19, ఆగస్టు 2017, శనివారం

చలి గాలి వీచింది - రావు బాలసరస్వతి గారి లలిత గీతం


లలిత గీతాల స్వర్ణయుగం రావు బాలసరస్వతి గారితోనే ప్రారంభమైందని వారి పాటలు విన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఈ స్వర్ణ యుగంలో బాలమురళిగారు, ఘంటసాల మాష్టారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, విజయలక్ష్మీ శర్మ గారు, సురేఖా మూర్తి గారు, ఛాయా దేవి గారు, ద్వారం లక్ష్మి గారు..ఇలా ఎందరో గాత్ర సంపద కలిగిన కళాకారులు సాలూరి రాజేశ్వరరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు మొదలైన మహామహుల సంగీతం స్వరపరచగా అద్భుతమైన గీతాలను పాడారు. దేవులపల్లి వారు, వింజమూరి శివరామారావు గారు, రజనీ, పాలగుమ్మి వారు, ఆరుద్ర, దాశరథి గారు మొదలైన రచయితలు అమూల్యమైన లలిత సంగీత సాహిత్యాన్ని మనకు అందించారు.

రావు బాలసరస్వతీదేవి గారి పాటలు శోధించి విన్న కొద్దీ వారిపై గౌరవం ద్విగుణీకృతమవుతోంది. వారి లలిత సంగీత ప్రతిభ అసామాన్యం. సైగల్ గారి ప్రభావం తనపై ఉందని చెప్పుకున్న బాలసరస్వతి గారు వారి శైలిని ఎంతగా తన లలిత సంగీత గానంలో కనబరచారో ఒక్కొక్క గీతంలో మరింత తెలుస్తోంది. భావానికి తేనె అలది అలా సెలయేటి ధారలా తన గళంలో సాహిత్యాన్ని ఒలికించారు వారు. అటువంటి గీతమే చలి గాలి వీచింది. ఈ గీతాన్ని యూట్యూబ్ ప్రకారం వింజమూరి శివరామారావు గారు రచించారని ఉంది. మరో వెబ్ సైట్లో ఆరుద్ర గారని ఉంది. సాహిత్య శైలి చూస్తే శివరామారావు గారి రచనే అని నా భావన. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు అని యూట్యూబ్ ఉవాచ. లలిత సంగీత సామ్రాజ్ఞి బాలసరస్వతి గారని వారి పాటలు వింటే అర్థమవుతుంది. ఈ గీతంలో వారి గళం ఎంత లేతగా ఉంటుందో! సుసర్ల వారి సంగీతంలో లలిత సంగీతం వినటం ఇదే మొదటి సారి.

చలి గాలి వీచింది తెలవారబోతోంది ఇకనైన ఇల్లు చేరవా 
ప్రియా ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా!

ఎదురు తెన్నులు చూచి ఎద బెదిరి పోయింది
నిదురలో పడు తనువు నిలబెట్టుకున్నాను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

బరువాయె నా మేను చెరువాయె కన్నీళ్లు
విరహ వేదనను ఏమో మరి మోయలేను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

ఉత్సాహంగా సాగే ఈ మధురమైన లలిత గీతం బాలసరస్వతి గారి గానంలో ఆలకించి ఆనందించండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి