించింది. నీటీలో పుట్టినది కాబట్టి తామరపూవుకు నీరజ అని పేరు వచ్చింది. ఆ తామరపూవులో నివసించే తల్లిని నీరజాలయగా అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. కలువలవంటి కన్నులు గల తల్లికి, చక్కనైన ఆకృతి కలిగియున్న తల్లికి కర్పూరపు నీరాజనమట, నల్లని కురులతో ఉన్న ఆమె కొప్పుకు, కమలముల వంటి హస్తములకు మాణిక్యాలతో నీరాజనంట. ప్రకాశించే లావణ్యము కల శ్రీవేంకటపతికి పట్టపురాణియై వర్ధిల్లే ఆ తల్లికి యున్న కళలకు నీరాజనమట. ప్రపంచమంతా వ్యాపించే ఆ అలమేలుమంగ చక్కదనాలకు పాటలతో నీరాజనమట. అన్నమాచార్యుల వారి కృతులలో ప్రత్యేకత వారి అనుభూతులు పదములై జాలువారటం. తిఉర్చానూరులో వెలసిన ఆ పద్మావతీ దేవిని చూస్తే ఈ సంకీర్తన ఎటువంటి అనుభూతితో సద్గురువులు రచించారో అర్థమవుతుంది. ఆరాత్రికముగా చెప్పబడి, తరువాత ఆరతిగా రూపాంతరం చెందిన అర్చనా విధి హారతి. పగటి పూట కూడా వెల్గిచించబడి చేయునది కాబట్టి ఆరాత్రికము అయింది. ఇవి ఏక హారతి, దీప హారతి, ధూప హారతి, కర్పూర హారతి, కుంభ హారతి వంటి అనేక రకములు. ఈ కృతిలో అన్నమాచార్యుల వారు కర్పూర నీరాజనంతో పాటు, నవరత్నాలతో, గానముతో నీరాజనం పలికారు.

ఈ సంకీర్తన గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర వైభవం గురించి చెప్పుకోవాలి. అన్నమాచార్యుల వారి కీర్తనలకు కొన్నింటికి ఆవిడ మరింత వెలుగులు దిద్దారు అనిపిస్తుంది. అన్నమయ్య కృతులను శాశ్వతం చేయటంలో సుబ్బులక్ష్మి గారు తనవంతు కృషి చేశారు. ఆవిడలోని పవిత్రత, భక్తి భావాలు ఆమె గానంలో ప్రకటితమవుతాయి. ఆవిడ పాడిన ఈ సంకీర్తన వీడియో చూస్తే అది అర్థమవుతుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి