19, ఆగస్టు 2017, శనివారం

నీ దయ రాదా - త్యాగరాజస్వామి కృతి


నీ దయ రాదా రామ నీ దయ రాదా!

కాదనే వారెవరు కళ్యాణ రామా! 

నను బ్రోచే వాడవని నాడే తెలియ
ఇన వంశ తిలక ఇంత తామసమా!

అన్నిటికికధికారివని నేఁ బొగడితి
మన్నించితే నీ మహిమకుఁ దక్కువా!

రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నా మది తల్లడిల్లగ న్యాయమా వేగమే!


ఓ రామా! నీకు నాపై దయ కలుగదా? నీకు దయ రాకున్ననూ కాదనే వారున్నారా?  ఓ సూర్యవంశ శ్రేష్ఠుడా! నన్ను బ్రోచేవాడవు నీవేనని నీకు ముందే తెలుసు. అయినా ఇంత తామసమా? అన్నిటికీ నీవే అధికారివని నేను నిన్ను నుతించినాను. నన్ను మన్నించితే నీ మహిమకు ఏమైనా తక్కువగునా? త్యాగరాజుని హృదయములో నివసించే ఓ రామా! నా మనసు తల్లడిల్లేలా చేయుట నీకు న్యాయమా? వీగమే నన్ను బ్రోవుము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

నిందాస్తుతిలో త్యాగరాజ స్వామి అనేక కృతులు రచించారు. క్లేశములో ఉన్నప్పుడు భక్తునికి భగవంతునిపై ఆగ్రహం కలగటం అనేది ఎందరో వాగ్గేయకారుల కృతులలో మనం గమనించవచ్చు. తనను బ్రోచుటలో ఆలస్యమెందుకు అని ప్రశ్నించే సంభాషణలో ఎన్నో కృతులు వచ్చాయి. అటువంటిదే నీ దయ రాదా? నిజంగా ఆయనే తనకు దిక్కు అని ప్రతి సాధకునికి తెలుసు. కానీ, ఆశ నిరాశ అయినప్పుడు మనలోని వికారాలు ఒకింత ఒలకటం మానవ సహజం. నీ దయ రాదా అన్న కృతిలో త్యాగయ్య ఇటువంటి భావనలనే వ్యక్తపరచారు. నీ అంతటి వాడు లేడు, నీవు తప్ప వేరే లేరు అని నుతిస్తూనే బ్రోచుటకు తామసమా అని పలికారు. అన్నీ నీవనుకున్నానే, నన్ను కాపాడితే నీ మహిమలకేమైనా తక్కువా అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. నా మనసును కష్టపెట్టడం నీకు న్యాయమా అని నిలదీశారు. భక్తిమార్గంలో అనేక రకలా భావనలు వస్తాయి అన్న దానికి ఈ కృతి మరో నిదర్శనం. వసంతభైరవి రాగంలో త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనను స్వరపరచారు. ఈ కీర్తనను తెలుగు, తమిళ చిత్రాలలో పొందు పరచారు. సుశీలమ్మ పూజ అనే చిత్రంలో ఆలపించగా, యేసుదాసు ఆరు సింధుభైరవి చిత్రంలో ఆలపించారు. యేసు దాసు గారి ఆలాపన ఇదిగో

1 కామెంట్‌: