26, ఆగస్టు 2017, శనివారం

నీ లీల పాడెద దేవా - జానకమ్మ గీతం మరియు చిత్ర విశేషాలు




నీ లీల పాడెద దేవా - 1962లో విడుదలైన మురిపించే మువ్వలు చిత్రంలో జానకమ్మ పాడిన అద్భుత గీతం. తమిళంలో కొంజుం సాలంగై అనే చిత్రం డబ్బింగ్ ఈ చిత్రం. సంగీత దర్శకులు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు గారు. నాయకుడు జెమినీ గణేశన్, నాయిక మహానటి సావిత్రి. సింగార వేలనే దేవా అనే పాటకు ఎవరు నాదస్వరానికి దీటుగా పాడగలరు అని సుబ్బయ్యనాయుడు గారు ఆలోచిస్తూ అప్పటి గాయనీమణులను అడిగితే పి. లీల గారు నాదస్వరం స్థాయి స్వరాలను పాడగలిగే గాత్రం జానకమ్మ గారికి ఉందని వారి పేరును సుబ్బయ్య నాయుడు గారికి ప్రతిపాదించారుట.  అంతే. ఓ అద్భుతం ఆవిష్కరించబడింది. ఊహించలేని గమకాలు, ఆ వేగం. సంగీతం పెద్దగా ఏమీ నేర్చుకోని శిష్ట్లా జానకమ్మ గారి గాత్రంలో నాదస్వర స్థాయికి దీటైన స్వరాలు పలికాయి. ఆ గీతం అజరామరమైంది. తమిళంలో వచ్చిన సింగార వేలనే దేవా అన్న పాటను ఆరుద్రగారు తెలుగులోకి నీ లీల పాడెద దేవా అని అనువదించారు. సుబ్బయ్య నాయుడు గారు శ్రీరాములు నాయుడు గారి పక్షిరాజా స్టూడియోలో పని చేసేవారు. తమిళ సినీ పరిశ్రమలో తొలి సంగీత దర్శకులు వీరు. ఎమ్మెస్ విశ్వనాథన్ గారు వీరి శిష్యులు. అరుణాచలం గారు ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు టీఎన్ రాజరత్నం పిళ్లై గారి శిష్యులు. ఈ చిత్రంలో నాదస్వరం వాయించే సమయానికి ఆయన వయసు 41 సంవత్సరాలు. తరువాత రెండేళ్లకే ఆయన మరణించారు.


కొంజుం సాలంగై రాజుల కాలం నాటి కథ. ఈ చిత్రంలో భరత నాట్య నృత్యాంశాలు కూడా ప్రత్యేకం. నర్తకీమణులు కమలా లక్ష్మణ్, కుచలకుమారి గార్ల మధ్య పోటీగా సాగే నృత్య గీతం ఈ చిత్రానికి మరో ముఖ్యాంశం. జానకమ్మ గారి పాటను ముంబై రామన్ స్టూడియోలో రికార్డు చేయగా అరుణాచలం గారి నాదస్వరాన్ని చెన్నైలో రికార్డు చేశారు. సాంకేతికంగా పెద్దగా వసతులు లేకపోయినా రెండిటినీ అద్భుతంగా మిక్స్ చేసి ఓ రసగుళికను ఆవిష్కరించారు సుబ్బయ్యనాయుడు గారు. కొంజుం సాలంగై అద్భుతమైన సంగీతానికి, నృత్యాలకు, కళ్లకు మిరుమిట్లు గొలిపే సెట్లకు ప్రసిద్ధి. మంచి విజయం సాధించిన ఈ చిత్రం మహానటి సావిత్రి 100వ చిత్రం కావటం విశేషం. ఈ చిత్రం పోలిష్ భాషలో కూడ విడుదలైంది. ఈ చిత్రంలో సుశీలమ్మ, లీలమ్మ, సౌందర్‌రాజన్ గారు, రాధ-జయలక్ష్మి, శూలమంగళం రాజ్యలక్ష్మి గార్లు కూడా పాడారు. ఆద్యంతం సంగీత నృత్య ఘట్టాలతో సాగే 3 గంటల రసరమ్య కావ్యం కొంజుం సాలంగై.



ఇటువంటి ప్రయోగాన్నే 1969లో విడుదలైన హిందీ చలన చిత్రం సచ్చాయీలో ఆశాభోస్లే గానంలో తిరుచెరై శివసుబ్రహ్మణ్య పిళ్ల్లై గారు నాదస్వరం వాయించగా మోరే సైయ్యా పక్డే బైయ్య అన్న గీతంగా చిత్రీకరించారు. దీనికి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్.



నీ లీల పాడెద దేవా ఆభేరి రాగంలో కూర్చబడింది. వల్లీదేవసేనా సమేతుడైన సుబ్రహ్మణ్య స్వామిని నుతించే గీతం ఇది. జానకమ్మ ప్రతిభను శాశ్వతం చేసిన గీతం ఇది. అవలీలగా పాడేశారు ఆవిడ. క్లిష్టమైన సంగతులు కలిగిన ఈ గీత సాహిత్యము.


ఆ ఆ ఆ ఆ
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా

నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా

సింధూర రాగంపు దేవా
 ఆ ఆ ఆఆ  ఆ ఆ ఆ ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా
వల్లి చెలువాలు నిను కోరు నీవు రావా
ఎలమి నీ లీల పాడెద దేవా

అనుపమ వరదాన శీల ఆ
అనుపమ వరదాన శీల
వేగ కనుపించు కరుణాలవాల
ఎలమి నీ లీల పాడెద దేవా

నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా
సగమపని నీ లీల పాడెద దేవా
నిసనిదపమ గామగరిసని పానిసగమపా మగరిస నిదమప గరిని
నీ లీల పాడెద దేవా

సా రీ సా నిసరిసా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా
నినిప మమప నీపనీప సాపనీపసా నిదపమగరి సగసా
గామపనిసా నిసగరిసరిని సాసనీ నిసదని సాసని
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ ఆ ఆ ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ ఆ ఆ
సానిపాని సాసనీ సాసనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిసనిదపా పనిమప సనిదపమ పమగరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని

1 కామెంట్‌: