15, ఆగస్టు 2017, మంగళవారం

నానాటి బతుకు నాటకము - తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తన


నానాటి బతుకు నాటకము 
కానక కన్నది కైవల్యము 

పుట్టుటయు నిజము పోవుటయు నిజము 
నట్టనడిమి కాలము నాటకము 
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్టకడపటిది కైవల్యము 

కుడిచేదన్నము కోక చుట్టేది
నడిమంత్రపు పని నాటకము 
వొడిగట్టు కొనినవుభయ కర్మములు 
గడి దాటినపుడె కైవల్యము 

తెగదు పాపము తీరదు పుణ్యము 
నగి నగి కాలము నాటకము 
ఎగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక 
గగనము మీదిది కైవల్యము

-తాళ్లపాక అన్నమాచార్యులవారు


ఇల్లు-వాకిలి-తల్లిదండ్రులు-పిల్లలు-పనివాళ్లు-కళకళలాడే ఇల్లు-తల్లిదండ్రులు కాలం చెందటం-పిల్లలు పెళ్లిళ్లై బయటకు వెళ్లిపోవటం-భార్య-భర్త/పనిమనిషి-> దంపతుల్లో ఎవరో ఒకరు ముందు పోవటం-> ఒంటరి పక్షి/పనిమనిషి->గూడు చినబోయెరా!ఒక జీవితకాలం చూస్తే ముందు ఏమీ లేదు, వెనుక ఏమీ లేదు. ఓ నాటకంలో పాత్రలు పోషించటం, దేహం శిథిలమైనప్పుడు ఆత్మ కొత్త గూడు వెతుక్కోవటం...నట్టనడుమ ఎందుకీ అహంకారం? అంతా మన చేతుల్లోనే ఉన్నట్లు, మనుషులపై ఆధిపత్యపు పోరు, మౌనయుద్ధాలు..ఉన్నన్నాళ్లూ హాయిగా మనసు తేలికగా ఉంచుకొని సమయం రాగానే కొత్తగూటికి స్వేచ్ఛగా ఎందుకు ఎగిరిపోలేకున్నాము?

మనం మోసుకొచ్చిన బరువులు కొన్నైతే, కొత్తగా వేసుకున్న బరువులు మరిన్ని - సంస్కారాలు, కర్మఫలాలు (సంచిత, ప్రారబ్ధ, ఆగామి)...అన్నీ కలిసి ఆ పక్షిని  ఈ భూమ్మీదే మోక్షం పొందని ఆత్మగా తిప్పి తిప్పి జననమరణమనే చక్రబంధంలో కట్టిపడేస్తున్నాయి. కొన్ని కర్మ ఫలాలు బ్రహ్మజ్ఞానంతో పటాపంచలైతే మరి కొన్ని అనుభవించవలసినదే. కాకపోతే ఆ అనుభవంలో దేహాత్మ స్ఫురణ కలిగిన వానికి తామరాకు మీద నీటిబొట్టులా ఆ కర్మఫలాల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. దీనికి సద్గురువే శరణ్యం. కర్మఫలాలు ఎలా ఉన్నా, జీవితమనే నాటకంలో సంసారబంధాలు,అనుబంధాల వలన కలిగే దుఃఖానికి భక్తి జ్ఞాన వైరాగ్యాములలో ఏదైనా మందే. భక్తితో భారం భగవంతునిపై వేస్తే, జ్ఞానంతో అజ్ఞానం తొలగి స్థితప్రజ్ఞత కలుగుతుంది. ఎవరో కొందరు కారణ జన్ములకు తప్ప ఎక్కువ శాతం మనుషులకు వైరాగ్యము అన్ని అవస్థలు దాటిన తరువాతే పరిపక్వమవుతుంది..ఈ కర్మలు, తద్వారా పాపపుణ్యముల లెక్క ఎప్పటికీ తెగనిదే. ఆ రెండిటి లెక్కలు దాటగలిగితేనే మోక్షము. అందుకు ఉన్నది ఒక్కటే దిక్కు  పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుడు.

ఈ అన్నమయ్య కృతిని సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు రేవతి రాగంలో స్వరపరచగా భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు తితిదే వారి ఆల్బంలో పాడి దానిని శాశ్వతం చేశారు. ఈ సంకీర్తనలోని సందేశం అర్థం చేసుకుంటే జీవితంలో దుఃఖము దూరమవుతుంది. శాశ్వతానందము కలుగుతుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి